పరకామణి చోరీపై అన్ని కోణాల్లో దర్యాప్తు : సీఐడీ డీజీ

 

తిరుమల పరకామణి అవకతవకలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. డిసెంబర్ 2 వ లోపు దర్యాప్తు పూర్తి చేసి సంబంధించిన నివేదికను  హైకోర్టులో సమర్పిస్తామని డీజీ  రవిశంకర్ స్పష్టం చేశారు. నిందితుడు రవికుమార్ హైదరాబాద్‌లో ఉన్నాడని తెల్సింది, ఆయనను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. భక్తులు, ఇతరుల వద్ద చోరీ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే 9440700921 నంబర్‌కు adgcid@ap.gov.in మెయిల్ ద్వారా మాకు తెలియజేయండని  వారి వివరాలను గోప్యంగా ఉంచుతమని సీఐడీ చీఫ్ తెలిపారు.

5 టీములుగా ఈ పరకామణి కేసును దర్యాప్తు చేపడుతుమన్నారు. పరకామణి ఆఫీసర్స్, పరకామణిలో అధికారుల బాధ్యత,  జీయర్ వ్యవస్థ బాధ్యత ఎంటి అనే అంశంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. 1980 నుంచి రవికుమార్ జీయర్ మఠంలో గుమస్తాగా ఉన్నారు, అప్పటి నుంచి ఆయన వ్యవహారాలపై ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. ఆదాయం, ఆదాయానికి మించిన ఆస్తులు, బ్యాంకు ట్రాన్సక్షన్, సీసీ కెమెరాలు, ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతుందని రవిశంకర్ తెలిపారు.
 

మరో ఏడు దేశాలపై ట్రంప్ పర్యాటక నిషేధం

వివిధ దేశాలపై విధిస్తున్న పర్యాటక నిషేధంలో భాగంగా అమెరికా ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలా నిషేధించిన దేశాల  జాబితాలో కొత్తగా మరో ఏడు దేశాలను చేర్చింది. జనవరి 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. జాతీయ భద్రత, ప్రజా భద్రత, వీసా నిబంధనల ఉల్లంఘనలు తదితర కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ పేర్కొంది. బర్కీనో ఫాసో, మాలీ, నైజర్, సౌత్ సుడాన్, సిరియా, లావోస్, సియేరా లియోన్‌పై విధించిన ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన డాక్యుమెంట్స్ ఉన్న వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. వీటితో పాటు మరో 11 దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం విధించింది. అయితే, ఈ ఆంక్షల నుంచి తుర్క్‌మెనిస్థాన్‌కు మాత్రమే స్వల్ప ఊరట లభించింది. తుర్క్‌మెనిస్థాన్ పౌరులకు వలసేతర వీసాల జారీపై గతంలో విధించిన నిషేధాన్ని ట్రంప్ ప్రభుత్వం తాజాగా తొలగించింది. కాగా పర్యాటక నిషేధాల విస్తరణను అమెరికా ప్రభుత్వం సమర్ధించుకుంది. ఆయా దేశాల్లో పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత కుమ్ములాటలు, వీసా నిబంధనల ఉల్లంఘనలే నిషేధాజ్ఞలకు కారణమని పేర్కొంది. విదేశీయులపై పూర్తి తనిఖీలు సాధ్యం కాని పక్షంలో వీసాలను జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఇలాంటి వారితో ముప్పు పొంచి ఉంటుందని ప్రకటించింది.  నిషేధిత జాబితాలోని దేశాల్లో అవినీతి, పౌర డాక్యుమెంట్స్‌లో లోపాలు, జనన ధ్రువీకరణలో లోటుపాట్లు వంటి కారణాలతో వీసా జారీకి పూర్తిస్థాయి తనిఖీలు సాధ్యం కావడం లేదని పేర్కొంది. అయితే, అమెరికాలో శాశ్వత నివాసార్హత ఉన్న వారు, ఇతరత్రా వీసాలు ఉన్న వ్యక్తులు, దౌత్యవేత్తలు, క్రీడాకారులు, అమెరికా ప్రయోజనాలకు కీలకమైన వ్యక్తులపై ఈ నిషేధం వర్తించదని అమెరికా పేర్కొంది.

