Read more!

టీడీపీని అమ్మేసుకోండి! ఎమ్మెల్యే రోజా సెటైర్లు 

మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో విపక్ష నేతలను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు నాయుడు మనవడితో ఆడుకుంటూ శేషజీవితం గడపాలంటూ రోజా ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న వైసీపీ ఇక టీడీపీని పూర్తిగా అణచివేసినట్లేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీ విజయకేతనం ఎగురవేసి టీడీపీని తరిమికొట్టిందని రోజా చెప్పారు. 18 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్ని కొల్లగొట్టారని రోజా తెలిపారు. పవన్‌ ఒక్కోచోట ఒక్కో పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని.. ఆయనకు ఒక స్పష్టతే లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరు వానపాము లేచి నాగుపాముపై బుసకొట్టినట్లు ఉందన్నారు. పవన్‌కు అసలు జెండా, అజెండానే లేవని ఘాటుగా ఎమ్మెల్యే రోజా. విమర్శించారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయని పవన్‌, చంద్రబాబుకు ముందే తెలుసని.. అందుకే వారు లెక్కింపు రోజు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారని రోజా అన్నారు

తమ సొంత పార్టీలోని రెబల్స్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని.. విజయంతోనే వారికి సమాధానం చెప్పామన్నారు రోజా. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించడానికి రెబెల్స్ ను పెట్టారని, వారు డబ్బులు కూడా కొందరు నేతలు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితాల రోజున సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన రోజా.. తమకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల తాట తీస్తామని హెచ్చరించారు.