అర్ణబ్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు! చొక్కా పట్టుకుని లాక్కొచ్చారంటున్న రిపబ్లిక్ టీవీ
posted on Nov 4, 2020 @ 10:44AM
రిపబ్లిక్ టీవీ ఎడిటర్, దేశంలోని ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను ముంబై అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన అత్తయ్య, మామయ్య, కుమారుడు, భార్యపై ముంబై పోలీసులు భౌతిక దాడి చేశారని అర్ణబ్ గోస్వామి ఆరోపించారు.
అర్ణబ్ గోస్వామి అరెస్టుపై పలు ఆరోపణలు చేస్తూ రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని అర్నాబ్ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసే క్రమంలో భౌతిక దాడికి దిగారని తెలిపింది. అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడికి దిగి, ఆయనను చొక్కాపట్టుకుని బయటకు లాక్కొచ్చి పోలీసు వ్యాను ఎక్కించి తీసుకెళ్లారని తెలుపుతూ రిపబ్లిక్ టీవీ ఓ వీడియోను కూడా ప్రసారం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అర్నాగ్ గోస్వామిపై ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరును దేశంలోని ప్రజలు ఖండించాలని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది.
ముంబైలో 2018, మేలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. గోస్వామితో పాటు ఫెరోజ్ షెయిక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరిపిన రాయ్గడ్ పోలీసులకు అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కాకపోవడంతో 2019 లో ఈ కేసును మూసివేశారు. ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ను ఈ కేసు విషయంపై అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యనాయక్ ఆశ్రయించి, పోలీసులు ఈ కేసులో సరైన విచారణ జరపలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కొత్తగా సీఐడీ విచారణ జరుపుతుందని హోం మంత్రి ప్రకటించారు.