కారు బీభత్సం... ఇద్దరు మృతి

హైదరాబాద్ శివారులో  బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారు జామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ శివారు  మైలార్ దేవుని పల్లి ప్రాంతంలో ఈ ఉదయం ఐదు గంటల సమయంలో  అతి వేగంగా దూసుకొచ్చిన  కారు అదుపుతప్పి రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించే దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆ దుకాణంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. మరొ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో తండ్రి ప్రభుమహరాజ్, అతని ఇద్దరు కుమారులు దీపక్, సత్తునాథ్ లు నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో దీపక్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తండ్రి ప్రభు మహరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.  ప్రభు మహరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి మైలార్ దేవుపల్లిలో దుప్పట్లు, రగ్గుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.   కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెడుతుండగా అదుపుతప్పిందనీ, సంఘటన జరిగిన తరువాత కారులో ఉన్నవారిలో ముగ్గురు పారిపోగా, మిగిలిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.  

ఐపీఎల్ కు కరీంనగర్ ప్లేయర్ అమన్ రావు

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రూ. 30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది.  హైదరాబాద్‌ అండర్‌ 23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అమన్‌రావుది క్రీడా, రాజకీయ  నేపథ్యం ఉన్న కుటుంబం. అమన్ రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్‌గా ఆడారు. ఆయన తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.అమన్ రావు  స్వగ్రామం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి కాగా, కొన్నేళ్లుగా వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో మంచి ప్రతిభ కనబరిచాడు. అయినా దుబాయ్ లో జరిగే వేలంలో పాల్గొనేందుకు అమన్ రావు వద్ద పాస్ పోర్టు కూడా లేకపోవడంతో, విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని తనకు పాస్ పోర్టు జారీ చేయించారు. దీంతో అమన్ రావు ఐపీఎల్ వేలంలో పాల్గొనగలిగారు.  

చలిపులి పంజా.. తెలంగాణ గజగజ

తెలంగాణ ను చలిపులి గజగజలాడిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో  జనం చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం (డిసెంబర్ 16) అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి ప్రభావం జనజీవనంపై పడుతోంది. ఉదయం 9 గంటలు దాటినా ఇళ్ల లోంచి బయటకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది.  ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు  శేరిలింగంపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.    ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే  చల్ల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగ మంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం (డిసెంబర్ 18)  నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదౌతాయని పేర్కొంది. చలి నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి...వైసీపీ వస్తే ఉద్యోగాలు పోతాయి : చంద్రబాబు

  మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై వేసిన కేసులను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. వేరేవాళ్లు వస్తే.. ఉద్యోగాలు పోతాయిని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని  చంద్రబాబు స్పష్టంచేశారు.  కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లు నిజాయితీతో మరియు నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు   పోలీసు వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మరియు త్యాగాలను గుర్తు చేసుకున్నారు  శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లకు స్టైఫండ్‌ను ₹4,500 నుంచి ₹12,500 వరకు  పెంచినట్లు  సీఎం తెలిపారు. 2022 లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టినా, గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అనిశ్చితి తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు సాధించడం  ఆనందంగా ఉందని   కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.  నా హయాంలో 23 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చినా, మేం కానిస్టేబుల్‌ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం. శాంతి భద్రతల విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను’’ అని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాలు, ముఠా రాజకీయాలు ఉండేవని, చంపుకోవడమే పరిపాటిగా ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘తీవ్రవాదాన్ని నేను ఎప్పుడూ ఉపేక్షించలేదు. తీవ్రవాదాన్ని అణిచివేసినందుకు నాపై క్లైమోర్‌ మైన్స్‌తో దాడులు కూడా జరిగాయి’’ అని తెలిపారు.‘ రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కానిస్టేబుల్‌ బాబురావు తమ గ్రామానికి రోడ్డు లేదని సభలో తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. తిమ్మలబండ–వెలుగురాతిబండ మధ్య రహదారి నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు విషయం తెలియజేశానని తెలిపారు. ‘‘ఆ రోడ్డు నిర్మాణానికి పవన్‌ కల్యాణ్ రూ.3.90 కోట్లు మంజూరు చేశారు’’ అని సీఎం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ నెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ ప్రారంభం కానుంది.

ఐ బొమ్మ రవికి... 12 రోజుల కస్టడీ

  ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఐ బొమ్మ రవిని12 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే రవిని రెండు దఫాలుగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒకవైపు రవి పై నమోదైన నాలుగు కేసుల విషయంలో కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. రవికి బెయిల్ ఇవ్వకూడదని అతనిపై నమోదైన నాలుగు కేసుల్లో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకా శాలు ఉన్నాయని కస్టడీ కి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు నాంపల్లికోర్టు విచారణ జరిపి ఐ బొమ్మ రవిని మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది..  ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 18వ తేదీ నుండి ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. హాయ్ బొమ్మ వెబ్సైట్ నిర్వహణ పైరసీ ఆరోపణలు ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టనున్నట్లు గా సమాచారం ... ఏది ఏమైనప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు మరో పన్నెండు రోజులు రవిని కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు...

