ఇంటి పార్టీ పక్కాగా రెండు ముక్కలు?
posted on May 24, 2025 @ 1:05PM
బీఆర్ఎస్ లో చీలిక పక్కా అయిపోయిందా? కవిత సొంత కుంపటి పెట్టుకోవడం ఖాయమైపోయిందా? అంటే.. గులాబీ పార్టీ వర్గాల నుంచి ఔననే సమధానమే వస్తోంది. నిజానికి కవిత చాలా కాలంగా సొంత కుంపటి’ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయితే.. కేటీఆర్, హరీష్ రావులను కలిపినట్లుగానే కేసీఆర్ ఏదో చేసి కవితను దారికి తెస్తారనే ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి. కవిత అమెరికా నుంచి వస్తూ వస్తూనే.. తెలంగాణ గడ్డ పై కాలుపెట్టీపెట్టక ముందే చేసిన ‘దయ్యాల’ వ్యాఖ్యలతో, ఆ కొద్ది పాటి దింపుడు కళ్ళెం ఆశ కూడా కొడిగట్టిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఏదో మహాద్భుతం జరిగితే తప్పించి, గులాబీ పార్టీ చీలికను నిరోధించడం ‘దేవుడి’ కి కూడా సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అవును. భారత రాష్ట్ర సమితి లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావుకు, ఆయన కుమార్తె, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత రాసిన రాజకీయ లేఖ సంచలనంగా మారింది. నిజానికి, కవిత ఎవరో పరాయి వ్యక్తిలా, కన్న తండ్రికే లేఖ రాయడమే ఒక సంచలనం అయితే.. ఆ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలు మరింత సంచలనంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ తీరు తెన్నులు.. ఆ సందర్భంగా కేసీఆర్ చేసియన్ ప్రసంగం మంచి చెడులను ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. అదే సమయంలో ఆమె చేసిన మర్మ గర్భ వ్యాఖ్యలూ.. ముఖ్యంగా బీజేపీని విమర్శించ వలసినంతగావి మరించలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అంతకు మించి అమెరికా నుంచి వస్తూనే, ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేయడంతో పాటు, మా నాయన, కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయి’ అంటూ చేసిన, వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. అలాగే.. లేఖ లీక్ కు సంబదించి కవిత లేవనెత్తిన ప్రశ్నలు.. ఆమె పుట్టింటి కుట్రలకు అద్దం పడుతోందని అంటున్నారు.
నిజానికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నట్లుగా పార్టీ నాయకురాలిగా కవిత లేఖ రాయడం తప్పు కాదు. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టవలసిన అవరం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితిని ఆమె తనకున్న అవగాహన మేరకు ప్రజాస్వామ్య స్పూర్తితో పార్టీ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళారు. పార్టీ నాయకురాలిగా పార్టీకి పార్టీ అధ్యక్షునికి సూచనలు చేశారు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. కానీ ఆమె అక్కడితో ఆగ లేదు. కేసీఆర్ ను దేవుడిగా పేర్కొంటూనే.. ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని పరోక్షంగానే అయినా తండ్రి పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విధంగా ధృతరాష్ట్రుడితో పోలిక తెచ్చారా అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్ కుమార్తెగా తాను రాసిన లేఖే లీక్ అయితే.. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఇది అత్యంత బాధాకరం. లేఖ ఎలా లీక్ అయిందో, పార్టీ ప్రజలు కూడా ఆలోచించాలి అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. లేఖ లీక్ లోనే కుట్ర కోణం దాగుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, దేశంలో అడుగుపెడుతూనే, పార్టీని ముఖ్యంగా కన్న తండ్రి కేసేఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఆమె,లక్ష్యం ఇంకేదో ఉందనే విషయాన్ని స్పష్టమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
అదొకటి అయితే, కవిత.. నాన్నకు ప్రేమతో.. రాసిన లేఖ వెనక చాలా, పేద్ద కథే ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. ఇటీవల ఆమె నడకలో, నడతలో, భాషలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న మార్పు నేపథ్యంలో కవిత అడుగులు ఎటుగా పడుతున్నాయి? ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఎటుగా సాగుతోంది? ఆమె ఆమెగానే, అడుగులు వేస్తున్నారా.. లేక, నడిచేది ఆమే అయినా నడిపించే వారు వేరే ఉన్నారా? అనే ప్రశ్నలు, అనేక వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత వెనక ఎవరున్నారు అనేది పక్కన పెడితే, కవిత కారు దిగడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి..లిక్కర్ కుంభకోణం విచారణ మొదలైనప్పటి నుంచే ఆమెకు ఇటు ఫ్యామిలీలో,అటు పార్టీలో వ్యతిరేకత మొదలైందని అంటున్నారు. అక్కడి నుంచే ఆమె పార్టీకి, ఫ్యామిలీకి కూడా దూరం అవుతూ వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి, ఆరు నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత పార్టీని,ఫ్యామిలీని నమ్ముకుంటే కష్టమనే నిర్ణయానికి కవిత వచ్చారని అంటున్నారు. అందుకే.. ఆమె, పార్టీలో, ఫామిలీలో తమ స్థానం ఏమిటో స్పష్టం చేయాలని, అన్న కేటీఆర్ తో సమాన హోదా కోసం పట్టుపడుతూ వచ్చారని అంటారు. అయితే.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీలో తన స్థానేమిటో తేట తెల్లకావడంతో పాటుగా ఆమె అమెరికా ప్రయాణానికి ముందు కేసీఆర్ మధ్యవర్తిత్వం వహించి మరీ కేటీఆర్, హరీష్ రావులను కలపడంతో.. కవితకు తన స్థానం ఏమిటో తెలిసివచ్చిందని, అందుకే ఆమె కొత్త దారులు వెతుక్కుంటున్నారని అంటున్నారు.
అందుకే.. విమానం దిగుతూనే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లుగా దయ్యాల తూటాను, ఎవరికి తగలాలో వారికి తగిలే విధంగా పేల్చారని అంటున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందునుంచే ఉహించిన కవిత ఒకటి కంటే ఎక్కవ ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పడు.. ఆమె కారు దిగడం ఖాయమని తెలిపిన నేపధ్యంలో, ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటారు.. ఎటుగా అడుగులు వేస్తారు అనేది చూడవలసి ఉందని అంటున్నారు.