మాకు నమ్మకం లేదు సార్.. విశాఖ ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రభుత్వానికి చుక్కెదురు
posted on Feb 8, 2020 @ 3:51PM
విశాఖ జిల్లాలో భూ సమీకరణ రసాభాసగా మారింది. ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. పద్మనాభం మండలం తునివలసలో అధికారుల గ్రామ సభలో రసాభాస జరిగింది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తూ గ్రామసభను రైతులు బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. చివరకు భూములిచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఇలా పలు గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది.
ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దానికి తగ్గట్టుగానే 6000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చెయ్యాలని భావించింది. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖలో ఉన్న గ్రామీణ ప్రాంతాలైన పద్మనాభం, అనకాపల్లి, సబ్బవరం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనకాపల్లి మండలం మామిడిపాలెంలో ముందుగా భూ సేకరణకు వెళ్లిన ఆర్డీవో సీతారాం అలాగే ఎమ్మార్వో ఎస్ ప్రసాద్, గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన సభలో కూడా భూసేకరణ పై రైతులు ఆందోళన చేశారు. గతంలో అమరావతిలో రైతుల దగ్గర భూ సేకరణ చేసి వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పిన మాట అతీగతీ లేకుండా పోయిందని.. ఇప్పుడు విశాఖ జిల్లాలో అలాగే పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం పేరుతో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అతీగతీలేకుండాపోయింది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది రేపు తమకు అదే పరిస్థితి అవుతుందని ఎక్కడికక్కడికి గ్రామ సభల్లో వ్యతిరేకత వస్తుందని సమాచారం.