క‌ప్పు ల‌క్కును ఈసారైనా మార్చ‌గ‌ల‌దా?

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ -2025  విన్నర్స్ జట్టుకు భారీ  ప్రైజ్ మ‌నీ దక్కనుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు  39.7 కోట్ల  రూపాయ‌ల‌ ప్రైజ్ మనీ దక్కనుంది. అదే ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన జ‌ట్టుకు 19.8 కోట్లు దక్కుతాయి. ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.  ఈ సారి టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలిచినా ఆ జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి విశ్వవిజేతగా నిలవనున్న జట్టే ఏదన్న ఉత్కంఠ నెలకొంది.   విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీని ఇంత వరకూ ఏడు సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇంగ్లాండ్ కూడా టెటిల్ విన్నర్ గా గతంలో నిలిచింది.  ఈ సారి ఆ రెండు జట్లూ కూడా సెమీస్ తోనే టోర్నీ నుంచి వైదొలిగాయి.  

సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆసీస్ పై అద్భుతమైన విజ‌యాన్ని  సాధించి స‌గ‌ర్వంగా  ఫైన‌ల్స్ లో అడుగు పెట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో జెమీ మారోడ్రిగ్స్ రికార్డు సెంచరీతో చెల‌రేగ‌గా.. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సూప‌ర్భ్ ఆఫ్ సెంచురీతో రాణించింది.  దీంతో గ‌త కొన్నేళ్లుగా అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను  మట్టి కరిపించి మరీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది టీమ్ ఇండియా.  

భార‌త్- ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఆదివారం(నవంబర్ 2) ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు వేదిక సెమీస్ జ‌రిగిన న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం కావ‌డం టీమిండియాకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెప్పవచ్చు. సెమీస్ చూపిన జోరును ఫైన‌ల్స్ లోనూ మ‌న విమెన్ క్రికెట‌ర్లు కొన‌సాగించాలని యావత్ భారత్ కోరుకుంటోంది.  భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం (న‌వంబ‌ర్ 2) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుంది అన్న చర్చ కూడా క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.  

బిగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లలో చతికిల పడటం దక్షిణాఫ్రికా కు అలవాటేననీ,  ఈ సారైనా ఆ ఒరవడిని దక్షిణాఫ్రికా మహాళల క్రికెట్ జట్టు ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న డిబేట్ క్రికెట్ అభిమానుల్లో జరుగుతోంది.

మరో వైపు భారత విమెన్స్ టీమ్ కూడా ఇప్పటి వరకూ మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరినా కప్ మాత్రం అందుకోలేకపోయింది.  ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే క్రికెట్ లో ఆ జట్టును అది మహిళల జట్టైనా, పురుషుల జట్టైనా మోస్ట్ అన్ లక్కీయెస్ట్ జట్టుగా చెబుతుంటారు.  దీంతో ప్ర‌స్తుత  2025 విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ లోనైనా ఈ జ‌ట్టును అదృష్టం వరిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. అలాగే గతంలో ఫైనల్ లో  చతికిలబడినట్లుగా కాకుండా టీమ్ ఇండియా విమెన్స్ జట్టు ఈసారి విజేతగా నిలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందనేది లేలాలంటే.. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.  

అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఈఐఎల్ ఫౌండేషన్

  అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎం ఎన్ జె కాన్సర్ ఆసుపత్రి  అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని,  అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము  నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నిమ్స్ ఆసుపత్రిలో  క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.   ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని  ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో   బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని  బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు,   , మూసాపేటలోని సాయి  సేవా సంఘ్ లో  విద్యను అభ్యసించే వారికి  బ్లాంకెట్స్ ను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు.  నగరంలోని సాయి సేవా సంఘ్   విద్యా మందిర్ లో   ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ  పై చదువుల తరువాత  తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.   ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థ తరపున అదనపు  కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లలతో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.  తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా  స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.  చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక మలుపు తిప్పుతాయని, అందువల్లే ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.   ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ  ఫౌండేషన్ల తరఫున సాయం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు   చలికాలంలో  అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.  ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి  బ్లాంకెట్స్,   పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొని సంవత్సరాల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ ప్రతినిధులు, ఎం ఎన్  జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.  

ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం గర్వంగా ఉంది : హీరో నాగార్జున

  నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడు ప్రత్యేకమేనవేనని నాగార్జున తెలిపారు ... ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం రూ.2కోట్ల రూపాయలను ప్రకటించారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున, హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా నాగార్జున సభా వేదిక మీదకు చేరుకోగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.  అనంతరం హీరో నాగార్జునకు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాలువా, పుష్పగుచ్చం అందిస్తూ  గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద... కళాశాల విద్యార్థుల  స్కాలర్షిప్ కోసం... కుటుంబం తరఫున రూ.2కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందనీ నాగార్జున పేర్కొన్నారు. మనుషులు శాశ్వతం కాదనీ వారు చేసే పనులే శాశ్వతమని,తాను చదువుకోలేక పోయినా...వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం  నాగేశ్వరరావు కళాశాల స్థాపించారనీ ,రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు...చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు రూ. 5వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో.... లక్ష రూపాయలు కళాశాలకు విరాళంగా ఇచ్చారనీ, ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ,విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున... ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తామన్నారు. కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధికి... రేపు వేడుకల్లో పాల్గొనే మంత్రి లోకేష్ సహకరించేలా ఎమ్మెల్యే రాము కృషి చేయాలని నాగార్జున కోరారు. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు.. చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని... నేను అక్కినేని నాగేశ్వరావు  అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు. నాగార్జున మాట్లాడుతున్నంతసేపు  అభిమానులు..విద్యార్థులు కేరింతలు కొట్టారు. హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ...మహోన్నత ఆలోచనతో ఏర్పడిన ఏఎన్ఆర్ కలశాల ఎందరికో మంచి భవిష్యత్తు అందించడమే కాక, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందన్నారు. ఈ కళాశాలలో చదివే నేను... హైకోర్టు జస్టిస్ స్థాయికి ఎదిగాననీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నేడు నాగార్జున రావడంతో గుడివాడలో ఎప్పుడూ లేనంత సందడి నెలకొందన్నారు. నేను కళాశాల చదివే రోజుల్లో నాగార్జునకు  ఫ్యాన్స్ క్రేజీ చెప్పలేనంత ఉందన్నారు.  ప్రపంచం గర్వించదగ్గ నటుడుగా ఎదిగిన అక్కినేని మన గుడివాడ వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. గుడివాడ ప్రజలందరూ చదువుకోవాలని ఎంతో గొప్ప ఆశయంతో కళాశాల స్థాపించారనీ కొనియాడారు. చదువు అంటే ఎంతో ఇష్టపడే అక్కినేని... అనేక యూనివర్సిటీలకు చెప్పలేనన్నీ గుప్త దానాలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలను చూస్తుంటే, చదువు అంటే అక్కినేనికు ఎంత మమకారమో అర్థం అవుతుందన్నారు.  కళాశాలకు డబ్బు మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా అందించారన్నారు. అంతటి మహనీయుడు కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందదాయకం అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన నాగార్జునకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు చెప్పారు. నాడు ఏఎన్ఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు ఏ విధంగా సద్వినియోగం అయ్యాయో... నేడు విద్యార్థుల భవిష్యత్తు కోసం నాగార్జున ఇచ్చిన రెండు కోట్లను అదేవిధంగా సద్వినియోగం చేస్తామని సభా వేదికగా పేర్కొన్నారు.  నాగార్జున వస్తున్నారని తెలిసి నేను 18 కిలోలు తగ్గిన... ఆయన ముందు ఏమాత్రం అనడం లేదని ఎమ్మెల్యే రాము అన్న మాటలకు సభా అంత నవ్వుకున్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని  అక్కినేని నాగార్జున, ఎమ్మెల్యే రాము ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, అక్కినేని కుమార్తె సుశీల, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ పెద్దలు, వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

  జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరల గడువు  మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్‌పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశించింది.  పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి  

మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం

  ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ‌ ఉండవల్లిలోని తన నివాసంలో  మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు. ఈ నగదు బహుమతితో పాటు విశాఖలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.  ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.

ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటే వాహనాలకు ఆయిల్

  దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూపోతోంది. జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా రికార్డు అయింది. దీంతో ‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు, వంట చెరుకుతో తయారు చేసే తందూరీ రోటీలపై బ్యాన్ విధించింది. డీపీసీసీ నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, తిను బండారాలు అమ్మే షాపులు తందూరీ రోటీలను తయారీ కోసం గ్యాస్ లేదా కరెంట్‌ను మాత్రమే వాడుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్‌లలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు. జీఆర్ఏపీ 3, 4 సందర్బంగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ .. ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టాటస్, ఎమిషన్ క్యాటగిరీ చెక్ చేస్తాం. పీయూసీసీ సర్టిఫికేట్ లేని వారు.. బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్న వారు పెట్రోల్ బంకుల దగ్గర, సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దు. గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది. గత నవంబర్ నెలలో ఏక్యూఐ 20 పాయింట్లు తగ్గింది. గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు. 9 నుంచి 10 నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రజలకు క్షమాపణ చెప్పారు.

బోండీ బీచ్‌ మృతులు అసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్ల సంతాపం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు  చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు బుధవారం (డిసెంబర్ 17) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటలో పాల్గొన్నారు.  అలాగే స్టేడియంలోని ఇరు దేశాల జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు. సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో.. మూడో టెస్టు జరిగే ఆడిలైడ్ మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. బోండీ బీచ్ దుర్ఘటనపై ఇరు జట్ల ప్లేయర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి సమీపంలో నివసించే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. జరిగిన దుర్ఘటన తనను భయాందోళనకు గురి చేసిందన్నాడు. బోండీ బీచ్‌ తన ఇంటికి చాలా దగ్గర్లోనే ఉంటుందని, తరచూ తన పిల్లలను అక్కడికి తీసుకువెళుతుంటానని కమిన్స్ తెలిపాడు. క్రికెట్ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ బోండీ బీచ్ బాధితులకు, వారి కుటుంబాలకు, స్నేహితులకు, యూదులకు మద్దతుగా ఉన్నారని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ అన్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఇది ఆస్ట్రేలియా, సిడ్నీ నగరంతో పాటు యూవత్తు ప్రపంచానికి కూడా చాలా విచారకరం అని అన్నాడు.  

