ఎన్టీఆర్ ట్రస్ట్ మొక్క నుంచి వృక్షంగా ఎదిగింది : సీఎం చంద్రబాబు
నిరుపేద, అనాథ పిల్లలకు ఉన్నత విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ను స్థాపించామని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్ధవంతంగా నడిపిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చంద్రబాబు చమత్కరించారు.
తన చిన్నతనంలో చాలా మంది ఐఏఎస్ చదవాలని కోరారని కానీ నేను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న క్లాస్ రూముల్లో.. అప్పట్లో పొలిటికల్ లీడర్స్ శిక్షణ తీసుకున్నారని గుర్తుచేశారు. పది ఎకరాలు ఉన్న ఈ క్యాంపస్.. అప్పుడు ఒక చిన్న మొక్కలా ఉందని.. ఇప్పుడు పెద్ద వృక్షంలాగా మారిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని కీర్తించారు. కొంతమంది విద్యార్థులు గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకున్నారని తెలిపారు.1995లో తాను మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్లో ఐటీని ప్రారంభించానని గుర్తుచేశారు.
ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్తో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ను ప్రారంభించామని.. ఇప్పుడు వందల కాలేజ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించామని సీఎం తెలిపారు. యూనివర్శిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను... రెండేళ్లల్లో మంత్రిని అయ్యాను చంద్రబాబు పేర్కొన్నారు.
నేను రాజకీయాల్లో బిజీ అయ్యాక... హెరిటేజ్ బాధ్యతలు చూడాలని భువనేశ్వరిని కోరాను. అయిష్టంగా హెరిటెజ్ బాధ్యతలు తీసుకున్న భువనేశ్వరి ఆ సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. పట్టుదలతో హెరిటెజ్ సంస్థను నడిపించారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరికి పట్టుదల ఉంది... మొండితనమూ ఉందన్నారు. భువనేశ్వరి ఏదైనా చేయాలని సంకల్పం తీసుకుంటే పట్టుదలతో చేస్తారు. భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటెజ్ ఎండీగా భువనేశ్వరి చాలా విజయాలు సాధించారని పేర్కొన్నారు. నేను సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా పని చేస్తున్నాను... కానీ భువనేశ్వరి చాలా పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
భువనేశ్వరి చేస్తున్న కృషికి లండన్ లో ఇన్సిటిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ రెండు అవార్డులు ఇచ్చింది. వ్యక్తిగత అవార్డు తోపాటు... హెరిటెజ్ సంస్థను అద్భుతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డు ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల తయారీ, డ్రోన్, స్పేస్ టెక్నాలజీలకు ఏపీని హబ్గా తీర్చిదిద్దుతాం" అని తన భవిష్యత్ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..