ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ జీరో.. తెలుగేదేశం కూటమి క్లీన్ స్వీప్ ఖాయం?!

ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా కీల‌కం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో ప‌ట్టుసాధించేందుకు అన్ని పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాయి.  గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు ఉమ్మ‌డి జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాలకు గాను పది నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. టీడీపీకి ఇక్క‌డ ఒక్కటంటే ఒక్క  స్థానం కూడా ద‌క్క‌లేదు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో పరిస్థితి తారుమారైపోయినట్లు కనిపిస్తోంది.  ఉమ్మ‌డి జిల్లాలో వైసీపీకి ఎదురుగా వీస్తున్నది. దీంతో 2024 ఎన్నికలలో ఈ జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన విజ‌యం సాధించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో  చేరారు. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ న‌ర‌స‌రావుపేట ఎంపీగా  ఈసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గానికి  వైసీపీ అధిష్టానం ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను ఎంపిక చేసింది. ఖ‌లీల్ నియామ‌కాన్ని స్థానిక వైసీపీ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీనికితోడు అనిల్ కుమార్ యాద‌వ్ వ‌ర్గానికి, మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ వ‌ర్గీయుల మ‌ధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

 ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతగా కొన‌సాగుతున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల కేటాయింపు విష‌యంలో త‌న‌కు కనీస స‌మాచారం లేకుండా వైసీపీ అధిష్టానం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీని వీడ‌టం ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలుగుదేశంలో చేరితే ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి ఎంతో దోహ‌ప‌డుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వేమిరెడ్డి   తెలుగుదేశం గూటికి చేరేందుకే   మొగ్గుచూపుతున్నారు. ఆయ‌న‌కు నెల్లూరు ఎంపీగా, టీటీడీ చైర్మ‌న్ గా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. మొత్తానికి  ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర‌ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న భావన రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ జిల్లాల్లో వైసీపీ పూర్తిగా కొలాప్స్ అయింద‌ని,  2024 ఎన్నిక‌ల్లో 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ తెలుగుదేశం, జనసేన క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌లు    స‌ర్వేల ఫ‌లితాలు సైతం వెల్ల‌డించాయి. 


ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే..

నెల్లూరు సిటీ ..  


నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో అనిల్ కుమార్ యాద‌వ్ బ‌రిలో నిలిచి టీడీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ‌పై విజ‌యం సాధించారు. అనిల్ కుమార్ దూకుడు వ్య‌వ‌హారంతో నెల్లూరు జిల్లాలో వ‌ర్గ‌విబేధాలు నెల‌కొన్నాయి. జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేల్లోసైతం అనిల్ పై స్థానిక ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలింది. దీంతో అనిల్ కుమార్ యాద‌వ్‌ ను ఈసారి న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా అధిష్టానం పంపించింది. సిటీ ఇంచార్జిగా ఖ‌లీల్ అహ్మ‌ద్ ను జ‌గ‌న్ నియ‌మించారు. ఖ‌లీల్ అభ్య‌ర్థిత్వంపై వైసీపీలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌లీల్ స్థానంలో సినీ న‌టుడు అలీని బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం, జనసేన కూటమి   అభ్య‌ర్థిగా మ‌రోసారి మాజీ మంత్రి నారాయ‌ణ బ‌రిలోకి దిగుతున్నారు. ఈసారి నారాయ‌ణ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని నెల్లూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

నెల్లూరు.. 


నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో  సైతం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు.   కొంత‌కాలం క్రితం వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఆయ‌న ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. దీంతో నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డితోపాటు వైసీపీ వ‌ర్గీయులు అనేక మంది తెలుగుదేశంలో చేరారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డి స్థానంలో వైసీపీ అధిష్టానం ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి తెలుగుదేశం త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌డంతో  తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతే కాకుండా  వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌నకు లోపాయికారిగా మ‌ద్ద‌తు తెలుపుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం  ఖాయమని  ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

కావ‌లి.. 


కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి తెలుగుదేం, జనసేన విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాను ఆ పార్టీల‌ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో వైసీపీ అభ్య‌ర్థి రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌ళ్లీ ఆయ‌ననే బరిలోకి దింపే యోచనలో  వైసీపీ అధిష్టానం  ఉంది. 2014, 19 ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు.  అయితే ప్రస్తుతం ఆయనకు ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో  ప్ర‌జ‌ల్లో రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌ విభేదాలు ఆ పార్టీకి పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్య‌ర్థిగా కావ్య క్రిష్టారెడ్డి బ‌రిలో దిగుతున్నారు. తొలిసారి క్రిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన బ‌లంతోడు కావ‌డంతో క్రిష్ణారెడ్డి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఉదయగిరి .. 


