నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా?
posted on Jan 30, 2020 @ 10:25AM
ఈసారైనా డెత్ వారెంట్ ప్రకారం నిర్భయ దోషులను ఉరి తీస్తారా? లేక ఏవైనా కారణాలతో మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, నిర్భయ దోషుల ఉరితీత సమయం సమీపిస్తోన్నకొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడువు దగ్గరపడుతున్నకొద్దీ నిర్భయ దోషులు... పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ... ఉరిశిక్ష అమలును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ సింగ్ పిటిషన్ తో ఒకసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడగా... ఇప్పుడు, దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ... క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చాలంటూ విజ్ఞప్తి చేశాడు. అలాగే, మరో దోషి అక్షయ్ సింగ్ సుప్రీంలో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఒకవేళ అక్షయ్ పిటిషన్ను సుప్రీం తిరస్కరిస్తే... రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్ధన పెట్టుకునే అవకాశముంది. దాంతో, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలవుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి.
తాజా పరిణామాలను గమనిస్తే, న్యాయవ్యవస్థలో వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనా... దారులన్నీ మూసుకుపోయినా... ఫిబ్రవరి ఒకటిన మాత్రం ఉరిశిక్ష అమలు కాకుండా పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. చివరికి క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించినా...కోర్టుల్లో పిటిషన్లను కొట్టివేసినా... మళ్లీమళ్లీ సుప్రీంను ఆశ్రయిస్తూ... ఉరిశిక్ష వాయిదా పడేలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్... దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నిర్భయ దోషులకు అసలు జనవరి 22నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా... ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్థనతో వాయిదా పడింది. ఇక, ఇప్పుడు మరో దోషి అక్షయ్ సింగ్... క్యూరేటివ్ పిటిషన్ వేయడంతో... మరోసారి ఉరి అమలుపై సందిగ్ధత నెలకొంది. అయితే, జనవరి 31 అర్ధరాత్రిలోపు ఎలాంటి అడ్డంకులు రాకపోతే మాత్రం.... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయడానికి అంతా సిద్ధమైంది. మరి, ఈసారైనా ఉరిశిక్ష అమలవుతుందో లేదో చూడాలి.