అసెంబ్లీలో ఆడపడుచుపై నిందలా.. వైసీపీపై రేణుకా ఫైర్..
posted on Nov 20, 2021 @ 2:00PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదన్నారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞత కాదని మండిపడ్డారు. అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదని.... కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే శాశ్వతమన్నారు రేణుకా చౌదరి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరని రేణుకా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలని రేణుకా చౌదరి హితవుపలికారు.