మరో గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన జగన్
posted on Oct 10, 2019 @ 7:18PM
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నపెద్దల మాటను సార్ధకం చేసే పనిలో పడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా లో 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అధికారికంగా ప్రారంభించారు. ఈ పధకం తాను ప్రారంభంచటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తన భావాలను వెల్లడించారు. 'వైయస్సార్ కంటివెలుగు' మరో విప్లవాత్మక పథకమన్నారు రోజా. ప్రజల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు సీఎం జగన్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రెండు విడతల్లో డెబ్బై లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. రాష్ట్రంలోని కోట్లాది మందికి నేత్ర పరీక్షలకు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది అన్నారు.
"ఎవరు కూడా చేపట్టనటువంటి విధంగా ఒక కొత్త పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఈ రోజు ఆయన పరిపాలనకి మానవత్వాన్ని అద్దారు అని చెప్పడానికి ఈ కంటి వెలుగు పథకాన్ని నిదర్శనంగా చెప్పొచ్చు. రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపితే, తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా అంధత్వ నివారణ లక్ష్యంగా మారీ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకి, అలాగే డెబ్బై లక్షల మంది విద్యార్థులు అందరికీ కూడా కంటి పరీక్షలు చేసి వారి కంటి సమస్యల్ని దూరం చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ కంటి వెలుగు పధకాన్ని వెలుగులోకి తీసుకువచ్ఛారు" అని రోజా పేర్కోన్నారు.