శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు
posted on May 9, 2025 @ 8:37PM
హైదరాబాద్లో శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఏ క్షణమైన బాంబుతో పేల్చేస్తామని, ప్రభుత్వానికి చెప్పాలని పాక్ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు.దీంతో పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై, హుటాహుటిన రంగంలోకి దిగారు.
డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను రప్పించి విమానాశ్రయ ప్రాంగణమంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలు, లగేజీ స్కానింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు సహా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.