ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించిన డాక్టర్!
posted on Apr 13, 2020 @ 9:52AM
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన నిమ్మగడ్డ శేషగిరిరావు కాకినాడలో వైద్యవిద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడి రాయల్ కాలేజ్ ఆప్ సైకియాట్రిస్ట్స్ లో మానసిక వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే మానసిక వైద్యుడిగా స్థిరపడ్డారు. 25 ఏళ్లుగా అక్కడే సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ... లండన్ సమీపంలోని న్యూబెర్రీలో మానసిక వైద్యశాలకు సంచాలకుడిగా పనిచేస్తున్నారు. నిమ్మగడ్డ శేషగిరిరావు - హేమ దంపతులకు 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కవల కూతుళ్లున్నారు. అంతా బాగుందనుకున్న తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గత నెల మార్చి 13న హేమకు అంటేసుకుంది.
స్కూలుకెళ్లిన పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకెళ్లిన హేమకు బయటే వైరస్ సోకింది. అయితే స్వతహాగా వైద్యుడైన నిమ్మగడ్డ... రెండు రోజుల్లోనే తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారించేసుకున్నారు. అయితే కరోనా అంటేనే హడలిపోకుండా ఇంటిలోనే హేమకు చికిత్స మొదలెట్టేశారు.
ఈ క్రమంలో తనకూ వైరస్ సోకిందని నిమ్మగడ్డ గ్రహించారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పిల్లలిద్దరినీ ఓ గదిలో ఉంచేసిన నిమ్మగడ్డ... తను తన సతీమణి ఇద్దరూ కలిసి మరో గదిలో దాదాపు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏమాత్రం బెదిరిపోని నిమ్మగడ్డ.. కరోనాపై పోరు ప్రారంభించేశారు.
కరోనా కారణంగా ఇద్దరికీ రోజూ జ్వరం వచ్చేది. అంతేకాకుండా దగ్గు కూడా వచ్చేది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన నిమ్మగడ్డ... దగ్గు తగ్గేందుకు సిరప్ తాగేవారు. ఈ క్రమంలో కరోనా సోకిందన్న ఆందోళనను పక్కనపెట్టేసిన నిమ్మగడ్డ దంపతులు... పారాసిటమాల్ తో పాటు రోజూ ఉప్పు నీళ్లు వీలయినంత ఎక్కువ తాగడం - పసుపు - అల్లం - మిరియాల పొడి వేసిన నీటిని మరిగించుకుని తాగడం నిమ్మరసం తాగడం.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఏదో ఒకటి తినడం... ఇలా కరోనాపై పోరు సాగించారు. చివరకు వారిద్దరి శరీరాల్లో నుంచి కరోనా పారిపోయింది.
ఈ క్రమంలో చిన్నపిల్లలైన తన ఇద్దరు కూతుళ్లు తమకు వంట చేసిపెట్టడం - తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినా.. పేరెంట్స్ తో పాటు వారు కూడా నిబ్బరంగా ఉండటంతో.. ఆ కుటుంబం మొక్కవోని ధైర్యం ముందు కరోనా తల వంచేసింది.
ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించి... వైరస్ ను తమ శరీరాల్లో నుంచి తరిమేశారు. గుండె నిబ్బరం కోల్పోకుండా పోరు సాగిస్తే.. కరోనా మహమ్మారి మనల్నేమీ చేయలేదని చెబుతున్న ఈ కుటుంబం విజయగాథ ఇప్పుడు యావత్తు ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.