నామినేటెడ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై 9 కేసులు! 

రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలే కారెక్కిన పాడి కౌశిక్ రెడ్డి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో శాసనమండలికి ఎంపిక చేశారు. కేసీఆర్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి రేసులో ఉన్న కౌశిక్ రెడ్డి పెద్దల సభకు పంపించారు కేసీఆర్.

కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించడంతో హుజురాబాద్ లో ఇప్పుడు కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. దాంతో పాటు కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరించిన కౌశిక్ రెడ్డి ఎక్కువగా దూకుడు రాజకీయాలే చేశారు. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు భారీగానే నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆయన చాలా కేసులు కూడా నమోదయ్యాయి. చాలా కేసులు ఇప్పటికి విచారణలో ఉన్నాయి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో.. ప్రత్యర్థులు ఆయనపై ఉన్న కేసులను బయటికి తీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

పాడి కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఇంకా ఉన్నాయని తెలుస్తోంది.. ఆ కేసుల వివరాలు ఇవి..

1. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద జమ్మికుంట పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.  తనను చంపేస్తానని బెదిరించాడని అరుకల వీరశలింగం అనే వ్యక్తి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
2. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద  కరీంనగర్ రూరల్ పీఎస్ లో బెదిరింపుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు లోక్ అదాలత్ పరిధిలో ఉంది. 
3.  సెప్టెంబర్ 28, 2017న ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్ లో 506, 507 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై బెదిరింపుల కేసు నమోదైంది. 


4. డిసెంబర్ 6, 2017న వరంగల్ సుబేదారి పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. 
5. నవంబర్ 28, 2018న అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు కౌశిక్ రెడ్డిపై 188, 171 F, 171-H, 127 (A) RP Act కింద వీణవంక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. 
6. నవంబర్ 28, 2018న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రూల్స్ కు విరుద్దంగా హనుమాన్ టెంపుల్ లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనే అభియోగాలతో  505, 171-C, 171-G r/w 171-F IPC    కింద కేసులు పెట్టారు. 
7. మే 8, 2020న మార్కెట్ యార్డులో ఎలాంటి అనుమతి లేకుండా సమావేశం, నిరసన తెలిపినందుకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై  188 IPC కింద కేసు నమోదైంది.


8. కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ 59 మందితో సమావేశం నిర్వహించారనే కారణంతో సిరిసిల్ల పీఎస్ లో జూన్ 13, 2020న పాడి కౌశిక్ రెడ్డిపై 143, 147, 353, 341, 269, 270 r/w 149 IPC, Sec 3 of Epidemic Diseases Act   కింద కేసులు నమోదయ్యాయి. 
9. సెప్టెంబర్ 1, 2020న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై  186, 188, 506 IPC, Sec 3 The Epidemic Diseases Amendment   కింద కేసులు కట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రిని విజిట్ చేశారు. ఆ సయమంలో డ్యుటీలో ఉన్న వైద్యులు, మెడికల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.