సుజీత్ కోసం తల్లడిల్లుతోన్న తమిళనాడు... క్షేమంగా బయటికి రావాలంటూ మోడీ ట్వీట్

తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గర బోరుబావిలో పడ్డ బాలుడ్ని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు... సుజీత్‌ను సురక్షితంగా బయటికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వి బాలుడిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బావిలోకి ఆక్సిజన్ పంపుతూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుజిత్ విల్సన్ ఇంటి సమీపంలో ఆడుకుంటూ వినియోగంలో లేని బోరు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాలుడు 35 అడుగుల లోతులో ఉన్నట్లు కెమెరాల ద్వారా గుర్తించారు. పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తూ, బోరు బావికి పక్కన తవ్వకం చేపట్టారు. అయితే, రాయి అడ్డు తగలడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. మరోవైపు అక్కడ భూమి తడిగా ఉండటంతో, మొదట 30 అడుగుల నుంచి 70 అడుగులకు, ఆ తర్వాత 90 అడుగుల కిందకి బాలుడు జారిపోయాడు.

అదే సమయంలో మట్టి పేరుకుపోవడంతో బాలుడి పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు అప్పటివరకు వినిపించిన బాలుడు ఏడుపు కూడా ఆగిపోయింది. దాంతో బాలుడు క్షేమంగా ఉన్నాడో లేదోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అయితే, బాలుడు క్షేమంగా రావాలంటూ తమిళనాట ప్రజలు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పళిని నుంచి సూపర్ స్టార్ రజనీ వరకు అందరూ సుజీత్... సేఫ్ గా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం సుజీత్ కోసం ఆరా తీశారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సుజీత్ క్షేమంగా బయటికి రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్విట్టర్లో మోడీ తెలిపారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ను స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం... బాలుడు అపస్మారకస్థితిలో ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయన్నారు. అయితే, నిరంతరం ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.

Teluguone gnews banner