నిమ్మగడ్డ పై సూపర్ బాస్ కోసం జగన్ మోహన్ రెడ్డి అన్వేషణ!
posted on Mar 19, 2020 3:49PM
అక్బర్ బీర్బల్ కథలు, మహామంత్రి తిమ్మరుసు రాజనీతి సూత్రాలను బాగా ఒంట బట్టించుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు చెక్ పెట్టె విషయం లో అవే పాత ఫార్ములాలతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల కమిషన్ లో మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉండటం తో, ప్రస్తుతం ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలనే విషయం లో ఆయన, మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తో ఇటీవల సమావేశమయ్యారు. సుప్రీమ్ కోర్టు వెలువరించిన తీర్పు నేపధ్యం లో- ఆ ఇద్దరు సభ్యులుగా ఒక మాజీ ఐ ఏ ఎస్ ను, మరో మాజీ ఐ పి ఎస్ అధికారి ని అందులో సభ్యులుగా నియమిస్తే, 2-1 తేడాతో కమిషనర్ నిమ్మగడ్డను కంట్రోల్ చేయాలనేది, చేయవచ్చుననేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ' బీర్బల్ ' ఫార్ములా.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఓపెన్ గానే విమర్శించారు. ఆయన పైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవటంతో..కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పని చేసిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో..మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని..ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించిటం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఒక చీఫ్ కమిషనర్ ను, మరో కమిషనర్ ను నియమిస్తే ఎలా ఉంటుదనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన గా కనిపిస్తోంది. దీనిపైన , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ, న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు.