అందాల పోటీలకు లేని ముప్పు ఐపీఎల్కి ఎందుకు?
posted on May 14, 2025 @ 1:06PM
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్ మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేవని స్పష్టం చేస్తోంది. ఉద్రక్తతల తీవ్రత అంతగా లేని దేశంగా భారత్ ఫోకస్ అవుతోంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో.. దేశంలో భద్రతపై అందరికీ స్పష్టత వచ్చింది. అయితే.. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు.. ఐపీఎల్కు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై.. రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయ్. ఓ వైపు.. ఈ మెగా ఈవెంట్ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అధ్బుతమైన అవకాశంగా చెబుతున్నారు. మరో వైపు జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ కాదనే విమర్శలూ వినవస్తున్నాయి. అయితే సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానమనే సందేశాన్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగూ చూసే ఇలాంటి మెగా ఈవెంట్లు సక్సెస్ కావాలంటే భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకుండా చూడాలి. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే.. హైదరాబాద్, తెలంగాణ సేఫ్ డెస్టినేషన్ అనే గుర్తింపు వస్తుంది. దాంతో భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు హైదరాబాదే ఫస్ట్ ఆప్షన్గా మారుతుంది. గ్లోబల్ కాన్ఫరెన్స్లకు హైదరాబాద్ వేదిక అవుతుంది. పరోక్షంగా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశముంది. అందు కోసమేప్రభుత్వం ఈ ఈవెంట్ని సమర్థవంతంగా నిర్వహించి సిటీ ఇమేజ్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
అయితే ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు ఐపీఎల్ మ్యాచ్లకు ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఐపీఎల్ , మిస్ వరల్డ్ అందాల పోటీలు రెండూ మెగా ఈవెంట్లే. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్. అందువల్ల భద్రతాపరంగా రిస్క్ తక్కువనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒకచోటుకి చేరతారు. పైగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయ్.
ఇప్పటికే పాకిస్తాన్లోని రావల్పిండి స్టేడియంపై భారత ఆర్మీ డ్రోన్తో దాడి చేసింది. దాంతో బోర్డర్కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉంది. పాక్ ఏ క్షణమైనా డ్రోన్లతో దాడి చేయొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక్క డ్రోన్ పేలినా భయంతో జనం పరుగులు పెడితే తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ మొదలకానుంది.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయ్, చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా.. ఈ ఈవెంట్లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో.. ఫ్లాగ్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు మరల్చింది.
పైగా.. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక, మౌలిక సదుపాయాలను.. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా.. ఈ ఈవెంట్ తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్లను సందర్శిస్తున్నారు. ఇది.. స్టేట్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ని కొనసాగించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది.