సీఎం జగన్ రాజీనామాకు వైసీపీ నేతల డిమాండ్!
posted on Mar 25, 2021 @ 3:30PM
సీఎం జగన్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలే డిమాండ్ చేస్తారన్న భయం ముఖ్యమంత్రికి పట్టుకుంది. వైసీపీ ఎంపీలే పరోక్షంగా సీబీఐ కేసులంటూ జగన్ను విమర్శిస్తున్నారు. ఏపీకి చెందిన వ్యక్తి నుంచి గంగవరం పోర్టును గుజరాత్ కంపెనీకి అమ్ముకున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. ఇలా సీఎం జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.
పలువురు వేసిన ముళ్ల కంచె దాటి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎన్ని అడ్డంకులెదురైనా ఆయన ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ‘‘హైకోర్టు సింగిల్ జడ్జి నిమ్మగడ్డకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలన్న మా పార్టీ మంత్రులు.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీఎంకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి.. మా పార్టీ నేతలు సీఎం రాజీనామా అడుగుతారేమో అన్న భయం పట్టుకుందన్నారు. నేను సీబీఐ విచారణ నుంచి తప్పుకుంటున్నానని మా పార్టీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రతీ శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకుని సీబీఐ విచారణకు వెళ్లకుండా ఉంటున్న మా సీఎంను.. మా ఎంపీలే పరోక్షంగా నా పేరుమీద ఆయనను విమర్శిస్తున్నారనే బాధకలుగుతుంది’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.
రాష్టంలో 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా.. కేవలం 2 కోట్ల డిమాండ్ చూపించి, మిగతా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్మకునేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి నుంచి గంగవరం పోర్టును గుజరాత్ కంపెనీకి అమ్ముకుంటే భాదగా ఉందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకు వస్తారు? అని జగన్ను ప్రశ్నించారు. అదాని, అంబానీలకు రాష్ట్రాన్ని అప్పగిస్తారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.