అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక ఆదేశాలు

  అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. విమాన సిబ్బంది క్రూ షెడ్యూల్,  రోస్టరింగ్ పనులు నిర్వహిస్తున్న ముగ్గురు అధికారులు.. పైలెట్లకు తగిన లైసెన్సింగ్, రెస్ట్, తప్పనిసరి నిబంధనలను ఉల్లంఘించారన్నది డీజీసీఏ వాదన.  ఐవోసీసీ అడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. అయితే ఇటీవలి అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలోనే డీజీసీఏ చర్యలకు ఎయిరిండియాకు సిఫారసు చేసినట్లు స్పష్టం అవుతోంది.   అంతేకాదు.. క్రూ షెడ్యూలింగ్ నిబంధనలు, లైసెన్సింగ్, ఫ్లైట్ టైం లిమిటేషన్స్ తదితర అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే ఇక నుంచి భారీ జరీమానాలు విధిస్తామని డీజీసీఏ హెచ్చరిస్తోంది కూడా. కాగా.. జూన్‌ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫోర్టు  నుంచి లండన్‌కు బయల్దేరిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది ఓ భవనంపై కూలి.. ముక్కలై.. పేలిపోయింది. ఈ దుర్ఘటలో మొత్తం 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రిలో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.

ప్రజల సహకారంతో యోగాంధ్ర విజయవంతం : సీఎం చంద్రబాబు

  ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాల సహకారంతోనే కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం అన్నారు. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్‌కు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహాకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహరించిందని తెలిపారు.  సూర్య నమస్కారాతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్‌ తీసుకొస్తామని.. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు.యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యనించారు. యోగా డే వేడులకు ఒక్క పిలపునిస్తే.. లక్షల్లో జనం తరలివచ్చారని అన్నారు. విశాఖ ప్రజలది పాజిటివ్ థింకింగ్ అని.. సమైక్యతా భావం ఎక్కువని కితాబిచ్చారు. 

కేబీఆర్ పార్క్ పేరు మార్చాలని తీన్మార్ మల్లన్న నిరసన

  హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ  కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు. కేబీఆర్ పార్కు పేరును తొలగించి వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే.. ఆ పని మేమే చేస్తామని డిమాండ్ చేశారు.  వెంటనే కేబీఆర్ పార్క్ ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని  కూడా పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తెలంగాణలోని బీసీ సంఘాలు సైతం పేరు మార్పు చేయాలని కోరుతున్నారని తీన్మార్ మల్లన్న అన్నారు.  బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లెయిన్‌తో పెకిలించి అవతల పడేసి జయశంకర్ సార్ విగ్రహం పెడతామని మల్లన్న తెలిపారు.  

హరీష్ రావు సభలో రప్పా రప్పా ప్లకార్డులు

  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు. కాగా మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యాటనలోనూ ఓ యువకుడు ఇదే డైలాగ్‌తో ప్లకార్డులు ప్రదర్శించిగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల రాజకీయల్లో పుష్ప డైలాగ్ కాక రేపుతోంది.  పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్  పాపులర్ డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రవేశించాయి. 2029లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే గంగ‌మ్మ జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు  ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం ఒక్కొక్క‌డినీ! పొట్టేళ్ల‌ను న‌రికిన‌ట్టు న‌రుకుతాం’ అని రాసిన ఫ్లెక్సీల‌ను కార్యకర్తలు ప్రదర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగును వైఎస్ జగన్  సమర్ధించడంతో ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది.దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల తదితర టీడీపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటీవల చెవిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా జులై1 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని సిట్ కు సమాచారం అందించారు. దీంతో సిట్ అధికారులు విజయవాడ నుంచి హుటాహుటిన బెంగళూరు చేరుకుని చెవిరెడ్డిని అదుపులోనికి తీసుకుని జూన్ 18 కోర్టులో హాజరు పరిచారు.  

వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలపై స్పెషల్ స్టోరీ

   వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి. గురువారం రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానంలో నిర్వహించిన రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు విశ్వ ప్రచారం చేస్తున్నారని అవేవీ నమ్మకూడదని పదవి ఎక్కడికి పోదు అని మా వెనకాల రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  పరకాల నియోజకవర్గంలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని ఎన్నికలప్పుడు వచ్చి ఒకసారి గెలిపించాలని  కాలు పట్టుకున్నాడని మళ్లీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాన్ని వదిలేస్తానని మాట ఇచ్చాడని గుర్తు చేశారు.. పరకాల నియోజకవర్గం నుంచి త్వరలోనే తన కూతురు కొండ సుస్మిత పటేల్ రాజకీయ ప్రవేశం చేస్తారని అన్నారు. మరో సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో గెలిచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.. ఆయన కనుబొమ్మలు గీసుకుంటాడని ఎన్కౌంటర్లో స్పెషలిస్ట్ అని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ కేటీఆర్‌ను  వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని,అతనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని కడియం శ్రీహరి ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు.  కొండమురళి లెక్క మీకు ఇజ్జతి మానవత్వం  ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాలు విసిరారు.. మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. వరంగల్ జిల్లాలో మొదటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొండ మురళి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేది.. ఒకరికొకరు మీడియా సమావేశంలో కూడా తిట్టుకునేవారు.. కొండ మురళి కుటుంబ సభ్యులంతా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఆ విధంగా ఆది నుంచి ఇప్పటివరకు వీధి మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను టార్గెట్ చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి లపై మాజీ ఎమ్మెల్సీ కొండమురళి ఈ విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడంతో కొండ మురళి టార్గెట్ మారిందా అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  గత కొద్ది రోజుల నుండి మంత్రి కొండా సురేఖ పదవి పోతుందని మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది.. అప్పటినుండి మంత్రి కొండ సురేఖ పైన సోషల్ మీడియాలో పలు సంఘటనలు సంబంధించి ప్రచారం చేయడంతో పాటు అది కొద్ది రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది..మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గన్మెన్లను తొలగించడంతోపాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కి ఎస్కార్ట్ గా వచ్చిన ఏసిపి సీఐలకు మెమోలు జారీ చేసిన ఘటనలు చూస్తుంటే ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంనికి గురిచేస్తుంది.. వీటన్నిటిని గమనించిన కొండ మురళి ఈ విధంగా మాట్లాడారని కొండ మురళి అనుచరులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు.. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొండ సురేఖ పదవి తప్పించేందుకు టిడిపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర లాబింగ్ చేస్తున్నారని వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం అందుకుంది  వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ పై కూడా కొండ మురళి హాట్ కామెంట్ చేశారు... తనకు ఎస్కార్ట్ గా వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవర్టుల పైన పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. వరంగల్ తూర్పులో తను ఉన్నంతకాలం రెండో లీడరు రాలేడు అని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యను కూడా ఉద్దేశించి మాట్లాడారు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కగార్ ఆపరేషన్ ను ఆపేయాలని అంటే పోలీసులు అడ్డుకున్నా రన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయ్యారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజల్లో ఉంటానని ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబం లక్ష్యమని ధైర్యంలో తాను పెద్దపులిని అంటూ మాట్లాడారు..మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అస్త‌మిస్తోన్న సూర్యుడు..మార‌న్ సోద‌రుల మ‌ధ్య గొడ‌వేంటి?

  డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా. అప్ప‌ట్లో త‌న తండ్రి మ‌ర‌ణించిన వెంట‌నే క‌ళానిధి మారన్.. అక్ర‌మంగా 12 ల‌క్ష‌ల షేర్ల‌ను నామ మాత్రం విలువ‌, అంటే రూ. 10 చొప్పున షేర్లు త‌న పేరిట కేటాయింపులు చేసుకున్నార‌నీ.. ఆ టైంలో ఈ షేరు విలువ రెండున్న‌ర వేల నుంచి సుమారు రూ.3 వేల వ‌ర‌కూ ఉండేద‌ని.. దీంతో ఆయ‌న 60 శాతం వ‌ర‌కూ వాటాల‌ను కైవ‌సం చేసుకుని అక్ర‌మంగా స‌న్ నెట్ వ‌ర్క్ య‌జ‌మాని అయ్యార‌ని ఆరోపిస్తున్నారు ద‌యానిధి మార‌న్. అందుకే తాము 2003 నాటి పాత యాజ‌మాన్య స్థితికి కంపెనీని తీసుకురావ‌ల్సిందిగా  కోరుతున్నారు ద‌యానిధి మార‌న్.  తాను కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన వార‌సుడ్నేన‌నీ.. త‌న తండ్రి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ‌, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన  వార‌స‌త్వ ప‌త్రాల్లేకుండానే క‌ళానిధి త‌న‌కు ద‌క్కాల్సిన  షేర్లు, డివిడెండ్లు, ఆస్తులు, ఆదాయాల‌ను ద‌క్క‌కుండా చేశార‌ని.. అవ‌న్నీ తిరిగి చెల్లించ‌కుంటే తాను సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్వోసీ వంటి సంస్థ‌ల‌కు కంప్ల‌యింట్ తీస్కెళ్లాల్సి ఉంటుంద‌ని త‌న నోటీసుల ద్వారా హెచ్చ‌రించారు మార‌న్ బ్ర‌ద‌ర్. ఈ దిశ‌గా  జూన్ 10న మార‌న్ త‌న సోద‌రుడికి లా ధ‌ర్మ అనే సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. క‌ళానిధి మార‌న్ 2003 నుంచి 2023 వ‌ర‌కూ ఏకంగా 8500 కోట్ల మేర అక్ర‌మ నిధుల‌ను ఎన్నో విభాగాల్లో పెట్టుబ‌డులు పెట్టార‌నీ.. ఇదంతా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌నీ అంటారు ద‌యానిధి మార‌న్. 2024లో క‌ళానిధి ఏకంగా 455 కోట్ల విలువైన డివెండ్లు పొందార‌ని.. త‌న భార్య కావేరి, తాను క‌ల‌పి సీఈవోగా ఒక్కొక్క‌రూ అర‌వై కోట్ల‌కు పైగా.. ప్యాకేజ్ తీస్కుంటున్నార‌నీ.. ఆయ‌న 2023లో భార‌త కుబేరుల జాబితాలో 77వ బిలియ‌నీర్ గా ఎదిగారంటే దాని వెన‌క‌- ఈ అక్ర‌మ షేర్ల బ‌దలాయింపు ఉంద‌ని అంటున్నారు ద‌యానిధి మార‌న్. మ‌రీ ముఖ్యంగా కంపెనీల చ‌ట్టం 212 ప్ర‌కారం.. చూస్తే క‌ళానిధి పెట్టుబ‌డులు పెట్టిన  టీవీ, రేడియో, క్రీడా, విమాన యాన ఇలా ఎన్నో రంగాల లైసెన్సులు ర‌ద్దు అయ్యే ప్ర‌మాద‌మున్న‌ట్టు తెలుస్తోంది. స‌న్ నెట్ వ‌ర్క్ కింద 37 చానెళ్లు, 69 రేడియో స్టేస‌న్లుండ‌గా.. వీటితో పాటు స‌న్ పిక్చ‌ర్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ ఉండ‌గా.. 