తిరుమల ఘాట్ లో గుర్తుతెలియని వాహనం ఢీ కొని పునుగుపిల్లి మృతి
posted on May 5, 2025 @ 1:08PM
శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతిగా అటవీ అధికారులు ప్రకటించారు. ఈ పునుగుపిల్లులకు ఉన్న మరో విశిష్ఠిత ఉంది. తిరుమల స్వామి వారికి వారం వారం నిర్వహించే తిరుమంజనం సందర్భంగా జరిగే అభిషేక సేవలో పునుగు పిల్లి తైనాన్నే వినియోగిస్తారు. పునుగు తైలం లేకుంటే స్వామివారి అభిషేకం పరిపూర్ణం కాదని అంటారు అర్చకులు. అటువంటి అరుదైన, ప్రత్యేకమైన జాతికి చెందిన పునుగు పిల్లి ఒకటి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించింది. గుర్తు తెలియని వాహనంన ఢీ కొని పునుగుపిల్లి మరణించడం దురదృష్టకరమని టీటీడీ అధికారులు అంటున్నారు. అత్యంత అరుదుగా మాత్రమే అటవీ ప్రాంతం నుంచి పునుగుపిల్లులు బయటకు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలోనే గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒక పునుగుపిల్లి మరణించింది.
కొంత కాలం కిందట ఒక దశలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో తిరుపతి జూలో వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లల సంఖ్య పెరిగిందంటున్నారు.