ప్రణబ్జీ మనసులో ఉన్న రహస్యాలు వేటి గురించి!
posted on Jan 29, 2016 @ 10:37AM
కాంగ్రెస్లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ! ఈ 80 ఏళ్ల కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక పక్క తనదైన ముద్రని నిలబెట్టుకుంటూనే, ఇందిర నుంచి సోనియా వరకూ పార్టీ అగ్రనాయకత్వానికి విధేయుడిగా కూడా పేరు పొందారు. అలాంటి ప్రణబ్ ఇప్పుడు తన రాజకీయానుభవం గురించి మరో పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకానికి ముందు ప్రణబ్ రాసిన ‘The Dramatic Decade: The Indira Gandhi Years’ పెద్దగా సంచలనం సృష్టించలేకపోయింది. ఎమర్జన్సీ గురించి ప్రణబ్ తన పుస్తకంలో ఆశ్చర్యకరమైన నిజాలు ఎన్నో వెల్లడిస్తారని అంతా ఊహించారు. కానీ ఈ పుస్తకం సాదాగా సాగిపోయింది. ప్రణబ్ తన మనసులో ఎన్నో రహస్యాలను దాచుకునే ఉన్నారని పాఠకులు అప్పుడే ఊహించారు. ఈసారి ప్రణబ్ తన రెండో పుస్తకమైన ‘The Turbulent Years: 1980 – 1996’ అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఇందులో కూడా ప్రణబ్ ఆచి తూచి తన పదాలను ప్రయోగించినట్లు కనిపిస్తోంది.
ఇందిరా గాంధి మరణం తరువాత ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి పదవిని ఆశించారని చెబుతారు. అయితే తనకు అలాంటి ఆశ ఏమీ లేదని ఈ పుస్తకంలో తేల్చి చెప్పారు ప్రణబ్. అయితే మరి రాజీవ్ గాంధి నుంచి దూరమై, పార్టీని సైతం వీడి వేరు కుంపటి ఎందుకు పెట్టుకున్నారన్న దానికి స్పష్టమైన జవాబులు కరువయ్యాయి. ఇతర సంప్రదాయ కాంగ్రెస్ నేతలలాగానే బాబ్రీమసీదు విధ్వంసానికి తెలుగువాడైన పి.వి.నరసింహరావుని తన పుస్తకంలో దోషిగా తేల్చారు ప్రణబ్. నిజానికి 1980-1996 మధ్య కాలంలో దేశంలో చాలా ఉపద్రవాలే సంభవించాయి. 1984లో ఇందిరా గాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా దాదాపు 3000 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఒక్క దిల్లీలోనే రెండు వేల మందికి పైగా సిక్కులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ను వెంటాడుతున్న బోఫోర్సు కుంభకోణానికి అంకురార్పణ జరిగింది కూడా ఆ సమయంలోనే. అయితే ప్రణబ్ వీటి గురించి ఆచితూచి స్పందించారు.
‘The Turbulent Years: 1980 – 1996’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ప్రణబ్ కొన్ని రహస్యాలు తనతోనే సమాధి అయిపోతాయని చెబుతారు. తనకి రోజూ డైరీ రాసే అలవాటు ఉందనీ, భవిష్యత్తలో వచ్చే ప్రభుత్వాలు కావాలనుకుంటే వాటిని ప్రజలకు వెల్లడించవచ్చనీ చెప్పారు. రక్షణ మంత్రిగా, ఆర్ధిక శాఖా మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా… కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ వివిధ ఉన్నత పదవులని అలంకరించారు. అన్నింటికీ మించి ఆ పార్టీకీ, అందులోని నాయకత్వానికీ వీరవిధేయుడిగా పేరుగాంచారు. మరి ఎమర్జెన్సీ, బోఫార్సు, సిక్కుల అల్లర్లు, శ్రీలంకలో భారతేదేశపు జోక్యం… ఇలా చాలా విషయాలకు సాక్షిగా ఉన్న వ్యక్తి మనసులో రహస్యాలకు కొదవేముంటుంది. ప్రణబ్ ఆశించినట్లు రాబోయే ప్రభుత్వాలు వాటిని వెల్లడిస్తే బాగుండు.