అయోధ్యలో 144 సెక్షన్ అమలు...
posted on Oct 14, 2019 @ 4:26PM
అయోధ్యలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి, అయోధ్య పట్టణంతో పాటు మొత్తం జిల్లాలో 144 సెక్షన్ విధించారు. త్వరలో రామ మందిరం బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సెక్షన్ 144 విధిస్తున్నట్టు సమాచారం. ఆ ఆదేశాలు డిసెంబర్ పది వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. అయోధ్య కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆగస్టు ఆరు నుంచి జరుగుతున్న విచారణ మరో మూడు రోజుల్లో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూడా అయోధ్యపై సుప్రీం లో వాడీవేడిగా వాదనలు జరిపాయి. వివాదాస్పద స్థలంలో ఆలయం లేదని ముస్లిం సంఘాల తరపున వాదించిన లాయర్ రాజీవ్ ధావన్ మరోసారి వెల్లడించారు. కూలగొట్టిన స్థలం లోనే మసీదును నిర్మించాలని కోరారు, హిందూ సంస్థలు బలవంతంగా ఆ స్థలాన్ని ఆక్రమించాయని ఆరోపించాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి ఇరవై ఏడు ఏళ్లు గడుస్తోంది, రామజన్మభూమి రామ మందిరం బాబ్రీ మసీదు చుట్టే వివాదం తిరుగుతోంది. బాబ్రీ మసీద్ రామమందిర భూ వివాదంపై ఇరువర్గాలూ ఇప్పటికే తమ వాదనలు వినిపించాయి.
గతేడాది సుప్రీం కూడా కేసును పక్కన పెట్టి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది. రెండు వర్గాలతో కోర్టు వెలుపల చర్చలు జరిపింది, కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు లోనే దీనిని తేల్చాలని నిర్ణయించింది. ప్రతి రోజూ ఈ కేసులో వాదనలు విని ఈ నెల పదిహేడులో పునః విచారణ ముగిస్తామని తెలిపింది. విచారణ పూర్తయిన నాలుగు వారాల్లో తీర్పును వెల్లడిస్తామని కూడా చెప్పడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు అయోధ్య కమిషనర్ ను విశ్వ హిందూ పరిషత్ నేతలు కలిశారు. దీపావళి నాడు అయోధ్యలో రామ మందిరం దగ్గర దివ్వెలను వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.