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు మొత్తం 5 రోజులు పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.  18న రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్‌ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించి, ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ యాదవ్ ను మేయర్ చేయాలన్న  అధికార పార్టీ పెద్దల కోరిక నెరవేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ ను గద్దె దించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే.. గురువారం (డిసెంబర్ 18) మేయర్ పై అవిశ్వాస   తీర్మానం పెట్టేందుకు  వ్యూహాలు రచించి, క్యాంపు రాజకీయాలు చేపట్టిన అధికార పార్టీ నేతలకు మేయర్ స్రవంతి తన రాజీనామా ద్వారా షాక్ ఇచ్చారు.  అవిశ్వాస తీర్మానానికి ముందే తన పదవికి రాజీనామా చేసిన మేయర్  తన రాజీనామా లేఖనం జిల్లా కలెక్టర్ కు వాట్సప్ ద్వారా పంపారు.  దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అటకెక్కింది.   ఇలా ఉంటే.. గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం    మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం   వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.   దీంతో 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టిడిపికి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న 11 మందీ కూడా  తెలుగుదేశంకే మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు అంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.   2021 నవంబర్ 24న మేయర్ గా  ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి  రాజీనామా చేసి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు మేయర్ స్రవంతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   దీంతో ఆమె రెండు పార్టీలకూ దూరం పాటిస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో తమకు పూర్తిగా మద్దతు ఉందని సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం గట్టి షాక్ ఇచ్చింది.  దీనిపై మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉండే కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా లాగేయడం మొదలుపెట్టారు. దీంతో వైసిపి షాక్ కు గురైంది. సిటీ నియోజకవర్గంలో ఉండే ముగ్గురు కార్పొరేటర్లను లాగేసేందుకు అధికార పార్టీ స్కెచ్ వేసిన సమయంలోనే  తాను మేయర్  పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు స్రవంతి.  

జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు : సీఎం చంద్రబాబు

  జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా... ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని... కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతీ నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నాని అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో బుధవారం వివిధ అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.  కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని, నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా... అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు.  ఫిర్యాదులన్నింటికీ పరిష్కారం చూపాలి ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదామని ముఖ్యమంత్రి తెలిపారు.  పరిపాలనలో పవన్, లోకేష్ భేష్ ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేలా చర్చించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల ద్వారా ఫలితాలు ఎలా వస్తున్నాయన్నదే ముఖ్యమని, మనం చక్కగా ప్రజలకు సేవలందిస్తున్నాం... కానీ మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు.  5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందని సీఎం అన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే... అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ. 3.90 కోట్లు మంజూరు చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చినా... పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని, మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు తీసుకువచ్చారని ప్రశంసించారు. గత పాలకుల నిర్వాకం వల్ల నిర్వీర్యం అయిపోయిన కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ పునరుద్ధరించామని చెప్పారు.  సూపర్ సిక్స్‌... సూపర్ సక్సెస్ ‘సూపర్ సిక్స్‌ను సూపర్ సక్సెస్ చేశాం. పేదలకు ఆర్ధికంగా అండగా ఉండేందుకే  సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చాం. సామాజిక భద్రత పెన్షన్లను మొదటి తేదీనే అందిస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ.14 వేలు ఇచ్చాం. దీపం-2.0,  స్త్రీశక్తి, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్ చేస్తున్నాం. పెద్దఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నాం... అందరికీ ఇళ్లు అందేలా చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించటమే లక్ష్యం. ప్రివెంటివ్, క్యురేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యారోగ్యాన్ని ప్రజలకు అందించాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు.   పీపీపీలో నిర్మిస్తే ప్రైవేట్ పరం కాదు జిల్లాల కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరగవుతాయని అన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని... అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెప్పారు.  మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు.  70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్టు వివరించారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, అవే డబ్బులతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఉండేదని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని... అలాగని అది ప్రైవేటు వ్యక్తులది అయిపోతుందా అని సీఎం ప్రశ్నించారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం అన్నారు. 

కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

  తెలంగాణలో  కొత్త సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన 20న కాకుండా 22 తేదీకి  అపాయింట్‌మెంట్‌ డేను మారుస్తూ పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20న అమావాస్య కావున 22కు వాయిదా వేయాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.  దీంతో నూతన సర్పంచుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీ రాజ్ శాఖ, బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రెండు రోజులు వెనక్కి జరిపి డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అదే రోజున నూతన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన పాలకవర్గాలతో ప్రమాణస్వీకారం చేయించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.