ఉపరాష్ట్రపతి చొరవతో.. అంతుపట్టని వ్యాధి పై రంగంలోకి కేంద్ర ప్రత్యేక బృందం
posted on Dec 7, 2020 @ 6:03PM
ఏపీలోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తున్న సంగతి తెల్సిందే. నాలుగు రోజులుగా పలువురు కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని.. రెండ్రోజుల్లో కోలుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగడంతోపాటు ఇందులో చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. లక్షణాలను బట్టి ఇది సంక్రమణ వ్యాధి లాగా అనిపించడం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. దీనికి అసలు కారణాలేంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, విశాఖపట్టణం పంపి చికిత్సనందిస్తున్నారు.
తాజాగా ఈ విపత్తు పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి తెలియగానే అయన కలెక్టర్తోపాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడి పర్సిస్థితుల గురించి తెలుసుకున్నారు. దీనిపై స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి నుండి వచ్చిన ఎయిమ్స్ వైద్య బృందం కూడా పరిశీలించిందని.. అయితే ఇప్పటివరకు జరిపిన వైద్యపరీక్షల్లో దీనికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని ఉపరాష్ట్రపతికి అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో మాట్లాడారు. ఈ అంతుచిక్కని వ్యాధి బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించడంతోపాటు.. అసలు దీనికి గల కారణాన్ని గుర్తించి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి సూచనతో కేంద్రమంత్రి ఏయిమ్స్ అత్యవసర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ఏలూరు లోని వైద్యుల నుండి ఇక్కడి పరిస్థితిని ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర మంత్రి తెలియజేశారు.