రాజరాజ నరేంద్రుడు.. సంగం సపోర్ట్ ఆయనకే..
posted on May 29, 2021 @ 10:15PM
ధూళిపాళ్ల నరేంద్ర. సంగం డెయిరీ ఛైర్మన్ ఆయన. ఏళ్లుగా ఆయనే అధిపతి. పాల ఉత్పత్తిదారులకు పెన్నిధి. డెయిరీలో ఎలాంటి సమస్య లేదు. అంతా సంతోషంతో ఉన్నారు. అందుకే, సర్కారుకు కళ్లు మండినట్టున్నాయి. ధూళిపాళ్ల టీడీపీ నాయకుడు కాబట్టి.. ఆయన సారధ్యంలోని సంగం డెయిరీని టార్గెట్ చేసినట్టున్నారు. కట్ చేస్తే.. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్. జైలుకు తరలింపు. సంగం డెయిరీ ఆస్తులు స్వాధీనం. హైకోర్టు తీర్పుతో ఆస్తులు మళ్లీ సంగం డెయిరీకే సొంతం. ఇదీ జరిగింది.
బెయిల్పై తిరిగొచ్చిన ధూళిపాళ్ల.. ఛైర్మన్ హోదాలో విజయవాడలో జరిగిన సంగం డెయిరీ పాలకవర్గం సమావేశానికి హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత.. అతిపెద్ద రాజకీయ హైడ్రామా తర్వాత.. నరేంద్ర నేతృత్వంలో మీటింగ్ జరగడం విశేషం. ఏ కుర్చీనయితే.. అతని నుంచి లాక్కోవాలని చూశారో.. ఇప్పుడు అదే సీటులో మరోసారి ఆసీనులై.. అదే సంగం పాలక వర్గానికి ఛైర్మన్గా.. పలు నిర్ణయాలు తీసుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తాత్కాలికంగా తనను ఇబ్బందిపెట్టినా.. తుది విజయం తనదేనంటూ ధూళిపాళ్ల.. రాజరాజ నరేంద్రుడిలా.. సంగం డెయిరీ ఛైర్మన్గా.. సింహాసనం అధిష్టించడం ఆయన సత్తాకు నిదర్శనం.
సంగం డెయిరీ పూర్తిగా పాల ఉత్పత్తిదారుల ఆస్తి.. దీనికి పాలకవర్గం కేవలం విధాన నిర్ణేత మాత్రమేనని ధూళిపాళ్ల తెలిపారు. నరేంద్ర అధ్యక్షతన జరిగిన పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి గేదె పాల సేకరణ.. కిలో వెన్నకు 715 రూపాయలు చెల్లించనుంది. 10 శాతం వెన్న శాతం ఉన్న గేదె పాలు లీటరుకు రూ.71.50 చెల్లించేందుకు పాలకవర్గంలో నిర్ణయం తీసుకున్నారు. పశు దాణా కోసం మొక్కజొన్నల ధర క్వింటాల్కు 1700 చెల్లించాలని తీర్మానం చేశారు. ఈ ఏడాదిలో 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సంగం డెయిరీ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఆవులలో పొదుగువాపు పథకం ప్రారంభించాలని, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల బల్క్ కూలర్ను ప్రారంభించేందుకు డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకు సంఘీభావాన్ని తెలియజేస్తూ సంగం డెయిరీ ఏకగ్రీవ తీర్మానం చేయడం విశేషం. సంగం డెయిరీపై ఆయనకున్న అనుబంధానికి ఇది నిదర్శనం.