Read more!

నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య పై సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్

పోలీసుల తీవ్ర వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నసంగతి తెల్సిందే. పోలీసులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని దీంతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు సెల్ఫీ వీడియో తీసి మరీ రైలు కింద పడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నంద్యాల ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులను అరెస్ట్ చేయ‌టం స‌రికాద‌ని, తమ డ్యూటీ చేసిన పోలీసుల్ని అరెస్ట్ చేయ‌టం ఏంట‌ని సోము వీర్రాజు ఈ సందర్భంగా ప్ర‌శ్నించారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ఆయన మండిప‌డ్డారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీని మ‌తతత్వ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అందరు విమ‌ర్శిస్తున్నార‌ని…అయితే ఈ రెండు పార్టీలు చేసేవి మ‌త రాజ‌కీయాలు కావా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేయ‌గా మ‌రుస‌టి రోజే వారు బెయిల్ పై విడుద‌లైన సంగతి తెలిసిందే.