వైఎస్ జగన్, విజయమ్మ రాజీనామా
posted on Aug 10, 2013 5:39PM
వైఎస్ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద వైఖరిని నిరసిస్తూ తమ యంపీ, శాసనసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసారు. వారు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో ఫాక్స్ చేశారు. జగన్ కడప లోక్ సభకు, విజయమ్మ పులివెందులకు శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వారు తమ రాజీనామాలకు చెపుతున్న కారణాలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ పార్టీ తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన తరువాత కూడా, నేటికీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్నామని దైర్యంగా చెప్పకుండా, ఇటువంటి కుంటి సాకులు చెపుతూ రాజీనామాలు చేయడం ఆ పార్టీ రాజకీయ దౌర్భాల్యాన్ని సూచిస్తోంది.
తమ పార్టీ శాసనసభ్యుల చేత సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయించినప్పుడు కూడా ఆ పార్టీ దైర్యంగా ఆమాట చెప్పలేకపోయింది. అందువల్ల ఆ పార్టీకి చెందిన కొండ సురేఖ, మహేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలను కోల్పోవడమే కాకుండా, తెలంగాణాలో మళ్ళీ కాలుపెట్టే అవకాశం లేకుండా చేసుకొంది. మళ్ళీ ఇప్పుడు కూడా తమ రాజీనామాలకు డొంక తిరుగుడు కారణాలు చెప్పడం నవ్వుతెప్పిస్తుంది.