న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగతనం చేసిన పోలీసులు..
posted on Jan 2, 2022 @ 2:22PM
కంచే చేను మేస్తే.. రక్షించాల్సిన వాడు భక్షిస్తే.. ఇక చెప్పుకోవడానికి ఏమి ఉండదు. పోలీసులు అంటేనే సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించే వీరులు. అలాంటి పోలీసులే వక్ర మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది. వినడానికి కూడా మరీ చండాలంగా ఉంటుంది కదూ. కాని అలాంటి పోలీసులే పాడు పని చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏకంగా ఒక రైతు మేకను దొంగిలించి దావతు చేసుకున్నారు.
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 అందరిలాగే పోలీసులు కూడా పార్టీ చేసుకుందాం అనుకున్నారు. ఆ విధంగానే రెండు మేకలను కోసి మరి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. అయితే దావుతు కోసం మేకలను కొనలేదు... కొట్టుకొచ్చారు. అవునండి మీరు విన్నది నిజమే. పోలీసులు దొంగల్లా మరి మేకలను కాజేసి పోలీస్ స్టేషన్ దగ్గర్లోనే దాన్ని కోసి విందు పార్టీ చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపినవిషయం ప్రకారం సిండికేల గ్రామానికి చెందినటువంటి సంకీర్తన గురు అనే వ్యక్తి మేకలను మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజులాగే ఆయన 31 వ రోజు మేకలను తోలుకొని ఇంటికి వచ్చాడు. ఆ మందలో రెండు మేకలు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ కనిపించలేదు. వీరు మేకలను మేపే దగ్గరనే పోలీస్ స్టేషన్ ఉంది. వీరు వెతికే క్రమంలో గురు కూతురు స్టేషన్ లో రెండు మేకల కోస్తుండగా చూసింది.వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పింది. గురు వారి యొక్క గ్రామస్తులను వెంట తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ సిబ్బందిని నిలదీశారు. మా మేకలను దొంగిలించి కోసుకుంటారా.. అని ప్రశ్నించాడు. కానీ వారు పట్టించుకోలేదు. గురునే బెదిరించారు.
ఈ విషయం కాస్త మీడియా దృష్టికి వెళ్లింది. వెంటనే జిల్లా ఎస్పీ నితిన్ శుక్లకర్ స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి పోలీసులు తప్పు అని తేల్చారు. ఎస్ఐ సుమన్ మాలిక్ ను సస్పెండ్ కూడా చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రజలు పోలీసులు ఇలా చేస్తే దొంగలు ఏ విధంగా చేస్తారని దుమ్మెత్తిపోస్తున్నారు.