గీతం యూనివర్సిటీ కరెంటు బకాయిలు రూ.118 కోట్లు...హైకోర్టు సీరియస్

  సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లు కట్టకపోతే మరుసటి నెల అధికారులు ఏకంగా ఇంటికి వచ్చి   రెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. అదే ఓ యూనివర్సిటీ ఏళ్ల తరబడి కరెంటు బిల్లు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల బకాయి పడ్డారు. అయినా కూడా అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు కూర్చున్నారు. కొన్ని కోట్ల రూపా యల బకాయి పడడంతో చివరకు అధికారులు తెరుకొని ఆ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేశారు...  అయ్య బాబోయ్ అన్ని కోట్లు మేము కట్టలేమంటూ ఆ యూని వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. అదే మన గీతం యూనివర్సిటీ....ఏండ్ల తరబడి కరెంటు బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్పిడిసిఎల్  నోటీసులు జారీ చేసింది... ఇప్పటివరకు అయినా కరెంట్ బిల్లు బకాయి మొత్తం చెల్లించా లంటూ నోటీసులో పేర్కొన్నారు... నోటీసులను చూసిన గీతం యూనివర్సిటీ యజమాన్యం ఒకేసారి అంత కరెంటు బకాయి చెల్లించ లేమంటూ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసును విచారించిన జస్టిస్ నాగేష్, భీమపాక 2008 నుండి గీత యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంత మొత్తం బిల్లులు ఇప్పటివరకు చెల్లించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించక పోయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.. గీత యూనివర్సిటీ పై 118 కోట్ల కరెంటు బకాయిలు ఉండడాన్ని చూసి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు వెయ్యి రూపాయలు కూడా చెల్లించకపోతే వెంటనే విద్యుత్ కనెక్షన్ తొలగి స్తున్నామని వారిని హెచ్చరిస్తారు..  మరి ఇన్ని కోట్ల కరెంటు బకాయిలు ఉన్నా కూడా మీరెందుకు గీత యూనివర్సిటీ కి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని హైకోర్టు ఆగ్రహించింది... చట్టం అందరికీ సమాన మేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో హాజరై వివరణ ఇవ్వాలని ఎస్ పి డి సి ఎల్ సూపరింటిండింగ్ ఇంజనీర్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై ఏమన్నారంటే?

  ఇటీవల బిజినెస్ టుడే అవార్డునందుకుని వార్తల్లో నిలిచిన నారా బ్రాహ్మణికి సంబంధించి కొత్త అప్ డేట్ డెలివరీ అయ్యింది. ఆమె తాను రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారాయన. కారణం.. తనకది అంత ప్రాధాన్యతాంశం కాదని కూడా చెప్పుకొచ్చారు బ్రాహ్మణి. మరి చంద్రబాబు అడిగినా మీరు రాజకీయాల్లోకి రారా అంటే ఏమంత ఇంట్రస్ట్ లేదని అన్నారు బ్రాహ్మణి. ఇలాంటి అనాసక్తి కలిగి ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే వారిలో జయలలిత, సోనియాగాంధీ, ఆ మాటకొస్తే భారతీరెడ్డి వంటి వారెవరికీ పొలిటిక్స్ అంటే ఏమంత ఇంట్రస్ట్ కానే కాదు. జయలలితకు ఆ మాటకొస్తే సినిమాలే ఇంట్రస్టింగ్ టాపిక్ కాదు. కానీ తన తల్లి కోరిక మేరకు ఆమె బలవంతానా సినిమాల్లోకి వచ్చి ఆ కాలపు అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగారు. అటు పిమ్మట ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆమె, ప్రచార కార్యదర్శిగా నియమితులవడం. ఆపై ఆయన మరణించాక యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగు పెట్టడంతో సీఎం స్థాయికి చేరి.. డీఎంకేతో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు. ఇక సోనియాగాంధీకి కూడా రాజకీయ రంగం ప్రాధాన్యతాంశం ఏమీ కాదు. ఆమె రాజీవ్ గాంధీ అనే రాజకీయ కుటుంబంలోని వ్యక్తి ప్రేమలో ఉన్నాన్న విషయం ఆలస్యంగా గ్రహించారు. అప్పటికీ తన భర్తతో కలసి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఇందిర మరణం తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాజీవ్ ప్రధాని కావడం.. ఆపై ఆయన మరణం తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డం. కాంగ్రెస్ పార్టీ పతనావస్త మొదలవుతుందనగా.. సోనియా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎంట్రీ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఇటు యూపీఏ చైర్ పర్సన్ గా చక్రం తిప్పడం మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఎదిగారామె. వైసీపీ అధినేత జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి కూడా ఏమంత రాజకీయాసక్తులు లేవు. ఇక్కడుంటే జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఏ విదేశాలకో వెళ్లి సెటిలవుతామని తాను తన భర్తను కోరినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి సతీమణిగా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నపుడు అత్త భువనేశ్వరితో కలసి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రాహ్మణి. ఆ తర్వాత ఆమె రాజకీయ అరంగేట్రంపై కూడా పలు కామెంట్లు వినవచ్చాయి. ఈలోగా చంద్రబాబు రిలీజ్ కావడం. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడం. తన భర్త లోకేష్ కూడా మంత్రిగా బిజీ కావడంతో ప్రస్తుతం బ్రాహ్మణి ఫుల్ హ్యాపీ.  ఈ లీజర్ లో ఆమె హెరిటేజ్ వ్యవహారాలు పట్టించుకుంటున్నారు. పాడి రైతుల కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ తృప్తి తనకు చాలంటున్నారామె. అయితే రాజకీయ అవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి ఒక వేళ ఆమె ఇంట్రస్ట్ లేదన్నా.. సరే ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటారు పలువురు.

సిడ్నీ ఉగ్ర దాడి నిందితుడు హైదరాబాద్ వాడే : డీజీపీ

  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది. సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సాజిద్‌కి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆసీస్‌కు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.  ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. 2017లో తండ్రి చనిపోతే హైదరాబాద్‌కు సాజిద్ వచ్చినట్లు పేర్కొన్నారు. 2022లో టోలీచౌక్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. సాజిద్‌ కుమారుడు పాకిస్తాన్‌లో జన్మించినట్లు గుర్తించారు. ఇటీవల సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవగా, అతని కుమారుడు నవీద్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత దాడి అని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు.

యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి

  అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద భారతీయుల సమూహానికి వచ్చే ఏడాదికి గానూ తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. గత 50 ఏళ్లుగా ఎఫ్ఐఏ అమెరికాలోని భారతీయులకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు అమెరికన్ కాంగ్రెస్‌లో గుర్తింపుతోపాటు.. పలు అవార్డులు కూడా ఉన్నాయి.  2026 ఏడాదికి సంబంధించి ఎఫ్ఐఏ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎఫ్ఐఏ స్వతంత్రంగా నియమించిన అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్‌లతో కూడిన ఎన్నికల కమిషన్ 2026 నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. కమిషన్ సిఫార్సులకు ఎఫ్ఐఏ బోర్డు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 2026 కార్యనిర్వాహక బృందం.. 2026 జనవరి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ ఏడాది ఎఫ్ఐఏ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఎన్నికల కమిషన్, ఎఫ్ఐఏ బోర్డు కలిసి కార్యనిర్వాహక బృందాన్ని క్రమబద్ధీకరించాలని.. ఈ కౌన్సిల్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ప్రస్తుత ఎఫ్ఐఏ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తర్వాత శ్రీకాంత్ అక్కపల్లి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి రే పటేల్.. జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి పలు రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీకాంత్ అక్కపల్లి.. ఎఫ్ఐఏ సంస్థ ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.  50 ఏళ్లకు పైగా అమెరికాలో సేవలు అందిస్తున్న ఈ ఎఫ్ఐఏ స్వచ్ఛంద సంస్థకు కాంగ్రెషనల్ రికార్డ్‌లో గుర్తింపుతోపాటు.. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు కూడా ఉండటం విశేషం. ఇక ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి.. ఒక బిజినెస్‌మెన్. ఆయన బిజినెస్‌లు అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ విస్తరించి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, మీడియా, ప్రవాస భారతీయ భాగస్వామ్యం వంటి రంగాల్లో ఆయన వ్యాపారాలను విస్తరించారు.  మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో ఉన్నాయి. ఇక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన శ్రీకాంత్ అక్కపల్లి.. తనకు మద్దతు తెలిపిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ధన్యవాదాలు తెలిపారు.  ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న 8 రాష్ట్రాల్లో భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తూ.. 1970లో లాభాపేక్ష లేకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్‌ఏను ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికాలో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.