మహిళలను కించపరిచే వ్యక్తికి పరామర్శ సిగ్గు చేటు : ప్రశాంతి రెడ్డి

  వైసీపీ  అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరం మాగుంట లే ఔట్ లోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై  నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయతీగా వ్యాపారాలు చేసే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వాఖ్యలు చేసిన ప్రసన్నలాంటి వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  తీర్ధయాత్రలు చూసాం, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు లాంటివి కూడా చూసాం ఈ జైలు యాత్రాలేంటి ఆమె అన్నారు.మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని  జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు.  జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని సమర్ధించడం నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారని ఆమె అన్నారు. రూ.500కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   వైసీపీ నేతలు అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. అందుకే ప్రజలు   11 సీట్లకి పరిమితం చేసినా, ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదని వాపోయారు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకి వస్తే.. వాళ్లపై ప్రత్యర్థులు మీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు.

కాళేశ్వరంపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్

  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ఆరోపణలపై  పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు.  కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేశారు. తాజా నివేదికలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నేడే, రేపో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

సింగపూర్‌ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు : లోకేశ్

  సీఎం చంద్రబాబు బృందం సింగపూర్‌ పర్యటన విజయవంతమైందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా 2 వేలమంది తెలుగువారితో సమావేశమయ్యారు.  ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి తెలిపారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్‌కాల్‌ ద్వారా ఆర్సెల్లార్‌ మిత్తల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్‌లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.  2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను వైసీపీ అధినేత జగన్‌ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్‌రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్‌ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు.  ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం. హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాందేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు ఎకరా రూ.99పైసలకే భూమి కేటాయించాం. దీనిపై వైసీపీ నేతలు కోర్టుకెళ్లారు. తక్కువ ధరకు భూముల్ని మేం హెరిటేజ్‌కు కూడా ఇవ్వలేదు.. టీసీఎస్‌కు ఇచ్చాం. ఉద్యోగాలు వస్తాయని రూ.99పైసలకే భూములు ఇస్తున్నాం. అందులో తప్పేంటి? జగన్  తెచ్చిన పెట్టుబడులకంటే మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ లోకేశ్ తెలిపారు మధ్యం కుంభకోణ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక లిక్కర్‌ కంపెనీ రూ.400 కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసిందని చెప్పారు. బంగారంతో లిక్కర్‌ తయారు చేయలేరు కదా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడికి వెళ్లింది? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్‌ సంస్థ నుంచి డబ్బులొచ్చాయని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్‌ చేస్తున్నా.. దమ్ముంటే కాదని ఈ వ్యాఖ్యలను ఖండించాలంటూ ఆయనకు మంత్రి నారా లోకేష్‌ సవాల్ విసిరారు

జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట

  మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది.  మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి రోడ్డు పైకి భారీగా చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ మాలకొండయ్యకు గాయాలయ్యాయి.  ఓ సీఐ కిందపడిపోయారు.  కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్‌ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది.  దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్  చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.   ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.   

తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలవంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది. ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయనీ, అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయనీ పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  తిరుమలలో పుణ్యక్షేత్రంలో  కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల  మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పార్లమెంట్ వద్ద సైకిల్‌పై సందడి చేసిన బాలయ్య

