షర్మిళ అటాక్.. వైసీపీ మైండ్ బ్లాక్!
posted on Jul 14, 2024 @ 1:01PM
ఏపీలో ఐదేళ్లు కక్షపూరిత పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తరువాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇవ్వడంతో రాబోయే కాలంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. జగన్ పై ఉన్న పాత కేసులకు కొత్త కేసులు తోడు కావడంతో ఆయన జైలుకెళ్లడం ఖాయమని వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. అదే జరిగితే వైసీపీ కనుమరుగు అవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు.. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం సహకారం ఉండటంతో ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దీంతో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమనిఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. మరో వైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు వైసీపీ నేతలను వణికిస్తోంది. షర్మిల దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేయకుంటే వైసీపీని వీడటమే బెటర్ అనే నిర్ణయానికి ఆ పార్టీ ముఖ్యనేతలు వచ్చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆమె పోటీ చేసిన ఒక్క కడప పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ షర్మిలపై అసభ్యకర పదజాలంతో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో.. ఏపీలోని వైఎస్ అభిమానులను కాంగ్రెస్ లోకి ఆహ్మానించేందుకు షర్మిల, కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో షర్మిల ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఘోర ఓటమి తరువాత కూడా తమకు 39శాతం మంది ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు.
ఏపీ ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలా అనే విషయంపైనే జరిగాయనీ, జనం జగన్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో చంద్రబాబు సీఎంగా అంగీకరించని వాళ్లు వైసీపీకి ఓటు వేశారు. నిజానికి వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ వే అని షర్మిల వివరంగా చెప్పారు. వైఎస్ రాజకీయ వారసుడు జగన్ మోహన్ రెడ్డి కాదన్న షర్మిల వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని బాంబు పేల్చారు. అంతేకాక.. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసిన జీవోపై వైసీపీ పెద్ద రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, షర్మిల గతాన్ని గుర్తుచేస్తూ జగన్ మెహన్ రెడ్డి, వైసీపీ నేతలు నోరెత్తకుండా చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్నికల ప్రచార సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత పథకం అమలుపై దృష్టి కేంద్రీకరించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయించిందని వైసీపీ నేతలు పెద్ద రాద్దాంతం చేశారు. ఆ విషయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా వైసీపీ నేతలు తమ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. ఈ సమయంలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి మాత్రమే పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారని వైసీపీ నేతలను షర్మిల ప్రశ్నించారు. అదే సమయంలో తల్లికి వందనం పథకం జీవోపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.
షర్మిల దూకుడుతో వైసీపీ నేతలు తేలిపోయారు. ఏపీలో అసలైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయే అంటూ షర్మిల తన దూకుడుతో చెప్పకనే చెప్పారు. ఇదే విషయాన్ని వైసీపీ ముఖ్యనేతలు జగన్ ముందు ప్రస్తావించారు. షర్మిల దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్తులో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని వారు జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలపై జగన్ అనుకూల మీడియా విమర్శలకు తెర లేచింది. అయితే వైసీపీ ఇంత కాలం పాడుతూ వస్తున్న పాత పాటనే మళ్లీ అందుకుంది. వైఎస్ బిడ్డనంటూ చెప్పుకుంటున్న షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు మాట్లాడుతున్నారనీ, జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు మాత్రమే చంద్రబాబు చెప్పినట్లు షర్మిల మాట్లాడుతున్నారంటూ కథనాన్ని వండి వార్చింది. చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్ అంటూ పేర్కొంది. దీనిపై షర్మిల ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉందంటూ షర్మిల ఫైర్ అయ్యారు. మొత్తం మీద షర్మిల దూకుడుకు జగన్ వద్ద సమాధానమే లేదన్న భావన వైసీపీ వర్గాల్లోనే వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడడమే బెటర్ అన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లోనే వ్యక్తం అవుతోంది.