ఆదినారాయణ రెడ్డి మమ్మల్ని చంపేస్తారు.. రామసుబ్బారెడ్డికి ఫిర్యాదు


ఒకే పార్టీలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డిల మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గతం నుండే వీరిద్దరి మధ్య విబేధాలు ఉంటున్నప్పటికీ.. తాజా వివాదాల వల్ల ఇంకా దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పెద్దదండ్లూరు గ్రామంలో ఇటీవలే దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని సందర్సించడానికి గాను రామసుబ్బారెడ్డి అక్కడికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయనకు ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయ రెడ్డి తమపై దాడులు చేశారని పలువురు రామసుబ్బారెడ్డి వద్ద వాపోయారు. ఈ క్రమంలో దాడికి గురైన సుబ్బారాయుడి భార్య ఆయన వద్దకు వచ్చి జరిగిన ఉదంతాన్ని కన్నీళ్లతో చెప్పింది. అభివృద్ధి పనులు చేయించాలని కోరినందుకే, చెప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లారని వాపోయింది. తాము కేసులు పెట్టలేమని, ఇప్పుడు మీరు వచ్చినందుకు, తర్వాత మమ్మల్ని చంపేస్తారని భయపడుతూ చెప్పింది. ట్రాక్టర్లలో వచ్చిన జనాలు ఊరిపై దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారని, ఇళ్లల్లోకి దూరి ఫర్నీచర్ ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆది నారాయణరెడ్డి..తనపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. జిల్లా అభివృద్దికి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమే అని చెప్పారు. మరి రామసుబ్బారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.