తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
posted on Oct 3, 2013 8:16PM
తెలంగాణ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ నుంచి కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం కనుగొనేందుకు మంత్రుల బృందం ఏర్పాటు అవుతుందని చెప్పారు. నీటి సమస్య, ఆదాయాలు,అప్పులు, ఇతర సమస్యలపై మంత్రుల కమీటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని షిండే తెలిపారు. క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ నోట్ ఇప్పుడు రాష్ట్రపతి ముందుకు వెళుతుంది. ఆయన దానిని శాసనసభ ఆమోదానికి పంపిస్తారు. కాని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపించే ఆదేశాలలో కేవలం అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే తెలుసుకుంటారు గాని అసెంబ్లీ ఆమోదానికి ఎదురుచూడరని తెలుస్తున్నది.