సింహాచలం గోడ వెనక దాగిన గోపీ జగనేనా?
posted on May 5, 2025 @ 1:38PM
సింహాచలం గోడ కూలిన ఘటనలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు?
వైసీపీ ప్రశ్నలకు సమాధానమేంటి?
వేళ్లన్నీ గత పాలకుల పాపాలవైపే
సింహాచలం గోడ కూలిన ఘటనలో అసలు ద్రోహి కూటమి ప్రభుత్వం అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అంతే కాదు ఇటు తిరుమల తొక్కిసలాట, అటు సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలడం వంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించడం లేదన్నది వీరి ఆరోపణ.
ఇక్కడ జరిగిన అసలు వాస్తవాలేంటని చూస్తే.. సింహాచలం గోడ లక్ష్మణ రావు అనే కాంట్రాక్టర్ కి రూ. 54 కోట్ల రూపాయలతో ఇచ్చింది 2023లో. అది కూడా జగన్ హయాంలో. కానీ ఆ గోడ కూలింది కూటమి ప్రభుత్వంలో. కాబట్టి ఆ పాపమంతా కూటమిదే అంటుంది వైసీపీ. మరి నాసిరకం ఇటుకలు, నాణ్యత లేని సిమెంటు ద్వారా కట్టే కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన తప్పిదం వల్లే కదా ఇదంతా జరిగిందన్నది కూటమి నేతలు వేస్తోన్న రివర్స్ కౌంటర్.
ఒక్క పవనే కాదు.. కూటమి తరఫున ఎవరు మాట్లాడాల్సి వచ్చినా సరిగ్గా ఈ పాయింట్ దగ్గర్నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు నేడు శాపాల రూపంలో ఆంధ్రులను వెంటాడుతున్నాయనే చెప్పాల్సి వస్తుంది. తిరుమలలో కూడా అంతే! కేవలం దేశీ ఆవుల మాత్రమే(అంటే ప్రాంతీయ ఆవులు) ఉండాల్సిన గోశాలలో ఎక్కడెక్కడి నుంచో ఆవులు తెచ్చింది వాళ్లే. గోవుల మరణాల సంఖ్య లెక్కకు మించి చూపించిందీ వాళ్లే.. అంతే కాకుండా ఫేక్ ఇమేజీలతో ట్రోల్ చేసింది కూడా వాళ్లే. ఇలాంటి దుష్ప్రచారాలపై ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీస్కోవాలన్న డిమాండ్ వినవస్తోంది. ఇక తొక్కిసలాట ఘటన వెనక ఎవరున్నారో.. వారిపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గోమరణాలనే వ్యవహారం ఉన్నట్టుండి ఎందుకు బయట పడిందో అందరికీ తెలిసిందే. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా కనిపించేది గత పాలకుల తాలూకూ తప్పిదాలే. ఒక వేళ కూటమి నేతలు నిలదీయాల్సి వస్తే గత పాలక పక్షమైన వైసీపీని నిలదీయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా వైసీపీ కావాలని కూటమిని టార్గెట్ చేసి తానిలా బుక్ అయిపోతోంది. సింహాచలంలో నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లకు టెండర్ ఇచ్చింది చాలక ఆ తప్పు కూడా మీదే అనడం.. లాజిక్కులు లాగటం పైకి బాగానే ఉన్నా.. అది దైవ ద్రోహం కిందకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో దైవ ద్రోహాల ఘటనల్లో అడ్డంగా బుక్కయిన జగన్ అండ్ కోకి దేవుడితో పెట్టుకుంటే పంగనామాలే అని సీట్ల రూపంలో తెలిసివచ్చినా ఇంకా అదే దుర్బుద్ధి. అదేమంటే మాజీ మంత్రి రోజా వెంకన్నతో పెట్టుకుని పవన్ కి బాగా తెలిసి వచ్చిందంటున్నారు. ఈ విషయంలో ఫస్ట్ తెలుసుకోవల్సిందే వారు. వైసీపీ దేవుడితో అన్నేసి సయ్యాటలాడ్డం వల్లే అంత అడ్డంగా ఓడామని గుర్తించాలి.
ఇప్పటికే టీటీడీ వంటి హిందూ ధార్మిక ప్రాంతాల నిండా భారతమ్మ సైన్యం అలుపెరుగక పని చేస్తోంది. ఇలాంటి కుట్రలకు పాల్పడ్డానికి వారు చేయని పాపం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ టీటీడీలో వీరి సంఖ్య 2 వేల వరకూ ఉండొచ్చని అంచనా. మరి వీరందరి చేతా చేయించాల్సింనదంతా చేయించి.. ఆ పాపం తీస్కొచ్చి కూటమి ప్రభుత్వం మీద వేయడం ఎంత వరకూ సమంజసం? అన్నది వారికి వారే ఆత్మావలోకనం చేస్కోవాలంటున్నారు సామాన్యులు.