భార్యకు బదులు భర్త ప్రమాణం.. కర్నూల్ జిల్లాలో విడ్డూరం
posted on Apr 4, 2021 @ 12:04PM
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని పాలకులు గొప్పగా చెప్పుకుంటారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళలు పోటీ చేసి గెలుస్తున్నారు .అయితే అధికారం మాత్రం వాళ్లకు ఉండదు. భార్యలకు బదులు పెత్తనం చేసేదంతా వాళ్ల భర్తలే. ఇది చాలా కాలంగా సాగుతోంది. తాజాగా కర్నూల్ జిల్లాలో మాత్రం మరి విడ్డూరం జరిగింది. అధికార పార్టీకి చెందిన నేత బరి తెగించాడు. భార్యకు బదులు అతనే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ముగిసినా అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కర్నూలు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ విచిత్రం చోటుచేసుకొంది. కౌతాళం మండలం చూడి గ్రామ సర్పంచ్గా వైసీపీ మద్దతుదారు లక్ష్మి ఎన్నికయ్యారు. సర్పంచ్గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చేసరికి లక్ష్మి భర్త ఉప్పళప్ప ముందుకొచ్చారు. ఎన్నికయిన వార్డు సభ్యులతోపాటు ఉప్పళప్పతో చూడిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ హుశేనమ్మ ప్రమాణ స్వీకారం చేయించేశారు.
భార్య స్థానంలో భర్త ప్రమాణం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విషయాన్ని కౌతాళం ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో సూర్యనారాయణ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేశారు. ఆమె స్థానంలో ఆయనతో ఎందుకు ప్రమాణం చేయించారో వివరణ కోరారు.సర్పంచి లక్ష్మి అనారోగ్యంతో కార్యక్రమానికి గైర్హాజరవడంతో ఆమె భర్త ఉప్లప్పతో ప్రమాణ స్వీకారం చేయించినట్టు పంచాయతీ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీఓ.. ఆమెతో ప్రమాణం చేయించాలని సూచించారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. పొరపాటున జరిగిందని, గెలుపొందిన లక్ష్మితో తిరిగి ప్రమాణస్వీకారాన్ని చేయిస్తామని తెలిపారు. సర్పంచి లక్ష్మి ఆరోగ్యం కుదుటపడ్డాక అధికారుల ఆదేశాల మేరకు ప్రమాణస్వీకారం చేయిస్తామని అన్నారు.