నాగపూర్ నిర్ణయం మేరకే తెలుగు రాష్టాలకు బీజేపీ కొత్త సారథులు?
posted on Jun 30, 2025 @ 12:32PM
ఉభయ తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరో తేలిపోయింది? ఇంతవరకు అనేక కోణాల్లో, అనేక సమీకరణలు ఆధారంగా లెక్కలు కట్టిన కమల దళం చివరకు నాగపూర్ ఎంపిక చేసిన పాత కాపులకే పట్టం కట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్, తెలంగాణకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లను, బీజీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఇద్దరు నేతలకు ఆధిస్థానం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
నిజానికి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులు చాలా మంది పోటీ పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, పాత, కొత్త నాయకులు చాలా మందే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు.
ఇక తెలంగాణలో అయితే.. చెప్పనే అక్కర లేదు. ఎంపీలు ఈటల రాజేందర్ , ధర్మపురి అరవింద్, డీకే అరుణ,మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ , బండి సంజయ్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఒక దశలో ఈటల పేరు ఖరారు అయినట్లే ప్రచారం జరిగింది.. అయితే.. చివరి క్షణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బ్యాక్ గ్రౌండ్ ఉన్న పీ మాధవ్, రామచంద్రరావు పేర్లను ఆదిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఇదరి ఎంపిక నాగపూర్ నిర్ణయంగా భావిస్తునారు. నిజనికి ఇద్దరూ కూడా సంఘ్ సిద్దాంత పునాదులపై ఎదిగిన నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ, పీవీ చలపతి రావు కుమారుడు మాధవ్, బీజేపీలో సాధారణ కార్యకర్త మొదలు అనేక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే, రామచంద్ర రావు బాల్యం నుంచి సంఘ్ సంపర్కంలో పెరిగారు ఏబీవీపీ లో క్రియాశీలంగా పనిచేసిన ఆయన బీజేపీలో లీగల్ సెల్ బాధ్యలతో పాటుగా పార్టీ బాధ్యలు నిర్వహించారు.
సోమవారం (జూన్ 30) మధ్యాన్నం 2 గంటల తర్వాత ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచంద్ర రావు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది. అయితే.. ఒక్కరొక్కరే నామినేషన్ వేస్తారా? ఇతరులు కూడా నామినేషన్ వేసే అవకాశ్ ఉందా అనే విషయంలో క్లారిటీ లేదు. తెలంగాణలో మాత్రం ఈటల కూడా నామినేషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాజాసింగ్ తాను కూడా నామినేషన్ వేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది.