యువరాజు ఆవేదన..!!
posted on Jan 17, 2014 5:50PM
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎఐసిసి సమావేశంలో ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. సమాచార హక్కు చట్టం ఒక్క కాంగ్రెస్వల్లే సాధ్యమైందని ఆయన తెలిపారు. పేదలకు ఎంతో చేశామని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని రాహుల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది కూడా కాంగ్రెసేనని ఆయన తెలిపారు.
ఈ రోజు రాజకీయాల్లోకి సామాన్యులు వచ్చే పరిస్థితి లేదని, దీనిని మనం మార్చాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులుగా అనర్హులవుతారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుతున్నా.. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జన్లోక్పాల్ బిల్లుపై అందరూ తమాషా చేశారని, చివరికి లోక్పాల్ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్సేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యమంటే ఏ ఒక్క వ్యక్తి పాలనా కాదని, ప్రజా ప్రతినిధుల పాలన అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే రేంజ్లో గడచిన పదేళ్ళలో అవినీతి జరిగిందని అందరికి తెలుసు...కాని ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియనివేమీ కాదు...మరీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి౦ది తామేనని రాహుల్ చెప్పుకోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.