కేంద్ర సర్వీస్ కు వెళుతున్న సీఎం జగన్ ముఖ్య అధికారి...!
posted on Nov 16, 2020 @ 1:25PM
ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత కొద్ది కాలానికే.. ఇటు సీఎంవో ముఖ్య కార్యదర్శిగా, అటు జీఏడీలోను కీలక అధికారిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రవీణ్ ప్రకాష్ నడిపిస్తున్నసంగతి తెల్సిందే. అయన ఆదేశాలతోనే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా అర్ధాంతరంగా తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తన బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారని ఏపీ సచివాలయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన కొంత కాలం క్రితం కేంద్ర సర్వీసుల్లో పని చేసి ఏపీకి వచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్ర సర్వీసుల్లోకి రాగా… ఆయనను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. అయితే జగన్ సీఎం అయ్యాక ఆయనను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా.. అలాగే జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించిన సంగతి తెల్సిందే. ప్రభుత్వంలో ఆయన మాటే వేదవాక్కుగా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు తప్పుకుంటున్నారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆయన స్థానంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.