బీ ఫారాలిస్తాం.. ‘లెక్క’ మీరే చూసుకోండి
posted on Mar 27, 2014 @ 9:31AM
శాసనసభ, లోక సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు మాత్రమే ఇస్తామని నిధులు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి చెబుతున్నారట. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి లోకసభ మినహా మిగిలిన 14 అసెంబ్లీ, చిత్తూరు, రాజంపేట లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్రెడ్డికి అప్పగించారు.
బస్సు యాత్రలో భాగంగా తిరుపతికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి చిరంజీవి తిరుపతి శివార్లలోని ఒక హోటల్లో వేణుగోపాల్రెడ్డితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని, అయినా పనిచేయక తప్పదని ఉద్బోధించారు. అన్ని స్థానాలకు టికెట్లు ఆశించే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తుందనే ప్రచారం తీసుకొచ్చారని, అటువంటిదేమీ ఉండదని ఆశావహులకు స్పష్టం చేయాలని కూడా వారు కుండబద్దలు కొట్టారు.
తిరుపతికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్ను ఆశిస్తూ రఘువీరాతో భేటీ అయినప్పుడు కూడా నిధుల విషయం చర్చకు వచ్చినట్లు తెల్సింది. వారితో కూడా నిధుల విషయంలో పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పోటీ చేస్తే భవిష్యత్లో మంచి అవకాశాలు ఇస్తామని మాత్రమే భరోసా ఇచ్చినట్లు తెల్సింది. తాను కష్టకాలంలో పార్టీ బాధ్యతలను స్వీకరించానని నిధులు ఆశించకుండా వస్తే బీ ఫారం మాత్ర ఇస్తానని తేల్చిచెప్పారు. దీంతో ఆ నాయకులు అసంతృప్తికి గురయ్యారు. తిరుమలలో కలిసిన ఒకరిద్దరి నాయకులకు కూడా రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని చెప్పిట్లు తెలిసింది.