ఒడిషాలో ఘోరం... స్పాట్‌లో ఆరుగురు... ఆస్పత్రిలో ముగ్గురు... మృత్యువాత

ఒడిషాలో ఘోరం జరిగింది. బస్సుకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. గంజాం జిల్లా గొలంత్రలోని మంద్ రాజ్ పూర్ దగ్గర పెళ్లి బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దాంతో, స్పాట్లోనే ఆరుగురు మృత్యువాత పడగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. విద్యుత్ షాక్ తో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బస్సులో మొత్తం 40మంది ఉండగా, తొమ్మిది మరణించారు. అలాగే, మరో 30మంది గాయపడ్డారు. దాంతో, క్షతగాత్రులను బరంపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక, ఘటన జరిగిన తీరు హృదయ విదారకరంగా మారింది. ఎంతో సంతోషంగా వివాహ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొనడానికి బయల్దేరినవారిలో తొమ్మిది మంది మృత్యువాత పడటం... 30మంది గాయపడటంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఘటనను చూసిన స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.