మూడు పార్టీలు.. ఒకటే ముచ్చట

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.  అయితే, అంతర్గత కుమ్ములాటలు ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమా అంటే కాదు..  అన్ని పార్టీలలో ఉన్నదే.. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలలోనూ అదే పరిస్థితి వుంది.  మూడు పార్టీలలో ఒకటే ముచ్చట నడుస్తోంది. చిన్న గీత పెద్ద గీత అంతే, అదొక్కటే తేడా, మిగిలినదంతా సేమ్  టూ సేమ్. 

అవును..  అన్ని పార్టీలలో, ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీలోనూ ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలను చిన్నా పెద్ద నాయకులు ప్రశ్నిస్తున్నారు. గీత దాటుతున్నారు. నేతలను నిలదీస్తునారు. అంతే కాదు.. ఇదొక అంటూ వ్యాధిలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఒక నాయకుడి నుంచి మరో నాయకుడికి   పాకుతోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలకు పదవీ కాంక్ష ఒక ప్రధాన కారణం అయితే..  రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య పరిధి, పరిమితి రోజురోజుకు కుచించుకు పోవడం మరో ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవీ కాంక్ష పై కొచ్చినప్పుడు బంధాలు, బాంధవ్యాలు కూడా కొట్టుకు పోతున్నాయని అంటున్నారు. నిజానికి, ఈ రోజు బీఆర్ఎస్ లో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తే,  ఇది ఫక్తు పదహారణాల కుటుంబ కలహాల చిత్రం లా సాగుతోందని అంటున్నారు. అన్నా, చెల్లి మధ్య కుర్చీలాటగా మొదలైన వివాదం మెల్లమెల్లగా కుటుంబ పరిధిని, పార్టీ పరిధిని దాటి ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఒక చోటి నుంచి ఒక చోటికి పాకుతూ.. పక్క దారులు పట్టి పోతోంది.  రాష్ట్ర హద్దులు దాటి  జాతీయ మీడియాలోనూ చర్చకు వస్తున్నా పెద్దాయన కేసీఆర్  పెదవి విప్పక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. నిజానికి.. ఆయన తలచుకుంటే, సమస్య ఇంత వరకు వచ్చేది కాదని, అయినా ఆయన మౌనంగా ఉండడమే కాకుండా, మధ్య వర్తిత్వం జరిపేందుకు ముందుకు వచ్చిన కుటుంబ, పార్టీ పెద్దలకు కూడా పర్మిషన్ ఇవ్వ లేదని అంటున్నారు. మరోవంక కవిత, కేసీఆర్ ను కలిసే  అవకాశం వచ్చినా కలవలేక పోయానని,అంటున్నారు. 

మరోవంక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేసిన కామెంట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. అంతో ఇంతో ఇంకా క్రమశిక్షణ బతికున్న పార్టీగా భావించే బీజేపీలోనూ కవిత కామెంట్ నిప్పు పెట్టింది. ఫైర్ బ్రాండ్ ఎమ్మల్యేగా ముద్ర వేసుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  కవిత కామెంట్ ను ఎండార్స్ చేశారు. ఆమె చెప్పింది సత్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.  అంతే కాదు.. రాష్ట్ర అపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. సరైన రేటు ఇస్తే, ప్లేటు మార్చేందుకు తమ పార్టీ నాయకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారని అన్నారు. ఆయన ఒకరనే కాదు..  కవిత ఇష్యూలో వేలు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించినా..  బీజేపీ నాయకులు ఎవరికి  వారుగానే సొంత అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవిత విషయంలోనే కాదు.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే పార్టీ  అధ్యక్ష ఎన్నిక ఒక అంతులేని కథల సాగుతోంది. 

ఇక కాంగ్రెస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ముందు అసమ్మతి పుట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది అంటే అందులో తప్పులేదు. అదేమంటే,  మా పార్టీలో  అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ అంటారు. అందుకే.. పార్టీ ఎమ్మెల్సీ సభలోనే  ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం గాంధీ భవన్  మెట్ల మీదనే ధర్నా చేస్తారు. అంతవరకు ఎందుకు.. అంతర్గత కుమ్ములాటల కారణం గానే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కనీసం పీసీసీ  ఏర్పాటుకు కూడా మీన మేషాలు లెక్క పెట్టవలసి వస్తోంది.  సో. అంతర్గత కుమ్ములాటల విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట ..అంతర్గత ప్రజాస్వామ్యం లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అంటున్నారు.