చిక్కుల్లో రాష్ట్ర చేనేత

వలసదారి పడుతున్న నేతన్నలు
హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. నేతన్నలకు ఆదరణ కరువై ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించక పోవడంతో బతుకు భారమై వలసలు పోతున్నారు. మన రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు గతంలో జాతీయ స్థాయిలో  మంచి గుర్తింపు ఉండేది. ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను ప్రోత్సహించి చేనేత సహకార సంఘాలకు రుణాలు ఇచ్చేది. కానీ ఇప్పుడు కంటితుడుపుగా నిధులు కేటాయించి ఖర్చులు మాత్రం చేయడంలేదు. గత ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో చేనేత రంగానికి రూ.286 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే దానిలో రూ.36 కోట్లు మాత్రమె ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది. చేనేత పరిశ్రమపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద ఏపాటిదో. తాజా బడ్జెట్ లో చేనేత రంగానికి కేటాయింపులను రూ.200 కోట్లకు తగ్గించారు. అసలు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా చేనేత కార్మికులను విస్మరించడం ఎంతవరకు సమంజసమని చేనేత కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. చేనేత పరిశ్రమ అడుగంటి పోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి కూలీలుగా మారుతున్నారు.

Teluguone gnews banner