  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సందడి చేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు  తీసుకొచ్చిన సైకిల్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చారు. సైకిల్‌ను చూసిన బాలయ్య అన్న ఎన్టీఆర్, వారి అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్లమెంట్‌కు రావడం అభినందనీయం అని బాలయ్య ప్రశంసించినట్టు అప్పలనాయుడు ట్వీట్ చేశారు.  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పార్టీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను బాలయ్య కలిశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలను బాలకృష్ణ కలవనున్నారు. ప్రతి తెలుగోడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆరోజు అన్న ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంటుకు రావడం అనేది అభినందనీయకమని బాలయ్య పేర్కొన్నారు.   అలాగే మన పార్టీ ప్రాముఖ్యతను భారతదేశం అంతా తెలిపే విధంగా మన పార్టీ సింబల్ సైకిల్ ను పార్లమెంట్ ప్రవేశ ద్వారం పక్కన  ఒక సిగ్నిఫికెన్స్ గా ఉండటం హర్షనీయమని చెబుతూ, అలాగే పక్కన ఉన్న సహచర ఎంపీ ద్వారా రోజు పార్లమెంటుకు సైకిల్ పై వస్తున్న విషయం తెలుసుకొని ఎంపీ  చేస్తున్న పనిని ప్రశంసిస్తూ, పార్లమెంట్ లో మీ గళం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అంటూ, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ మీ పై సదా ఉంటాయని వారి అభిమానాన్ని ఎంపీ పై  చూపిస్తూ ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగండి అని వారిని అభినందించి కాసేపు సరదాగా సైకిల్ పై కూర్చుని, ఫోటోలు ఇస్తూ  సరదాగా కాసేపు ఢిల్లీ విషయాలపై సంభాషించారని ఎంపీ కలిశెట్టి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు  

ఏపీ @32 జిల్లాలు.. అధికారిక ప్రకటనే తరువాయి?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సహిరద్దులు మార్చడంతో పాటు జిల్లాల సంఖ్య పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని పలు నియోజకవర్గాలు వేరే జిల్లాలకువెళ్లనున్నాయి. గత వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సవరించి, సరిదిద్దడానికి నిర్ణయించింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32కు పెరగనుంది.   పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం. పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు,  శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  అదే విధంగా  పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక పోతే విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు, అనకాపల్లి జిల్లాలో  అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలోకి  ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం నియోజకవర్గాలూ,  రాజమండ్రి జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. అమలాపురం జిల్లాలో  రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉంటాయి.  నరసాపురం జిల్లాలో  తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.. అలాగే  ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మచిలీపట్నం జిల్లాలో  కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు, విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి.  అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధి లోకి తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాలు, బాపట్ల జిల్లా పరిధిలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అదే విధంగా నరసరావు పేట నియోజకవర్గ పరిధిలో  చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, మార్కాపురం పరిధిలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఇక ఒంగోలు జిల్లాలోకి  ఒంగోలు పరిధి లోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే  నెల్లూరు జిల్లా పరిధిలో  కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, గూడురు పరిధిలోకి  సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉంటాయి. ఇక చిత్తూరు జిల్లా పరిధిలో  పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. అలాగే మదనపల్లె పరిధిలో పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె,  హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో  రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలు, ఆదోని జిల్లా పరిధిలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం,  కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు ఉంటాయని సమాచారం. నంద్యాల జిల్లా పరిధిలో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలూ, కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప ఉంటాయనీ, రాజంపేట జిల్లా పరిధిలో బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయనీ విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. టీమిండియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

  భారత- ఇంగ్లాండ్ మధ్య ఓవల్‌లో జరుగుతున్నచివరి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ టెస్ట్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ చూస్తుండగా భారత్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను డ్రా చేయాలని పట్టుదలతో ఉంది. గతంలో ఓవల్ పిచ్‌పై మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు మాత్రమే విజయం సాధించింది.   జట్లు..  ఇంగ్లాండ్‌: క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బ్రూక్‌, జాకబ్‌, స్మిత్‌, వోక్స్‌, అట్కిన్సన్‌, ఓవర్టన్‌, జోష్‌.  భారత్‌: జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సుదర్శన్‌, గిల్‌, కరుణ్‌, జడేజా, జురెల్‌, వాషింగ్టన్‌, అన్షుల్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌.   

