యువతిని వేధిస్తున్న కేసులో జనసేన పార్టీ సభ్యుడి అరెస్ట్..

ఓ యువతిని వేధిస్తున్నాడు అంటూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేసిన వైనం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన చంద్రశేఖర్ సాకేటి సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఫేస్ బుక్ లో  హైదరాబాదు నగరానికి చెందిన ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరబాద్ వచ్చినప్పుడల్లా చంద్రశేఖర్ ఆమెను కలిసేవాడు. అయితే ఆ అమ్మాయి చనువును అవకాశంగా తీసుకున్న అతను మొదట ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ వారిద్దరూ కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు.. కామెంట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని పట్టుకున్నారు.

బ్యాంకులకు కాస్త రిలీఫ్.. ఇంకా రూ.5,500 కోట్ల ఆస్తులు

విజయ్ మాల్యాకు అప్పులిచ్చి ఇరకాటంలో పడ్డ్ బ్యాంకులకు కాస్త ఊరట లభించే విషయం ఒకటి బయట పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన ఆస్తలు గ్యారంటీగా పెట్టి అప్పులు తీసుకున్న విజయ్ మాల్యాకు ఇంకా రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయన్న విషయం తాజాగా వెలుగు చూసింది. దీంతో బ్యాంకులు కొంచం రిలీఫ్ అయ్యాయి. ఇప్పటికే మాల్యా తమకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను విక్రయించిన బ్యాంకులు రూ. 1,200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులను కూడా బ్యాంకులు అటాచ్ చేసి కొంత మేర రుణాలను రాబట్టుకునే ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాకట్టు పెట్టని ఆస్తులను స్వాదీనం చేసుకునే హక్కు లేకపోయినా కోర్టును ఆశ్రయించి తద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.   ఇక మాల్యా కూడా ఎలాగూ దేశం విడిచిపోయినట్టు తెలుస్తోంది కాబట్టి కోర్టు ఆ ఆస్తులను జప్తులను చేసి..వేలం వేసి వచ్చిన సొమ్ముతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్ బకాయిలు తీర్చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

చనిపోయిన భార్య- టీవీలో కనిపించింది

మొరాకో దేశంలో నివసించే అబ్రగ్‌ మొహమ్మద్‌ భార్య రెండేళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చిన అబ్రగ్, వైద్యానికి అయ్యే ఖర్చులను పోగేసుకుని ఆసుపత్రికి చేరుకునేసరికి, భార్య చనిపోయిందని చెప్పారు వైద్యులు. చెప్పడమే కాదు, అతని భార్యదేనంటూ ఓ శవపేటికను కూడా అందించారు. అబ్రక్‌ దానిని తన సొంత ఊరికి తీసుకువెళ్లి సమాధి చేసేశాడు కూడా! కానీ ఈమధ్య ఓ టీవీ కార్యక్రమంలో తన భార్య కనిపించడంతో అబ్రగ్‌కి మతిపోయింది. తప్పిపోయినవారిని తిరిగి తమ బంధువుల దగ్గరకు చేర్చే ఆ కార్యక్రమంలో, తాను రెండేళ్ల క్రితం తన భర్త నుంచి దూరమయ్యానంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరూ ఓ చోటకి చేరినప్పటికీ... రెండేళ్ల క్రితం ఏం జరిగి ఉంటుందన్నది మాత్రం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. అన్నింటికీ మించి అబ్రగ్‌ పాతిపెట్టిన శవం ఎవరిదంటూ ఇప్పుడు పరిశోధన మొదలైంది.

టీఆర్ఎస్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..

టీడీఎల్పీనేత రేవంత్ రెడ్డి అదికార పార్టీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. గతంలో ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నాలుగో వరసలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే తనపై కక్ష్య సాధిస్తుందని.. మాకూ మంచి రోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకూ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇంక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

చంద్రబాబుపై అప్పుడే ఎర్రబెల్లి సంచలన కామెంట్లు..

ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరి ఆపార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. స్పీకర్ కూడా వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించారు. అయితే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసింది పార్టీ ఫిరాయింపు కాదని.. పార్టీ శాసనసభాపక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేశామని తెలిపారు. అయినా గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావును గద్దె దించి చంద్రబాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే... మేం చేసింది ఎంత? అని ఆయన మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ లోకి వస్తానంటూ తాను ఏ ఒక్క నేతకు కూడా ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు పొరపాటే.. తాపీగా సీబీఐ

  ఒకపక్క పార్లమెంట్లో విజయ్ మాల్యా వ్యవహారంపై అధికార.. విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాదు విజయ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే సహరించిందని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాల్యా దేశం విడిచిపోతుంటే సీబీఐ చోద్యం చూస్తుందా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. అందరూ విమర్శలు చేస్తుంటే ఇప్పుడు తాపీగా సీబీఐ ఓ విషయం చెబుతుంది. అసలు విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడమే తమ పొరపాటని..  కింది స్థాయి అధికారి వల్ల జరిగిన ఓ పొరపాటు కారణంగా విజయ్ మాల్యాకి లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగిందని.. డిసెంబర్ 9, 10వ తేదీలలో ఢిల్లీలో, డిసెంబర్ 12వ తేదీన ముంబైలో ప్రశ్నించినప్పుడు మాల్యా తమకి సహకరించాడని సీబీఐ పేర్కొంది. దీంతో సీబీఐ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల మంటలపై ఇంకా ఆజ్యం పోసినట్టు అయింది. ఇప్పటికే సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే దీనికి తోడు ఆసమయంలో ఈవ్యాఖ్యలు చేసి మరింత దుమారానికి దారి తీశారు. మరి ప్రతిపక్షనేతలు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో చూడాలి.

అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే.. బిల్లును పరిశీలనకు పంపాలి

ఆధార్ చట్టబద్దత కు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ అధార్ చట్టబద్దత వల్ల ఉపయోగాలే కాని.. నష్టాలు లేవని చెబుతున్నారు. పౌరులకు ప్రభుత్వ సబ్సడీలు, ప్రయోజనాలు, సేవలు పారదర్శకంగా అందించేందుకు ఆధార్ కు చట్టబద్దత కల్పించేందుకు బిల్లును రూపొందించినట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం బిల్లును పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. దానికి ప్రభుత్వం మాత్రం.. 2010లో యూపీఏ ప్రభుత్వం ఆధార్ బిల్లును ఆమోదించి సభలో ప్రవేశపెట్టిందని, అప్పుడు అధ్యయనం చేశారు.. కావున ఇప్పుడు మళ్లీ పంపించాల్సిన అవసరం లేదని.. యూపీఏ ప్రవేశపెట్టిన బిల్లులో లోపాలను సవరించి తాము కొత్తగా ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

పారిపోయిన విజయ్ మాల్యా.. అల్లరి నరేశ్ కి చిక్కాడు..!

వేల కోట్లు రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి.. పార్లమెంట్లో దుమారానికి కారణమైన విజయమాల్యా ప్రస్తుతం దేశం విడిచిపోయారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినీ నటుడు అల్లరి నరేశ్ విజయ్ మాల్యాతో ఫొటో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎవ్వరికి చిక్కని విజయ్ మాల్యా నాకు చిక్కాడు అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. అదేంటీ అల్లరి నరేశ్ కు విజయ్ మాల్యా ఎక్కడ చిక్కారనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఇటీవల మాల్యా విదేశాలకు వెళ్లే క్రమంలో అల్లరి నరేశ్ కు తారసపడగా అక్కడ నరేశ్ సెల్పీ తీసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ మాల్యా వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్ కాగా నరేశ్ ఇలా ఫొటో పోస్ట్ చేసి అందరికి షాకిచ్చి.. కామెడీ చేసేశాడు.

కన్నయ్యకు బెదిరింపుల పోస్టర్.. నేను కాలుస్తాను

  జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ పై ఇప్పటికే దేశద్రోహి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు అతనికి చంపేస్తే రూ.11 లక్షలు ఇస్తామంటూ గతంలో పోస్టుర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులతో కూడిన పోస్టర్లు వస్తున్నాయి.  కన్నయ్యకుమార్‌, విద్యార్థులు ఉమర్‌ ఖలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యలు దేశ ద్రోహులు.. వారిని కాల్చి చంపడం జాతి ధర్మం.. దేశంలో ఉంటూ దేశానికి వెన్ను పోటు పొడిచేవారు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు వారిని నేను కాలుస్తాను అంటూ పోస్టర్ ఒకటి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కనిపించినట్టు చెబుతున్నారు. అంతేకాదు ఈ పోస్టర్ బల్బీర్‌ సింగ్‌ భారతీయ అనే పేరుతో ఉంది. పోస్టర్‌లో అతడి ఫోన్‌ నెంబరు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడా ఉంది. పోలీసులు ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా..  ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి తాను యమునా బజార్‌లో దుకాణం నిర్వహిస్తానని, నిన్న జంతర్‌మంతర్‌ వద్దకు వచ్చానని మాత్రమే చెప్పాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతన్నామని తెలుపుతున్నారు.

ఇస్లాం మతంపై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికా అంటే గిట్టదు..

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇస్లాం మతం.. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోరు జారారు. సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన.. ఇస్లాం మతానికి అమెరికా అంటే గిట్టదని నాకు అనిపిస్తోంది.. అమెరికన్లను వ్యతిరేకించే వారిని దేశంలోకి అనుమతించరాదని..  తీవ్రవాద భావజాలాన్ని నింపే ఇస్లాంపైనే అమెరికా యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఏమనుకున్నాడో ఏమో.. రాడికల్ భావాలున్న ఇస్లాం గురించి తాను చెపుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో తన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న ట్రంప్.. ఇప్పుడు ఈవ్యాఖ్యలతో ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో.

రోజాకు మళ్లీ చుక్కెదురు.. మేము విచారించలేము

వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా రోజాకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. రోజా పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు ప్రారంభించడానికి నిలబడగానే... ‘‘ఈ కేసును మేము విచారించలేము.. సోమవారం వేరే బెంచ్‌ విచారిస్తుంది’’ అని న్యాయమూర్తి ఖెహర్‌ బదులిచ్చారు. దీనికి ఇందిరా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే కేసు విచారణకు వస్తుందనుకున్నాము కానీ రాలేదని తెలిపారు. కాగా స్పీకర్ తనపై విధించిన సస్పెషన్ ను సవాల్ చేస్తూ రోజా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమెకు చుక్కెదురవడంతో సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే. మొత్తానికి రోజాకు స్టే వచ్చేసరికి అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోతాయేమో..

ప్రారంభమయిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 2700 పోస్టులకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కరువు, రైతు సమస్యలపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో వేలాది పోస్టులు ఖాళీలున్నాయి.. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఆ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.   దీనికి ఈటెల రాజేందర్ స్పందించి.. ఏడాది లోపు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తాం.. 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. కార్పోరేషన్లలో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తాం.. ఉద్యోగాల భర్తీని డబ్బుల కోణంలో ప్రభుత్వం చూడటం లేదు.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 2700 పోస్టులకు ఆమోదం తెలిపాం అని అన్నారు.

రాజీవ్‌ను చంపడం తప్పే... ఎల్టీటీఈ నేత పశ్చాత్తాపం

‘భారత మాజీప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టనపెట్టుకోవడం తాము చేసిన అతి పెద్ద తప్పు’ అని ఒకనాటి ఎల్టీటీఈ నేత బాలసింగం పేర్కొన్నారు. తను చనిపోయే ముందు ఈ విషయాన్ని నార్వే దౌత్యవేత్త ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. తాము రాజీవ్‌గాంధిని చంపిన విషయం ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ తొలుత అంగీకరించలేదని, కానీ తరువాత వారు ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చారు బాలసింగం. అసలు రాజీవ్‌ను చంపాలన్న నిర్ణయం ప్రభాకరన్ ఎందుకు తీసుకున్నారో కూడా బాలసింగం వెల్లడించారు. 1987-90ల మధ్య కాలంలో రాజీవ్‌గాంధి శ్రీలంకలో శాంతిని స్థాపించేందుకు కొంత సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం చేతిలో చాలామంది ఎల్టీటీఈ తీవ్రవాదులు హతులైపోయారు. మళ్లీ రాజీవ్‌గాంధి కనుక ప్రధానమంత్రి పదవిని చేపడితే ఆనాటి సంఘటనలు పునరావృతం అవుతాయన్న భయంతో, ఆయనను పొట్టనపెట్టుకున్నామన్నది బాలసింగం మాట. ఈ విషయాలన్నీ కూడా మార్క్ సాల్టర్ అనే రచయిత తన ‘టు ఎండ్ ఏ సివిల్ వార్’ పుస్తకంలో పేర్కొన్నాడు. 549 పేజీల సుదీర్ఘమైన ఈ పుస్తకంలో శ్రీలంకలో మూడు దశాబ్దాలకు పైగా సాగిన తమిళ-సింహళీయుల మధ్య పోరాటాన్ని, దానికి ముగింపు పలికేందుకు నార్వే నేతృత్వంలో సాగిన శాంతి ప్రక్రియ వివరాలనీ పొందుపరిచారు. రాజీవ్‌ను చంపాలన్న ఆలోచన తప్పని, అప్పుడే ఎల్టీటీఈ నేతల మనసుకి తట్టి ఉంటే ఎంత బాగుండేదో!

5 కోట్లు జరిమానా కడతాం.. ఒకేసారి కట్టలేం.. రవిశంకర్..

జైలుకైనా వెళ్తాను కానీ.. జరిమానా చెల్లించేది లేదని చెప్పిన శ్రీ శ్రీ రవిశంకర్ ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో రవిశంకర్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల వల్ల పర్యావరణానికి హాని కలిస్తుందంటూ దీనికి 5 కోట్లు జరిమానా కట్టమంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన రవిశంకర్ జరిమానా అస్సలు కట్టనని చెప్పిన ఆయన నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని గ్రీన్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కల్చర్ ఫెస్టివల్ ఆరంభం అయ్యేలోపు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కోర్టుకు పేర్కొంది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, ఇంత త్వరగా అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

విజయ్ మాల్యా తీసుకెళ్లిన ఆ బ్యాగుల్లో ఏముందో..

  ప్రస్తుతం దేశం మొత్తం విజయ మాల్యా గురించిన వార్తలతోనే నిండిపోయింది. రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు టొకరా వేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం దేశం విడిచి పోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు స్పందిచిన మాల్యా మాత్రం తాను ఎక్కడికి పారిపోలేదని.. ఒక అంతర్జాతీయ వ్యాపారస్థుడిగా పలు దేశాలు తిరుగుతుంటానని.. న్యాయానికి కట్టుబడే ఉంటానని చెపుతూ పలు ట్వీట్లు ట్వీటారు. అయితే తాను ఎక్కడి నుండి ట్వీట్లు ట్వీటారా అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే మాల్యా ప్రస్తుతం..  లండన్లోని తన సొంత ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. అక్కడి నుండే తాను ఈ ట్వీట్లు చేశాడని వార్తలు వినిపిస్తున్నయి.   అయితే ఇక్కడ విజయ్ మాల్యా లండన్ వెళ్లిన పద్దతి చూస్తుంటే మాత్రం తాను నిజంగానే పారిపోయాడా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మాల్యా మార్చి 2 అర్థరాత్రి 1.30 ఢిల్లీ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్టు ఓ ఉన్నత అధికారి తెలిపారు. అయితే ఎప్పుడూ చుట్టూ జనంతో ఉండే మాల్యా.. ఆరోజు ఒంటరిగా వచ్చినట్టు.. అయితే ఆయన పక్కన ఓ మహిళ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆరోజు మాల్యా తనలో పాటూ చాలా పెద్దవి..ఏడు లగేజీ బ్యాగ్‌లు తీసుకెళ్లారట. దీంతో ఇప్పుడు అందరి అనుమానాలు ఆ బ్యాగుల మీద పడ్డాయి. అంత పెద్ద బ్యాగుల్లో.. ఎప్పుడూ లేనిది ఇప్పుడే అంత లగేజ్ తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి.. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముంది అని పలువురు అనుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముందో..

రింగింగ్ బెల్స్ కు మరో షాక్.. యాడ్ కామ్ వార్నింగ్..

రింగింగ్ బెల్స్ సంస్థ.. ఈ సంస్థ పేరు ఇంతకు ముందు అందరికీ తెలుసు లేదో తెలియదు కానీ.. ఎప్పుడైతే రూ.251 రూపాయలకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పారో అప్పుడు..ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాదాపు ఆరుకోట్ల దాకా బుకింగ్ లు వచ్చాయి..  జూన్ కల్లా హ్యాండ్ సెట్లు అందిస్తాము.. మొదటి విడతలో 25 లక్షల ఫోన్లు విడుదల చేస్తామని కూడా చెప్పారు. అయితే ఆ ఫోన్ అందిచడం సంగతేమో కానీ ఆ ప్రకటన తరువాత పాజిటివ్ టాక్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువ సొంత చేసుకుంది. ఏదో ఒక విషయంలో రింగిగ్ బెల్స్ సంస్థకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇటీవలే అద్దె కూడా కట్టలేక సంస్థ మూసేశారు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో విషయంలో ఈ సంస్థకు సమస్య ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. యాడ్ కామ్ అనే ఐటీ ఉత్పత్తుల సంస్థ తాము హ్యాండ్ సెట్ ను 3,600 రూపాయలకి రింగింగ్ బెల్స్ సంస్థకి అమ్మామని.. కానీ రింగింగ్ బెల్ మాత్రం ఒక్కో ఫోన్ కు రూ.1500మాత్రమే తమకు ఖర్చు అవుతుందని చెప్పింది. కానీ ఆ సంస్థ రూ.251 ఫోన్ ఇవ్వడంపై మా ప్రమేయం లేదు.. ఒకవేళ దానివల్ల మా బ్రాండ్ నేమ్ కి ఏదైనా చెడ్డ పేరు వస్తే మాత్రం చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.