ఏపీలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం మరల మొదలైందా..!!
posted on Feb 11, 2020 @ 9:40AM
ఏపీలో మళ్లీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం ప్రారంభమైంది, సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయలేమంటూ చైర్మన్ కు మండలి కార్యదర్శి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుంటోంది, చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ ఎలా బేఖాతరు చేస్తారంటూ మండిపడుతోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలకు పోతుండడంతో సెలక్ట్ కమిటీల ఏర్పాటు అంశం మరింత జఠిలం కానుంది. వికేంద్రీకరణ బిల్లులు ఇంకా గాలిలోనే ఉన్నాయి, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. వికేంద్రీకరణ బిల్లు సి ఆర్ డి ఏ చట్ట ఉపసంహరణ బిల్లులపై మండలిలో చర్చ జరిగి గందరగోళం మధ్య సెలెక్ట్ కమిటీకి పంపుతున్నారనే విషయాన్ని ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజులు గడుస్తున్నా సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశం మాత్రం కొలిక్కి రావడం లేదు. సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయాలంటూ మండలి చైర్మన్, కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఫైల్ పంపారు. అలాగే తన వద్దకు వచ్చిన సభ్యుల పేర్లతో సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చేయాలని సూచించారు.
అయితే ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు మండలి సెక్రెటరీ, సెక్షన్ 154 ప్రకారం సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే అధికారం లేదని, అలాగే తనకున్న నిబంధనలు, పరిమితులను కూడా ప్రస్తావిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కు మండలి సెక్రటరీ నోట్ రాసినట్టు సమాచారం. మండలి కార్యదర్శి ఈ విధంగా వ్యవహరించడాన్ని ఇటు మండలి ఛైర్మన్ తో పాటు టిడిపి కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను తిప్పి పంపే అధికారం సెక్రటరీకి ఎంత మాత్రం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఇదే అంశంపై మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులతో భేటీ అయ్యారు టిడిపి ఎమ్మెల్సీలు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తూ కార్యదర్శిపై ఒత్తడి పెంచితే తాము కూడా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఇష్యూను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని హెచ్చరించారు.
అయితే మధ్యే మార్గంగా సంప్రదింపులు జరుపుకునే సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో ఓ అభిప్రాయానికి వస్తే బెటరనే భావనను మండలి కార్యదర్శి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు చైర్మన్ ఆదేశాలను పాటించకుండా సెక్రటరీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామంటూ టిడిపి స్పష్టం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ కూడా అప్రమత్తమయింది. టిడిపి ఎమ్మెల్సీలు సెక్రటరీతో భేటీ అయ్యారనే సమాచారం తెలుసుకున్న వెంటనే వారి భేటీ అనంతరం మండలి సెక్రెటరీతో డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భేటీ అయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్ సెలక్ట్ కమిటీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపే అంశమే ఉత్పన్నం కాదనేది వైసిపి వాదన. ఈ క్రమంలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.