వైసీపీ వీఐపీలతో కిక్కిరిసిపోయిన విజయవాడ జిల్లా జైలు
posted on May 21, 2025 @ 9:53AM
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి గత ఎన్నికలలో అంటే 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత... కొంత కాలం రాష్ట్ర ప్రగతి, సంక్షేమం వినా మరే రాజకీయ కార్యక్రమం చేపట్టిన సర్కార్ ఇప్పుడు.. జగన్ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది.
అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఎక్కడా కక్ష సాధింపు ధోరణి కనిపించడం లేదు. చేసిన తప్పులకు, నేరాలకు చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణలు జరిపి కోర్టుల ద్వారానే శిక్ష పడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉంది. రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ కూడా తెలుగుదేశం, జనసేన శ్రేణులు జగన్ హయాంలో చెలరేగిపోయి, ఇష్టారీతిగా, తాము చట్టాలకు అతీతులమన్నట్లుగా వ్యవహరించిన వారిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ వచ్చాయి. వస్తున్నాయి. ఒక దశలో ప్రభుత్వం గత పాలనలో అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమార్జనకు పాల్పడిన వారి పట్ల చంద్రబాబు సర్కార్ మెతకగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్త మయ్యాయి. అయితే సర్కార్ మాత్రం ఎక్కడా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చట్ట ప్రకారమే శిక్షలు, చర్యలు అంటూ వస్తున్నది.
ఇప్పుడు అంటే ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండగా.. వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అది కూడా వారి నేరాలకు సంబంధించి పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలూ సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతోంది. అందులో బాగంగానే జగన్ హయాంలో వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు, జగన్ అండతో నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చెలరేగిపోయిన అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కాంల గుట్టు కూడా బయటపడుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో పలు అరెస్టులు జరుగుతున్నాయి. అలా అరెస్టైన వారంతా ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అరెస్టైన వారిలో పలువురు వైసీపీ వీఐపీలు కూడా ఉండటంతో... నెటిజనులు వైసీపీ వీఐపీలకు విజయవాడ జైలు అడ్డాగా మారిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. అరెస్టైన వారు సరే వారిని ములాఖత్ ద్వారా కలవడానికి కూడా వైసీపీ నేతలు క్యూకడుతుండటం వైసీపీలో వెల్లువెత్తతున్న ఆందోళనకు అద్దం పడుతోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ మూడు నెలలుగా విజ యవాడ జిల్లా జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నిందితులు రాజ్ కేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్, మాజీ సీఎం జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, భారతీ సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించే గోవిందప్ప బాలాజీ కూడా విజయవాడ సబ్ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య కూడా ఇదే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. ఇంత మంది వైసీసీలో కీలకంగా వ్యవహరించిన,వ్యవహరిస్తున్న వారు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తుండటం, వీరిని కలిసేందుకు ములాఖత్ ల కోసం మరింత మంది క్యూ కడుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ జిల్లా జైలు పేరు మార్మోగిపోతున్నది.