2023లో ఈ సంస్థ నుంచి జైల‌ర్ సినిమా విడుద‌లై వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.ఇక క‌ళానిధి కుమార్తె కావ్య మార‌న్ ఇక్క‌డ ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ ఫ్రాంచైజీ  తో పాటు సౌతాఫ్రికాలోనూ ఒక క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ టీములు 2016లో ఐపీఎల్, 2023-24లో ద‌క్షిణాఫ్రికా చాంపియ‌న్ గా నిలిచాయి. ఇక ఇంగ్లండ్ లోనూ ఒక క్రికెట్ టీమ్ ని కొనుగోలు చేసింది కావ్య‌నాయ‌క‌త్వంలోని స‌న్ నెట్ వ‌ర్క్. అంతే కాదు విమాన‌యానంలోనూ పెట్టుబ‌డులు పెట్టిందీ సంస్థ‌.  వీట‌న్నిటి లైసెన్సులూ ఇప్పుడు ప్ర‌మాదంలో ప‌డ్డంతో పాటు.. వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాల‌పైనా ఈ ప్ర‌భావం ప‌డేలా తెలుస్తోంది.దానికి తోడు ద‌యానిధి మార‌న్ డీఎంకే ఎంపీ  కూడా కావ‌డంతో రాజ‌కీయంగానూ ఈ ఆస్తి వివాదం.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం  ప‌డేలా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి దీనంత‌టికీ ఈ కుటుంబం ఫుల్ స్టాప్ పెడుతుందా లేదా తేలాల్సి ఉంది. 2018 వ‌ర‌కూ క‌రుణానిధి జీవించి ఉండ‌గా.. ఆయ‌న ద్వారా ఇలాంటి కుటుంబ స‌మ‌స్య‌లు ఎన్నో క్లియ‌ర్ అవుతూ వ‌చ్చేవి. ఎందుకంటే క‌రుణానిధికి మేన‌ల్లుడే మురుసోలి మార‌న్. దానికి తోడు త‌న మేన‌మామ మీదున్న ప్రేమ కొద్దీ ముర‌సోలి ఆయ‌న పేరును పోలిన  పేర్లు త‌న‌పిల్ల‌ల‌కు పెట్టారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న లేక పోవ‌డం ఒక‌ర‌కంగా ఈ కుటుంబం మ‌ధ్య వివాదం నానాటికీ పెరిగి పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింది. ఇప్పుడు క‌రుణ  త‌న‌యుడు స్టాలిన్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి. ఆయ‌న‌కున్న ప్ర‌భుత్వ, రాజ‌కీయ ప‌ని ఒత్తిడి కార‌ణంగా ఈ కుటుంబ త‌గాదాలు తీర్చే ప‌రిస్థితి  క‌నిపించ‌డం లేదు. క‌ళానిధి తెలివిగా త‌న ఒకే ఒక్క సోద‌రికి 500 కోట్ల రూపాయ‌లు బ‌దిలీ  చేసి త‌ద్వారా కుటుంబంలో త‌న‌పై ఒత్తిడి రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏంటంటే.. ద‌యానిధి ఇన్నాళ్ల‌కు త‌న‌కు జ‌రిగిన  అన్యాయాన్ని గుర్తించి.. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత ఈ ర‌చ్చ‌ను చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కోడానికి సిద్ధ‌ప‌డ్డం వెన‌క ఉద్దేశ‌మేంట‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

  బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఆయనపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉన్నది. మనోజ్‌రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్‌ రెడ్డి నాలుగు రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో ఆయనకు చుక్కెదురయింది. శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  

గచ్చిబౌలిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఇతర ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు‌. 5 వేల మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని యోగాసలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ  అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని.. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధమన్నారు. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు.  కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువని చెప్పారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు. మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్‌సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తుమని వెల్లడించారు

విశాఖలో అట్టహాసంగా యోగా దినోత్సవం

    విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు. దాదాపు 15 వేల మందితో కలిసి ఆయన కాళీ మాత ఆలయం వద్ద యోగాసలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర మంత్రులు కేంద్రమంత్రులు యోగాసలు వేశారు.ఈ సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.‘‘అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసింది. యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ.  గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు. యోగాకు వయసుతో పనిలేదు.. యోగాకు హద్దులు లేవు’’ అని మోదీ అన్నారు.అంతర్జాతీయ యోగా డే కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఒకే స్ట్రెచ్ లో మూడు లక్షల 20వేల మందికి పైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు దీంతోపాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేచోట నిన్న చేసిన యోగాకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తూ ధ్రువపత్రాలను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు అందజేశారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేశ్‌ పాత్ర కీలకమైందని..నూతన కార్యక్రమాల రూపకల్పనలో ఆయన చొరవ ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యోగా కేవలం వ్యాయామం కాదు.. అదొక జీవన విధానం. ఈ ఏడాది విశాఖలో యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అద్భుతం’’ అని ప్రధాని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు

యోగాంధ్రతో ప్రపంచం చూపు ఏపీ వైపు.. చంద్రబాబుపై మోడీ ప్రశంసల వర్షం

ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ. శనివారం (జూన్ 21) విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం (జూన్ 20) విశాఖ చేరుకున్న ఆయనకు  గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌,  ముఖ్యమంత్రి చంద్ర‌బాబు,  ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సందర్భంగా   సీఎం చంద్ర‌బాబు విశాఖలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోల‌ను సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు చూపించారు. వీటిని తిల‌కించిన ప్ర‌ధాని.. అద్భుతంగా చేశార‌ని.. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఏర్పాట్లు  ఉన్నాయ‌ని అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు యోగాంధ్రపై మోడీకి వివరించారు. నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల గురించి తెలిపారు. దీనిపై మోడీ..యోగాను తాను ప్రపంచానికి పరిచయం చేశాననీ, ఆయితే చంద్రబాబు మాత్రం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారనీ ప్రశంసల వర్షం కురిపించారు.  

కేసీఆర్ మెడకు చుట్టుకున్న టెలిఫోన్ ట్యాప్ వైర్?

గోనె ప్రకాశరావు వర్షెన్ ఏంటి? కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.   ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లు గా మారడంతో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చేస్తోందని అంటున్నారు. మాజీ డిజిపి చుట్టూ కథ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కథ వెనుక ఉన్నది కెసిఆర్, వారి కుటుంబ సభ్యులేనంటున్నారు.  ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు విజయం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటక లో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. ఆ తర్వాత 2023లో కెసిఆర్  ఈ కేసులో ఇరుక్కున్నారు.   గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచార మంచ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్. హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో ఫీడ్ చేసి పెట్టుకున్నారు. శుక్రవారం (జూన్ 20) సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులోంచి కెసిఆర్ ను ఎవ్వరూ కాపాడలేరని ఆయన జోస్యం చెప్పేసారు. ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని అన్నారు.  ప్రధాని కావాలనే లక్ష్యంతో కెసిఆర్.. పార్టీని బిఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని అన్నారు గోనె ప్రకాశరావు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడిలా ఇరుక్కుపోయారని ఆయన వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బిజెపి నేతలు కృషి చేయాలని కోరారు.  గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో విపరీతమైన క్రేజ్ ఉంది. తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడివారు విని ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రపంచానికి భారతీయ వరం యోగా దినోత్సవం!

