పవన్ బాటలో రజనీ... ఇద్దరి అజెండా ఒక్కటే...
posted on Feb 6, 2020 @ 10:37AM
ఒకరు తమిళ సూపర్ స్టార్... మరొకరు టాలీవుడ్ పవర్ స్టార్... ఇద్దరూ ఇద్దరే... వీళ్లిద్దరూ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే.... ఎందుకంటే వీళ్ల మాటలు అంత పవర్ ఫుల్ గా జనాల్లోకి దూసుకెళ్తాయి. అయితే, దేశంలో అలజడి రేపుతున్న సీఏఏకి మద్దతు పలకడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమాన మేఘాలు తొలగకపోయినా.... దానికి వకాల్తా పుచ్చుకుని, మోడీ సర్కారుకు బాకా ఊదుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే పవన్ కమలంతో కలిసి నడుస్తుండగా... రజనీ కూడా కాషాయ బాటలోనే వెళ్లాలనుకుంటున్నారని అంటున్నారు. అందుకే, రజనీ కూడా బీజేపీ భాషలోనే మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే బీజేపీతో కలిసి ముందుకు సాగుతోన్న జనసేనాని పవన్ కల్యాణ్... సీఏఏకి మద్దతు ప్రకటించారు. బీజేపీతో స్నేహం కుదిరిన నాటినుంచి మోడీ ప్రభుత్వంపై పవన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగానే సీఏఏకు మద్దతివ్వడమే కాకుండా అపోహలు అవసరమే లేదంటూ కామెంట్ చేశారు. ఇక, ఇప్పుడు రజనీకాంత్ కూడా పవన్ బాటలోనే నడిచారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికారు. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని తలైవా హామీ ఇచ్చారు. దేశ విభజన తర్వాత భారత్లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్న ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారని ఎలా అనుకుంటున్నారు? సీఏఏతో భారత పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని రజనీ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు ఆ అవకాశం ఇవ్వరాదని రజనీ సూచించారు. అయితే, దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టంపై రజనీ నేరుగా స్పందించడం ఇదే తొలిసారి. రజనీ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీకి బాకా ఊదడటమే రజనీ పనయ్యిందన్నాయి. సీఏఏతో ముస్లింలు అభద్రతాభావానికి గురవుతున్నారని... షహీన్బాగ్ ఆందోళనలు... రజనీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నాయి.
అయితే.... రజనీకాంత్, పవన్లు అదేపనిగా మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం, హిందూత్వ భావజాలంలో మాట్లాడటం వెనుక వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా వీళ్లిద్దరూ తమ రాజకీయ ఎదుగుదలకు, పోరాటానికి బీజేపీ బలం అవసరమని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆరెస్సెస్, వీహెచ్పీ, భజరంగ్దళ్ వంటి బీజేపీ దళాలు తోడ్పడుతాయని, రజనీ, పవన్లు ఆశిస్తున్నారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, బీజేపీ మన్ననలు పొందేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, వీరు మాత్రం, ప్రశంసలు కురిపించడం వెనుక మతలబు ఇదేనంటున్నారు. మొత్తానికి మొన్న పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, బీజేపీ మన్ననలు పొందే ప్రయత్నం చేసిన రజనీ.... ఇప్పుడు ఇద్దరూ పౌరసత్వ సవరణ చట్టమైన సీఏఏకు మద్దతిచ్చి, తమిళనాట సరికొత్త చర్చకు తెరలేపారు.