ఐ(వై)పీఎస్ సంజయ్ బెయిలు రద్దు చేసిన సుప్రీం కోర్టు

కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరూ ఇప్పడు కర్మ అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ వంతు వచ్చింది.   జగన్ హయాంలో అప్పటి ఏపీసీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారిగా.. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా కాకుండా  వైసీపీ పోలీస్ సర్వీస్ అధికారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.  జగన్ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సంజయ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతీగా, జగన్ చెప్పినట్లు చేయడమే విధినిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయనీ కూడా మరిచిపోయారు. మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ కేసులపై మీడియా సమావేశాలలో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అలాగే చంద్రబాబు స్కిల్ కేసులో  అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని సమర్ధిస్తూ పొన్నవోలుతో కలిసి హస్తినలో మీడియా సమావేశాలలో మాట్లాడారు. అయితే అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ  డీజీగా ఉన్న సమయంలో అడ్డగోలుగా పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారు. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హైకోర్టు సంజయ్ కు బెయిలు మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో ప్రభుత్వ వాదన వినకుండా బెయిలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. అలాగే సంజయ్ పాల్పడిన అవినీతికి ఆధారాలుసమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అందుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో  లభించిన ఆధారాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. చివరికి సుప్రం కోర్టు సంజయ్ ముందస్తు బెయిలును రద్దు చేస్తూ గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. మూడు రావాలలోగా  సంజయ్ లొంగిపోవాలని ఆదేశించింది. 

కేటీఆర్‌, హరీశ్‌రావు‌తో కేసీఆర్ కీలక సమావేశం

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు సభాపతి నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నేటితో పి.జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వర కమిషన్  గడువు ముగిసి.. ప్రభుత్వానికి రిపోర్టు అందిన నేపథ్యంలో ఆ అంశంపై గులాబీ బాస్ చర్చించినట్లు తెలుస్తోంది.  కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేయబోతున్నట్లుగా సమాచారం. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ శ్రేణులను యాక్టివ్ చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించే చాన్స్ ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  జూబ్లీహిల్స్ బైపోల్ పార్టీ సన్నద్ధత, అభ్యర్థి ఎంపికపై హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కేటీఆర్ తమ అభిప్రాయాలను కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన లీగల్ టీమ్స్, బీఆర్ఎస్ సైనికులకు ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్నట్లుగా, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మాకు మూడు నెలల సమయం ఉంది. పనిలోకి వెళదాం బాయ్స్! అని కేటీఆర్ ఎక్స్ పిలుపునిచ్చారు. 

అయ్యో ఐవైఆర్ కూడానా?

మాజీ సీఎస్ ఐవైఆర్ కి తత్వం బోధపడింది.. జగన్ కు దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లేగా?!  మద్యం కుంభకోణం కేసులో జగన్ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నది. ఒక్కరొక్కరుగా జగన్ కు సన్నిహితంగా లేదా మద్దతుగా నిలిచిన ఒక్కొక్కరుగా ఆయనకు దూరం జరుగుతూ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేరారు.  ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన జగన్ కు గట్టి మద్దతుదారు అనడంలో  సందేహం లేదు.  రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి సీఎస్ గా ఆయన చంద్రబాబు హయాంలో పని చేశారు. ఆయన పదవీ విరమణ తరువాత ఆయన కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్ ను బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అయితే 2019కు ముందు నుంచీ కూడా ఐవైఆర్ పరోక్షంగా జనగ్ కు సహకరించేలా  చంద్రబాబు లక్ష్యంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూవచ్చారు. ఇక 2019 - 2024 మధ్యా కాలంలో అంటే జగన్ అధికారంలో ఉండగా ఐవైఆర్ పూర్తిగా మౌనం వహించారు. జగన్ విధానాలను ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దుత ఇచ్చి సహకరించారు.  ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు.  అప్పటి నుంచీ ఐవైఆర్ జగన్ కు మద్దతుగా నోరు తెరిచిన సందర్భంలేదు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమైన పరిస్థితి నెలకొని ఉండటమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషణ. ఎందుకంటే జనగ్ ను మద్దతుగా మాట్లాడితే తనకే బూమరాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో ఐవైఆర్ మౌనం వహించారని అంటారు. అయితే ఈ ఏడాది కాలంలో ఐవైఆర్ ఎన్నడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు.   కానీ హటాత్తుగా ఇటీవల ఐవైఆర్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో నోరెత్తారు. నోరెత్తడమే కాదు.. ఈ కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయారనీ, తప్పించుకోవడం కష్టమనీ కుండబద్దలు కొట్టేశారు.  అంతే కాదు అధికారంలో ఉండగా జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ముఖ్యంగా ఎక్సైజ్ కమిషనర్ గా అనర్హుడిని నియమించడం ద్వారా దిద్దుకోలేని తప్పు చేశారనీ విమర్శించారు.  అ లాగే మద్యం విక్రయాలలో కేవలం నగదు మాత్రమే అన్న విధానాన్ని కేవలం అవినీతి కోసమే తీసుకువచ్చారనీ, అలాగే  నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకురావడం ద్వారా ప్రజల ఆరోగ్యం గుల్ల కావడానికి కారణమై ఘోర తప్పిదానికి పాల్పడ్డానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయంలో జగన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లేననీ, ఆయన తప్పించుకునే అవకాశం లేదనీ ఐవైఆర్ అన్నారు.  అంతే కాదు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే చాలా చాలా పెద్దదన్ని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆఖరికి ఐవైఆర్ కృష్ణారావు కూడా జగన్  వదిలేశారని అర్ధమౌతోంది. నిజంగానే మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అవ్వడమంటూ జరిగితే.. ఆయనకు రాజకీయంగా కూడా ఎటువంటి సహకారం అందే అవకాశాలు దాదాపు లేవనే పరిశీలకులు అంటున్నారు.  

సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు

  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 3 వారాల్లోగా సరెండర్ కావాలని ఆదేశించింది. గత వైసీపీ హయాంలో అగ్నిమాప‌క విభాగంలో అవినీతి కేసులో సంజ‌య్‌పై కుటమి ప్ర‌భుత్వం ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. దాంతో హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాద‌న‌ల త‌ర్వాత జ‌స్టిస్ ఎన్‌వీఎన్ భ‌ట్టి, జ‌స్టిస్ అమానుతుల్లా ధ‌ర్మాస‌నం ఈ రోజు తీర్పును వెల్ల‌డించింది. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముంద‌స్తు బెయిల్ ద‌శ‌లోనే ట్ర‌య‌ల్‌ను పూర్తి చేసిన‌ట్టు ఉంద‌ని మండిప‌డింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖకు సంబంధించి వెబ్‌సైట్, యాప్‌లతో పాటుగా పలు అంశాలకు సంబంధించి.. ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.  కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. అలాగే సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు.. అక్కడా సదస్సులు నిర్వహించకుండా బిల్లులు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై ఆయనపై కేసు నమోదు చేశారు.

చిరుతను బంధించిన అటవీ అధికారులు

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు.  గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఇటీవల   చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే చిరుత  గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్, గోల్కోండ ప్రాంతాల్లో  సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దానిని బంధించేందుకు  14 ట్రాప్ కెమెరాలు,  మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు గురువారం ఉదయం అక్కడ అమర్చిన బోనులో బంధించారు.  అందరినీ హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు పట్టుబడడంతో అధికారులతో పాటు జనం ఊపిరి పీల్చుకున్నారు.  

మాలేగావ్ పేలుళ్ల కేసు.. నిందితులందరూ నిర్దోషులే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులు అందరూ నిర్దోషులేనంటూ ముంబై ప్రత్యేక కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురిపై అభియోగాలున్న సంగతి తెలిసిందే. 2008 నాటి ఈ కేసులో సుదీర్ఘ విచారణ తరువాత నిందితులను  అభియోగాలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత ఈ కేసులో నిందితులందరినీ ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది.   ఈ సందర్భంగా కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలలోని లోపాలను ఎత్తి చూపింది.    మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న జరిగిన భారీ పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. ఈ తరువాత దీనిని ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.   మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది, మాలెగావ్‌ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా లేల్చుతూ వారిని విడుదల చేసింది. నిందితుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందన్న NIA కోర్టు, సంశయలాభంతో మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసు నిందితుల విడుదల చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అనుమానంతో వారిని దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం తెలిపింది. 2008 సెప్టెంబరు 29న  మాలెగావ్‌ భికుచౌక్‌ ప్రాంతంలో టూవీలర్‌లో అమర్చిన ఐఈడీ  బాంబు పేలి ఆరుగురి వ్యక్తులు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు.   ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో బీజేపీకి చెందిన  ప్రజ్ణా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులు పేర్కొన్నారు. అలాగే రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్‌ సహా మరో ఐదుగురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో మొత్తం 220మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్  దర్యాప్తు చేసినా.. 2011లో దర్యాప్తునుఎన్ఐఏ చేపట్టింది. 

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం   వీలైనంత త్వరగా,  లేదా 3 నెలల్లో  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు సీజేఐ గవాయ్. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అనర్హత పిటీషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.

బ్లూ ఫిల్మ్స్ తెగ చూసేస్తున్న భారతావని.. ప్రపంచంలో మూడో స్థానం

భారత ప్రభుత్వం పాతిక అశ్లీల యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకొంది.  2018లో కూడా భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు 2015లో సైతం సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 850 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ లెక్కలు ఎలా ఉన్నా.. మనుషుల ఆలోచనాధోరణుల్లో మార్పులు రానంత వరకూ అశ్లీలతకు ఎవరూ అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉన్నాయి. నీలి చిత్రాలను పంపిణీ చేసే పోర్న్ హబ్ అనే సంస్థ సర్వే ప్రకారం.. అశ్లీల చిత్రాలు చూసేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాత స్థానంలో భారతీయులు ఉన్నారు. వివిధ ఇంటర్నెట్ సర్వేలు కూడా మన దేశంలో అశ్లీల చిత్రాలు చూసేవారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 63శాతం మంది చూస్తున్నారు, ఇందులో 75 శాతం మొబైల్స్‌లో చూస్తున్నారు. ఈ మార్కెట్‌ను ఆధారం చేసుకొనే దేశంలో అశ్లీల చిత్రాలు రూపొందించేవారు, నటించేవారు పెరిగిపోయారు. వాటిని యాప్‌లు, వెబ్‌సైట్ల రూపంలో మన ఫోన్లలోకి డంప్ చేస్తున్నారు. ఇటీవల నిషేధానికి గురైన ఉల్లు యాప్ యజమాని ఆస్తి రూ.100కోట్లు అని అంచనా. ఈ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుమ్మరిస్తున్నారు. ఉల్లు యాప్ వాళ్ళు హద్దులు మీరడంతో ఈ యేడాది మే నెలలో జాతీయ మహిళా కమిషన్ సమన్లు ఇచ్చింది. నిషేధానికి గురైన మరో యాప్ ఏఎల్‌టీటీ బాలాజీ. ఈ యాప్ యజమాని ఏక్తా కపూర్. పలు టీవీ సీరియళ్ళు, సినిమాలు తీసిన ఏక్తా కపూర్‌కి  2020లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. ఏఎల్‌టీటీ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుప్పిస్తున్నారు. నిషేధం వార్త వచ్చాక ఆ కంపెనీతో తనకు సంబంధం లేదనీ..  2021లో బయటకు వచ్చానని ఏక్తాకపూర్‌ వివరణ ఇచ్చారు. అయితే సదరు యాప్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ నుంచే పుట్టిందని ఆరోపణ. గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా ఈ అశ్లీల చిత్రాలు నిర్మించి అరెస్టయ్యారు. వెబ్‌సైట్లు, యాప్స్ నిషేధానికి గురవుతుండటంతో వీటిలో నటించేవారు, నిర్మాతలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఖాతాలు తెరిచి అశ్లీల చిత్రాలు గుమ్మరిస్తున్నారు. అంతే కాదు అందులో నటించేవారు వీడియో కాల్స్ వ్యాపారాలకు తెర తీశారు. నిర్దేశిత రుసుములతో సెమీ న్యూడ్, న్యూడ్ లైవ్ షోల ద్వారా వ్యాపారం చేస్తున్నారు. కొంతలో కొంత మెరుగు ఏమిటంటే తెలుగులో ఈ తరహా కంటెంట్‌కు తగిన ఆదరణ దక్కలేదు. కరోనా సమయంలో ఇక్కడ కూడా రొమాంటిక్ పేరుతో ఈ తరహా చిత్రాలు, బూతు కథలు చెప్పే వీడియోలు మొదలైనప్పటికీ, తగిన ఆదరణ రాకపోవడంతో కొద్ది కాలమే ఆ దందా నడిచింది. ఇందులో కొందరు పెయిడ్ వీడియోలు మొదలుపెట్టారు. అలాగే హాస్యం పేరుతో బూతులతో వీడియోలు చేస్తున్నారు. రీల్స్ ద్వారా ప్రవహిస్తున్న అశ్లీలత మరో ఎత్తు. ఏఐ టెక్నాలజీ వాడి స్టాండప్ కామెడీ వీడియోల తరహాలో యువతులను సృష్టించి వారితో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం నమోదు చేస్తున్నారు. 2015లో వచ్చిన తీర్పు మేరకు ఇంట్లో నాలుగు గోడల మధ్య పోర్న్ చూడటం నేరం కాదు. అయితే ఆ తరహా వీడియోలు తీయడం, ప్రచారం, పంపిణీ మాత్రం నేరం. సెక్షన్ 292 అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వీటిని రూపొందించ‌డం, డిస్ట్రిబ్యూషన్ చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి  ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెక్ష‌న్ 67ఏ ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకు జ‌రిమానా విధిస్తారు.

మద్యం కుంభకోణం కేసు.. ఆ 11 కోట్ల వివరాలివ్వండి..సిట్ ను కోరిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది.  ఈ కేసులో బుధవారం (జులై 30) పట్టుబడ్డ 11 కోట్లరూపాయల వివరాలను ఇవ్వాల్సిందిగా సిట్ ను కోరింది.  మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీ  మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పుడు  శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ సిట్ ద్వారా సేకరించడంతో ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నదన్న విషయం తేటతెల్లమైంది.   మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కేసి రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ ఇప్పటికే రికార్డు చేసింది. అలాగే  చంద్రారెడ్డినీ విచారించింది. ఇప్పుడు సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల వ్యవహారలో కూడా కొందరికి నోటీసులు ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మద్యం కుంభకోణం కేసులో ఒక వైపు సిట్.. మరో వైపు ఈడీ దర్యాప్తు స్పీడ్ ను పెంచేయడంతో ఈ కేసు పాత్రధారులు, సూత్రధారుల దగ్గరకు దర్యాప్తు చేరుతోందని అంటున్నారు.  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు పాత్రధాని, సూత్రధారి జగనే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు తమ వాంగ్మూలంలో  జగన్ పేరు చెబితే ఆయన కూడా అరెస్టయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈడీ దూకుడు, సిట్ స్పీడ్ జగన్ కు షాక్ ఇస్తుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు నమోదు అయిన వెంటనే దేశం దాటి వెళ్లిన వరుణ్ చక్రవర్తిని అరెస్టు చేసిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టి, దాని ఆధారంగానే 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.  అలాగే వరుణ్ చక్రవర్తి నుంచి రాబట్టిన సమాచారంతో మరి కొన్ని ప్రాంతాలలో కూడా సిట్ సోదాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసిన సిట్ మరిన్ని అరెస్టులకు సిద్ధమౌతోందని చెబుతున్నారు.  

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం.. సుప్రీం ఆదేశం

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై  అనర్హత  వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన  పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సూచిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో  నిర్ణయంపై స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కాగా గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్  ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవలసింది స్పీకర్ మాత్రమేనని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు గడువు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుపై అధికారం పూర్తిగా స్పీకర్ దే. ఆ చట్టంలో ఎటువంటి గడువు కూడా నిర్దేశించలేదు. అందుకే సుప్రీం గతంలో కూడా సూచనలు జారీ చేసిందే కానీ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో  సుప్రీం తాజా తీర్పులో కూడా అనర్హత అంశాన్ని సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టడం సరికాదంటూ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అదే సమయంలో అదే సమయంలో న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్లను తోసిపుచ్చింది.