తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా కనిపించడం లేదు... కారణం ఏంటి..?

 
 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా చాలా రోజులుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన ఆయన కొంతకాలంగా గాంధీ భవన్ లో కనిపించడం మానేశారు. ఢిల్లీకే పరిమితమయ్యారో లేదంటే తెలంగాణలో ఏముందిలే అనుకున్నారో ఏమో తెలియదు కానీ కుంతియా చాలా కాలంగా రాష్ట్రంలో కనిపించటం లేదు. గడిచిన ఆరు నెలల క్రితం వరకు వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే ఉండేవారు. అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో సమావేశమయ్యేవారు. ఏఐసీసీ కార్యాచరణ ఇచ్చిందంటే ఆయన హోటల్లో ఉండి సమీక్షలు చేసేవారు. కానీ, కొంత కాలంగా కనిపించడం మానేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బిజీగా కనిపించిన ఆయన ఇప్పుడు అస్సలు కనిపించకపోవడంతో కుంతియా ఎక్కడ అని కామెంట్ లు గాంధీ భవన్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పెర్ఫామెన్స్ చేయలేకపోయింది, పధ్ధెనిమిది మునిసిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వాటిని కైవసం చేసుకోలేకపోయింది. ఫలితాలపై సమీక్ష నిర్వహించాల్సిన కుంతియా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో కీలకమైన నాయకులంతా తమ పరిధిలోని మునిసిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు.

కానీ, వీటిని విశ్లేషించేవారే లేకుండా పోయారు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఇలాంటి సమీక్షలు చేస్తుంటారు కానీ, కుంతియానే కనిపించకపోవటంతో సమీక్షలు కూడా అటకెక్కాయి. సమీక్షల సంగతి ఎలా ఉన్నా కుంతియా కనిపించకపోవటంతో అది కాస్త వేరే చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా నాయకత్వ మార్పు ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసీసీ లో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. కుంతియా కొంత కాలంగా రాకపోవడంతో ఆయనను కూడా మార్చుతారేమోననే టాక్ మొదలైంది. నాయకత్వ మార్పుపై ఎప్పటికప్పుడు అంతో ఇంతో స్పష్టత ఇచ్చే కుంతియానే ఇప్పుడు కనిపించకపోవడంతో పార్టీలో పరిణామాలపై చర్చలు తీవ్రమయ్యాయి.

Teluguone gnews banner