ఏపీ పోలీసుల తీరుతో ప్రజలంతా ఎంతో తృప్తిగా ఉన్నారు.. హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీలో పోలీసుల తీరుతో హైకోర్టు మెట్లెక్కేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసు నుండి మొదలు పెట్టి న్యాయం కోసం పలువురు హైకోర్టు తలుపు తడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌కుమార్‌(25) ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మృతిచెందాడని, అధికార పార్టీ నేతలు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ జి.హర్షకుమార్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు "అవును.. ఈ రాష్ట్రంలో పోలీసుల బెదిరింపులతో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. కోర్టు కూడా ఆ విషయాన్ని గుర్తించింది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పోలీసులు ముందుగా ఐపీసీ సెక్షన్‌ 324 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బాధితుడు మృతిచెందాక సెక్షన్‌ 302గా ఎందుకు మార్చలేదని విచారణ సందర్భంగా నిలదీసింది. ఈ కేసులో పోలీసులు చట్ట నిబంధనలు పాటించకపోవడం దురదృష్టకరమని, ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న ఇలాంటి కేసులు తమవద్దకు తరచూ వస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

అయితే ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పిల్‌ రాజకీయ కారణాలతో మాజీ ఎంపీ వేశారని తెలిపారు. దీనిపై ఇప్పటికే బాధితుని కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ వేశారని, తరువాత పోలీసుల దర్యాప్తు పట్ల సంతృప్తి చెంది, ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. ఈ కేసుపై పూర్తి వివరాలు సమర్పించేందుకు మరికొంత గడువు కావాలని అభ్యర్థించగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీరియస్ కామెంట్స్ చేసింది. ఐతే పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదిస్తూ జూలై 18న బాధితుని తండ్రి ఫిర్యాదుతో మొదట ఐపీసీ సెక్షన్‌ 324 కింద దాడి చేసిన ఎస్సైపై కేసు పెట్టిన పోలీసులు.. తరువాత ఆయన్ను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారని తెలిపారు. అయితే ఆ యువకుడు మృతి చెందాక జూలై 22న సీఆర్‌పీసీ సెక్షన్‌ 176 కింద మళ్లీ కేసు నమోదు చేశారని, కానీ మేజిస్ట్రేట్‌ సమక్షంలో పోస్టుమార్టం చేపట్టలేదని పేర్కొన్నారు.

 

దీనిపై స్పందించిన ధర్మాసనం "పోలీసులు చట్ట నిబంధనల మేరకు నడచుకోకపోవడం దురదృష్టకరం. ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న ఇలాంటి కేసులెన్నో మా వద్దకు వస్తున్నాయి’’ అని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించి ఈ క్షణమే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించేవారమని, కానీ ప్రభుత్వ న్యాయవాది కౌంటర్‌కు గడువు కోరుతున్నందున అనుమతిస్తున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసు సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు తగినదని కూడా వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌, సీబీఐ విశాఖ ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది.