Read more!

కవిత పిటిషన్ విచారణ మూడు వారాలు వాయిదా!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి (అరెస్ట్ లాంటి) చర్యలు తీసుకోవద్దని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా,  తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ  ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే

. కవిత పిటిషన్ విచారణ ఈ రోజు సుప్రీంలో జరిగింది. ఆ సందర్భంగా  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం  కేసు విచారణను ఈడీతో కాకుండా..  కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరపాలని కోరారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించగా,  ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్  వాదనలు వినిపించారు. 

ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందని పిటిషన్   ఆరోపించిన కవిత  తనను  తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరారు.    సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించి.. తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ఎదుట విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో కవిత వేసిన పిటిషన్ ను, నళిని వేసిన పిటిషన్ కు కోర్టు ట్యాగ్ చేసింది. తర్వాతి హియరింగ్ లో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉందని అంటున్నారు.