శనివారం  జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.  ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అగ్ర రాజ్యం అమెరికా సహా 177 దేశాలు, యోగ దినోత్సవం తీర్మానాన్ని సమర్ధించాయి. ఆ విధంగా 2015 జూన్ 21 న ప్రప్రథమంగా ప్రపంచ యోగ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యోగ దినోత్సవం 11వ వార్షికోత్సవం జరుపు కుంటోంది.  నిజానికి యోగ అనేది  ఒక విద్య, వ్యాయయం మాత్రమే కాదు  భారతీయ జీవన విధానం.  భారతీయ ఋషులు  ప్రకృతి ధర్మాలకు తమ తపఃశక్తిని, మేథో సంపదను జోడించి  ప్రపంచ మానవాళికి అందించిన అపూర్వ కానుక యోగ విద్య. భారతీయ ఋషి పుంగవుల విశాల దృక్పథానికి, వందల వేల సంవత్సరాల కృషికి ప్రతిఫలంగా లభించిన పవిత్ర విద్య, దివ్య ఔషదం యోగ విద్య. ఆ మహోన్నత విద్య మరుగున పడిపోకుండా..ముందుకు తీసుకుపోయే  సంకల్పంతో  ప్రధాని మోడీ మానసిక పుత్రికగా జన్మించి, ప్రపంచ ఆమోదం  పొందిన యోగా దినోత్సవం పదేళ్ళ ప్రయాణంలో ఎన్నోమైలు రాళ్ళను దాటింది.  అన్నిటినీ మించి, యోగా అంటే కేవలం సనాతన హిందూ ధర్మానికి సంబందించిన  విద్య.. హిందువులు మాత్రమే ఆచరించే మతపరమైన విధి అనే అపప్రద ఈ పదేళ్ళ కాలంలో  చాలా వరకు తొలగి పోయింది. యోగ  ఒక మతానికి పరిమితం కాదు, ఒక ధర్మానికి, దేశానికి, ప్రాంతానికి పరిమితం కాదు. సర్వ మానవాళికి సంబంధించిన  ప్రశాంత ఆరోగ్య జీనన  విధానం యోగ అనే భావనను ఈరోజున ప్రపంచం విశ్వసిస్తోంది. అందుకే..  ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు  యోగా  దినోత్సవంలో  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాల్గొనడమే కాదు.. యోగ విద్యను  నిత్య జీవితంలో సాధన చేస్తున్నారు.  ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాచుర్యం కారణంగా కావచ్చును  ఈరోజున ఆధునిక ఆలోపతి వైద్య శాస్త్రం కూడా.. ముందెన్నడూ లేనంతగా యోగ సాధనను ప్రోత్సహిస్తోంది. అవును  అనేక దీర్ఘ కాలిక వ్యాధులకు, ఔషధాలు, శస్త్ర చికిత్సలతో పాటుగా (కొన్ని కొన్ని సందర్భాలలో ప్రత్యాన్మాయంగానూ కూడా) యోగ సాధనను, డాక్టర్లు  ప్రిస్క్రెబ్  చేస్తున్నారు. ఒక్క వైద్య శాస్త్రంలో మాత్రమే కాదు.. మేనేజిమెంట్ స్టడీస్, ఇతరత్రా క్షేత్రాలలో సైతం యోగ  విద్య, యోగ సాధన అంతర్భాగంగా మారి పోయాయి.నిజానికి, ఈ రోజున సినిమా హీరోలు, హీరోయిన్లు,ఇతర సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు డైలీ వర్కవుట్ లో యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.   అదలా ఉంటే ఈ సంవత్సరం జరుపుకుంటున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సం కూడా  యోగా దినోత్సవాన్ని ఓ చక్కని థీమ్ తో జరుపుకోవడం జరుగుతోంది. అవును..  ప్రధానమంత్రి నరేందమోదీ నెలనెలా ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను పంచుకునే, మన్ కీ బాత్  కార్యక్రమంలో 2025 యోగా దినోత్సవం కోసంగా ప్రటించిన, మకుటం యోగా ఫర్ వన్ ఎర్త్ .. వన్ హెల్త్  థీమ్ గా ఈ సంవత్సరం  యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకుంటోంది. అలాగే ఈ సంవత్సరం మన విశాఖ పట్నంలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి,నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా పాల్గొంటున్నారు.

ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీ కొన్న పక్షి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి.   తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.  శుక్రవారం (జూన్ 20)   పూణే నుండి ఢిల్లీకి  వెడుతున్న విమానాన్ని పక్షి ఢీ కొనడంతో దానిని పూణె విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తరువాత ఆ విమానాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఆ విమానంలోని ప్రయాణీకులను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిసింది.  ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.  మరోవైపు   ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అలాగే మూడు మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది,  

అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం (జూన్ 20) ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపైనే కాకుండా వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టి ధర్నా చేసిన అంగన్ వాడీ కార్యకర్తలపై అప్పటి జగన్ ప్రభుత్వం బనాయించిన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు హోంశా ఆ ఉత్తర్వులలో పేర్కొంది.   ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ ఊరట దక్కింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు అమరావతి రైతులు అప్పట్లో నిరసన తెలిపారు.దీంతో   జగన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. 2020 ఆగస్టు 26న గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వారిని అడ్డుకుని అరెస్టు చేసింది. కేసులు పెట్టింది. ఆ కేసులను ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  

హనుమకొండ కోర్టు ఆవరణలో డిటొనేటర్లు

  హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరు డిటొనేటర్లు లభ్యమయ్యయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదరింపు కాల్ రావడం, తనిఖీలు చేపట్టిన పోలీసులకు డిటొనేటర్లు లభ్యం కావడంతో లాయర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఇటీవలి కాలంలో హనుమకొండ కోర్టుకు బాంబు బెదరింపు రావడం ఇది మూడో సారి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

అన్నా, చెల్లెలు.. మధ్యలో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట. మొన్న ఆస్తుల వివాదంలో.. నిన్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో వైవీ ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. తన ఫోన్‌ను జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ.. వైవీని సాక్ష్యంగా చూపించారామె..  షర్మిల లేవనెత్తున్న అంశాలపై కౌంటర్‌ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారంట. అటు మిగిలిన  వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అయిందనుకున్న తరుణంలో.. కాదు అటు ఏపీలోను ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి చెందిన రాజకీయనాయకుల ఫోన్ ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్‌తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్‌ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. దాంతో అన్నాచెల్లెల్ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. తర్వాత జగన్‌ పార్టీ 11 సీట్లకు పరిమితమై, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్ సైతం తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దుమణగక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పించడంతో అన్నాచెల్లెల్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు.  తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికీ వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనేమోనని షర్మిలఅనుమానాలు వ్యక్తం చేశారు.  ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌‌లకు ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేశారని, వారి అనుబంధం మందు రక్తం సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు . ఒకరి కోసం ఒకరన్నట్లు మెలిగేవారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ‌ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాపైన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డే తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని..అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదేపదే వైవీ సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడం  వైసీపీ పెద్దలకు మింగుడు పడడంలేదంట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు ఏంటో వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చేప్పారు. జగన్‌ ఒత్తిడితోనే వైవీ సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు. ఓ వైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బందిపడిన వైవీ సుబ్బారెడ్డి...తాజా ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడపట్ల వైవీ సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తనను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే..  మరోవైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్‌గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సినవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవీ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల  తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని పేర్కొన్నారు. అన్నాచెల్లెల్ల గొడవలపై బయటకు మాట్లాడ లేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన గోడు వెల్లగక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కు పోయారనే టాక్ నడుస్తోంది.

వంశీ.. జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి

వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టై రిమాండ్ ఖైదీగా  జైలులో  ఉన్న వల్లభనేని వంశీ.. జైలులో పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తరచుగా ఆయనను అధికారులు జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు అన్నట్లుగా తిప్పితున్నారు. కోర్టు   ఇటీవలే మ ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయను చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  తాజాగా గురువారం వంశీ   వాంతులు, విరేచనాలతో  డీహైడ్రేషన్ కు గురవ్వడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   

విమానం కూలిపోవడానికి కారణం అదేనా?

సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా  విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుండి ఇంజనుకు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దానిని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు.  పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేకాఫ్ అయి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనంఅందక రెండు ఇంజన్లు ఆగిపోతాయి.  ఎందుకంటే.. విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్. కొందరు నిపుణుల అంచనా. అయితే.. పెట్రోలు స్విచ్ ఆఫ్ లో ఉంటే పైలట్ కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా, అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకు వస్తుంది.