బస్సు కిటికీ నుంచి తల బయటకి.. ఘాట్రోడ్లో యువతి బలి..
posted on Dec 2, 2021 @ 6:49PM
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అంటారు. నిజమే.. సురక్షితమే కావొచ్చు. కానీ, మనం జాగ్రత్తగా ఉంటేనే. లేదంటే.. బస్సులో ఉన్నా ప్రమాదం తప్పదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం.
బస్సు కిటికీలోంచి చేతులు బయటకు పెట్టరాదు.. అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంటుంది. పెద్దలు చిన్నపిల్లలకు పదే పదే ఇలా జాగ్రత్తలు కూడా చెబుతుంటారు. చేతులు బయటకు పెడితేనే ప్రమాదమంటే.. ఇక తల బయటకి పెడితే ఇంకెంత డేంజర్? చిన్న పిల్లనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటే.. మరి పెద్దలే అలాంటి అజాగ్రత్త పనులు చేస్తే ఎలా? శ్రీశైలం ఘాట్రోడ్డులో అదే జరిగింది. ఓ యువతి చర్య.. ఆమె నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే....
కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఆ యువతి తల బయటకు పెట్టింది. ఘాట్ రోడ్ అందాలను ఆస్వాదిస్తోంది. కానీ, తాను చేస్తున్న పని ఎంత ప్రమాదకరమైనదో ఆ సమయానికి ఆమెకు తెలీదు. ఆ తర్వాత తెలుసుకునేందుకు ఆమె ప్రాణాలతో లేదు.
యువతి బస్సు కిటికీ నుంచి తల బయటపెట్టిన సమయంలో.. మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న లారీ ఆమె తలకు బలంగా తగిలింది. తలకే నేరుగా లారీ తగలడంతో.. తీవ్ర గాయాలతో.. రక్తస్రావంతో.. ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. శ్రీశైల యాత్ర అలా శోకసంద్రంగా మారింది. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఆ కుటుంబంలో విషాధం నింపింది.