వలస కూలీల రైలు ఛార్జీలు కాంగ్రెస్సే భరిస్తుంది! సోనియా గాంధీ
posted on May 4, 2020 @ 2:07PM
లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకొని తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల రైలు ఛార్జీలు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాఖలే భరిస్తాయని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఇబ్బందిపడుతున్న కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరందరినీ వారి ప్రాంతాలకు సురక్షితంగా, ప్రభుత్వ ఖర్చులతో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ పెడచెవిన పెడుతోందని ఆరోపించారు.
అనేక మంది కూలీలు ఆహారం, నీరు, మందులు, డబ్బు లేకుండానే కాలినడన బయలుదేరారని గుర్తుచేశారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంలో భాజపా సర్కార్ ఘోరంగా విఫలమైందని సోనియా విమర్శించారు.
విదేశాల్లో నిలిచిపోయిన ప్రవాసుల్ని విమానాల ద్వారా భారత్కు తీసుకొచ్చినప్పుడు.. దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. గుజరాత్లో ఓ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పేద కూలీల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు.
పీఎం-కేర్స్ ఫండ్కు రూ.151 కోట్ల నిధుల్ని విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించలేదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి వలస కార్మికులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద కూలీలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిందన్నారు.