ఇక ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం విషయానికి వస్తే.. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజ‌యం సాధించారు. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తుండ‌టం, అభివృద్ధిని గాలికొదిలేయ‌డంపై ఆయన ప‌లుసార్లు విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ తీరులో ఏమాత్రం మార్పురాక‌పోవ‌టంతో ఆయ‌న వైసీపీ వీడారు. ఆ త‌రువాత వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో   మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. దీనికి తోడు గ్రూపు రాజ‌కీయాలు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం,  జ‌న‌సేన అభ్య‌ర్థిగా కాక‌ర్ల సురేష్ బ‌రిలోకి దిగుతున్నారు.  కాక‌ర్ల చారిట‌బుల్ ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఆయన  నియోజ‌క‌వ‌ర్గంలో ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో టైల‌రింగ్ కోర్సు, బ్యూటీషియ‌న్  కోర్సుల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దీంతో కాక‌ర్ల‌పై నియోజ‌క‌వ‌ర్గ  ప్ర‌జ‌ల్లో అభిమానం ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయనకు ఉన్న‌ మంచిపేరు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు, వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు కాక‌ర్ల విజ‌యానికి క‌లిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. 

 
గూడూరు.. 

గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో నూ వైసీపీకి ఎదురీదాల్సిన పరిస్థితే నెలకొని ఉంది.  గ‌త ఎన్నిక‌ల్లో  వైసీపీ అభ్య‌ర్థిగా వెలగపల్లి వరప్రసాద రావు బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అయితే  ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతుండ‌టంతో వైసీపీ అధిష్టానంఆయన స్థానంలో నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి బాధ్య‌త‌ల‌ను మేరిగ ముర‌ళీధ‌ర్ కు అప్ప‌గించింది. ఆయ‌న తోలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌బోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. దీనికితోడు ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న ప‌ట్ల‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో  తీవ్ర ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కు మ‌రోసారి  తెలుగుదేశం అవ‌కాశం ఇచ్చింది. 2019లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి పాశం సునీల్ ఓడిపోయిన సంగతి విదితమే.  అయితే గ‌త ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పాశం సునీల్ పై ప్ర‌జ‌ల్లో సానుకూలత  వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగర‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.  

సూళ్లూరుపేట.. 

సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా కిలివేటి సంజీవ‌య్య మూడోసారి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే  వైసీపీలోనే సంజీవ‌య్య‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ  నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త‌రువాత నుంచి సంజీవ‌య్య రెడ్డిసామాజిక వ‌ర్గంపై క‌క్ష‌ పూరిత చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌న్న వాద‌న ఉంది. దీంతో ఈసారి వైసీపీలోని ఓ వ‌ర్గం నేత‌లు ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో స‌జీవ‌య్య బ‌రిలో నిలిస్తే ఆయ‌న ఓట‌మికి వైసీపీలోని అస‌మ్మ‌తి నేత‌లు కార‌ణం అవుతార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌జ‌రుగుతుంది. మ‌రోవైపు తెలుగుదేశం, జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెల‌వ‌ల సుబ్ర‌హ్మ‌ణ్యం కుమార్తె నెల‌వెల విజ‌య‌శ్రీ బ‌రిలోకి దిగుతున్నారు. ఆమె మొద‌టిసారి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగుతున్నారు. వైసీపీలోని  వ‌ర్గ‌విబేధాలు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు కలిసి ఆమె విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 

స‌ర్వేప‌ల్లి.. 

స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి విజ‌యం సాధించిన కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రిగా కొన‌సాగుతున్నారు. కాకానిపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీలో వ‌ర్గ‌ విబేధాలు ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మ‌వుతాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. తెలుగుదేశం,జ‌న‌సేన కూట‌మి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంకా అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  1994, 1999 మిన‌హా  ఆ త‌రువాత వ‌రుస‌గా నాలుగు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతూ వ‌స్తున్నారు. ఈసారికూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

ఆత్మ‌కూరు.. 

ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. దీంతో 2022లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి త‌ర‌పున ఇంకా అభ్య‌ర్థి ఖరారు కాలేదు. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు.. వైసీపీలోని కీల‌క నేత‌లంతా టీడీపీలోకి రావ‌డంతో ఆ ప్ర‌భావం వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తుండ‌టంతో కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వెంక‌ట‌గిరి..

నెల్లూరు జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి  క్యాడర్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వెంకటగిరి ఒకటి. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  ఆనం.. ఏడాది క్రితం ఆ పార్టీతో విభేదించి తెలుగుదేశంలో చేరారు. ఈసారి తెలుగుదేశం తరఫున  వెంక‌ట‌గిరి అభ్య‌ర్థిగా ఆనం బ‌రిలో నిలుస్తార‌ని అంటున్నారు. ఆనం చేరికతో టీడీపీలో  బలం మరింత పెరిగినట్లైంది. ఇక్క నుంచి ఆనం స్థానంలో వైసీపీ  మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఇక్క‌డి నుంచి బ‌రిలో నిలిస్తే వైసీపీ ఓట‌మి ఖాయమ‌న్న భావన స్థానికంగా  వ్యక్తమౌతోంది. 

కోవూరు..

కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి న‌ల్ల‌పునేని ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఐదుసార్లు విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  2024 ఎన్నిక‌ల్లో ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. తెలుగుదేశం త‌ర‌పున  పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. వైసీపీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి టీడీపీలోకి వ‌స్తే ఆయ‌న స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డికి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశం  ఉంటుందన్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఈసారి  ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై వ్య‌తిరేక‌త‌, వైసీపీలో వ‌ర్గ విబేధాలు, జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేత అన్నీ క‌లిసి టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థి విజ‌యానికి బాట‌లు వేస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఫోన్ టాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ ప్రకంపనలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును కొత్త సిట్ చేపట్టిన తరువాత కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సిట్ చేతికి చిక్కిన ఒక పెన్ డ్రైవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది.  ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు అధికారులు బావిస్తున్నాయి.  మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు.   ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్   ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో ప్రభాకర్ రావు తన వాంగ్మూలంలో పదేపదే మాజీ డిజిపి మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రస్తావిం చడంతో అప్పటికే సిట్ అధికారులు మాజీ డిజిపి ని విచారణ చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అలాగే  ఫోన్ టాపింగ్ రివ్యూ కమిటీ లో సభ్యులైన మాజీ  సిఎస్ లు సోమేష్ కుమార్, శాంత కుమారి ఇతర అధికారులు తిరుపతి, శేషాద్రి లను కూడా  విచారించారు. ఇక  మంగళవారం  ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తున్నది.   ఇక బుధవారం(డిసెంబర్ 24) సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన  పెన్ డ్రైవ్ తీవ్ర కలకలం సృష్టిస్తున్నది.  ఈ కేసుకు సంబంధించిన ఈ పెన్ డ్రైవ్  కీలక ఆధారంగా మారను న్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తన పదవీకాలంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన కీలక వివరాలను ఈ పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ఉంచినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రధానంగా  రాజకీయ నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు ఉంచి సిట్ అధికారులు విచారిస్తున్నట్లు  తెలుస్తోంది.  సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ఫోన్ టాపింగ్ గురైన ఫోన్ నెంబర్ల ను ఇప్పటికే  గుర్తించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం కొనసా గుతున్న సమయంలో పోలీసుల చేతికి చిక్కకుండా ప్రభాకర్ రావు టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా కూడా ఈ పెన్ డ్రైవ్ ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి చిక్కడం దర్యాప్తులో కీలక మైలురాయిగా మారింది. ఈ కేసు ఛేదించడానికి  పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికా రులు చెబుతున్నారు.  ప్రభాకర్ రావు నుండి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు ఎల్లుండి వరకూ  విచారించడానికి సమయం ఉందని అధికారులు తెలిపారు.  

ప్రధాని పదవికి రాహుల్ అనర్హుడా?.. రాబర్ట్ వధేరా మాటల ఆంతర్యమేంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సొంత కుటుంబం నుంచే వ్యతిరేక సెగ తగులుతోందా? ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత ఇండీ కూటమి నేతలు రాహుల్ నాయకత్వంపై ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా పలువురు నేతలు రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాహుల్ సొదరి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధేరా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాహుల్ పేరు ఎత్తకుండానే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి త‌న భార్య, వ‌య‌నాడ్‌  ఎంపీ ప్రియాంక గాంధీ అర్హురాల‌ంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక పెను చీలకకు దారి తీసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.    రాబర్ట్ వధేరా.. ప్రియాంక వధేరా లోక్ సబలో బలమైన గళం వినిపించారనీ,  ఆమెకు ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయనీ అన్నారు. అక్కడితో ఆగకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తేనే దేశంలో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందని, అప్పుడే దేశంలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగలుగుతుందనీ రాబర్ట్ వధేరా అన్నారు.  లోక్ సభ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే  కొందరు  ఎంపీల నంచి కూడా వచ్చిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాబర్ట్ వధేరా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమనీ, వాటితో పార్టీకి సంబంధం లేదంటూ కొందరు సీనియర్లు వివాదం పెరగకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ప్రియాంక వధేరా గాంధీ అయితే, తన భర్త వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనం వహించారు.  దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందిస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు.. షర్మిల ఎక్కడ?

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడమన్నది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం.  పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో   వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.  షర్మిల  వినా ఈ వేడకకు  వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్, ఆమె తల్లి విజయమ్మా చాలా కాలం తరువాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరు వురూ దూరందూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది.  ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది? అన్న విషయంపై స్పష్టత లేదు.  ఆ ఫొటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినదా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు.   మొత్తం మీద సామాజిక మాధ్యమంలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడ అంటూ నెటిజనులు పోస్టు చేస్తున్నారు.  ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండటం ఈ ఫొటో తాజాదే అయి ఉంటుందని భావించవ చ్చునని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్, షర్మిల మధ్య దూరం తరగలే దనడానికి ఈ ఫొటో నిదర్శనంగా ఉందని చెబుతున్నారు. ఎందుకంటే జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు ధాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్యా సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులవెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరో సారి చర్చకు తెరలేపింది. 

కూటమి పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ ఎలక్షన్ ఫండ్స్

  తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.  రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి. ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.  ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.   పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది.  తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి. జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి.  వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు. ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.  

అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు  ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ,  అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన  తోలు తీస్తా  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు  ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు.  బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా  మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు.  ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.

జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!

ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి.  సరే జనం విషయం గుర్తించి 2019లో తాము  కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.  అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు.  ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే  ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు. సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే..  ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా  మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక  ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి. 

కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.    షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి.  2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.  అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.