రౌండప్ 2022 ఈ ఏడాది ఏం జరిగింది?
posted on Dec 23, 2022 @ 1:56PM
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
జనవరి 1
2022 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.
జనవరి 4
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్ ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల విలువైన 22 అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.
జనవరి 5
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా ప్రధాన మంత్రి పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
జనవరి 15
సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
జనవరి 20
బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.
జనవరి 23
నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి. దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.
జనవరి 30
మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు.
జనవరి 31
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఫిబ్రవరి
జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.
ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్ లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.
అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.
ఫిబ్రవరి 6:
ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు. వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.
మార్చి
తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి, ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.
మార్చి 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.
యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.
మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది.
ఏప్రిల్
ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది.
ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది.
ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు.
తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు.
ఏప్రిల్ 11 తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 14 ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు.
ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు.
ఏప్రిల్ 24 ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు. ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు.
మే నెల వివరాలు రేపు